మోసం చేసిన స్నేహితులతో సీఐ కుమ్మక్కు.. దిక్కుతోచక రైతు ఆత్మహత్య
posted on Aug 20, 2020 @ 6:30PM
గుంటూరు జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. న్యాయం చేయాల్సిన సీఐ వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు జరిగిన మోసం పై జిల్లా ఎస్పీకి చేసిన ఫిర్యాదును కూడా సీఐ తప్పుదోవ పట్టించి తిరిగి వేధింపులకు పాల్పడటంతో ఆ అభాగ్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన ఆత్మహత్యకు కల కారణాలను, అలాగే తన ఆవేదనను.. ఆత్మహత్యకు ముందే ఒక సెల్ఫీ వీడియోలో ఆ రైతు రికార్డ్ చేసాడు.
వివరాల్లోకి వెళితే బసవయ్య అనే ఆ రైతును వ్యాపారంలో కొందరు భాగస్వాములు మోసం చేశారు. స్వతహాగా తాను అకౌంటెంట్ కావడం వల్ల కాటన్ బిల్లుల వ్యాపారం బాగుంటుందని నమ్మించి బ్యాంకులో లోన్లతో పాటు ప్రజల వద్ద నుంచి అప్పులు తీసుకొచ్చేలా చేసి స్నేహితులే మోసం చేశారని బసవయ్య సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
దీనిపై బసవయ్య జిల్లా ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. అయితే నిందితులతో కుమ్మక్కైన పట్టాభిపురం సీఐ కళ్యాణ్ రాజ్ కేసును తప్పుదోవపట్టించి రివర్స్ లో బసవయ్యను వేధించడం ప్రారంభించాడు. ఒక పక్క స్నేహితుల చేతిలో మోసపోవడంతోపాటు మరోపక్క సీఐ నుండి వేధింపులు ఎక్కువ కావడంతో ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
బసవయ్య ఆత్మహత్య తరువాత.. దీని పై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా .. అందులో సీఐ కళ్యాణ రాజు పేరు లేకుండా చేయాలని బాధితులపై పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే సీఐ కళ్యాణ రాజుపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది.