ఫామ్ హౌస్ కేసు.. తెర వెనుక ఏదో జరుగుతోందా?
posted on Jan 19, 2023 7:18AM
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ట్రాప్ చేసి పట్టుకున్న ఫామ్ హౌస్ కేసు ఎటూ కాకుండా ఇరుక్కుపోయింది. సిట్ దర్యాప్తును వేసి.. బీఎల్ సంతోష్ లాంటి బీజేపీ పెద్ద తలకాయని ఇరికించేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినా చివరికి రివర్స్ అయింది. హైకోర్టు కేసును సీబీఐకి ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ వ్యూహం దెబ్బతింది. అనుకున్నదొకటీ అయినదొకటీ అన్నట్లుగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యుత్సాహం పార్టీ చేతిలోని ఆయుధాన్ని ప్రత్యర్థికి అప్పగించిందని పార్టీవర్గాలే అంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విషయంలో కేసీఆర్ బీజేపీ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టానని సంబరపడినంత సేపు పట్ట లేదు.. ఆ కేసు తిరిగి తిరిగి తమ పార్టీ ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటోందని తెలియడానికి.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. కేంద్రానికేనా దర్యాప్తు సంస్థలు.. రాష్ట్రాలకు లేవా అంటూ ఈ కేసు దర్యాప్తునకు సీట్ ను ఏర్పాటు చేసినప్పుడు పార్టీ క్యాడర్ లో, పార్టీ మారాలంటూ తమను ప్రలోభ పెట్టారంటూ ఫిర్యాదు చేసిన అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపించిన ధీమా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించడంతో నీరుగారిపోయింది. ఇందుకు ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గాభరా, కంగారూ నిదర్శనం. ట్రాప్ జరిగిన సమయంలో పోలీసులు కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు జరిగిన ప్రచారమే కానీ, అందుకు తగ్గ ఆధారాలు ఇప్పటికీ బయటకు రాలేదు. నిజంగా అప్పట్లో సొమ్ము బయటపడి ఉంటే.. ఈడీ ఈ పాటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించేసి ఉండేది. అయితే ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే అప్పట్లో సొమ్ము రికవరీ చూపలేదన్న వాదన కూడా ఉంది.
అయితే ఫామ్ హౌస్ కేసులో సొమ్ములు కనిపించకపోయినా వ్యూహాత్మకంగా ఈడీ రంగప్రవేశం చేసింది. ఆ వెను వెంటనే హైకోర్టు సీబీఐకి కేసు అప్పగించింది. దీంతో ఈ కేసు విషయంలో ఒక తార్కిక ముగింపునకు ఎంతో సమయం పట్టదన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లోనూ, రాజకీయ వర్గాలలోనూ కూడా వ్యక్తమైంది. సీబీఐ, ఈడీల రంగ ప్రవేశంలో ఇక ఫామ్ హౌస్ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, సింహ యాజులు, హైదరాబాద్కు చెందిన నందకుమార్లే కాక, ఫిర్యాదు చేసి నలుగురు ఎమ్మెల్యేలూ కూడా దర్యాప్తు సంస్థల స్కాన్ లోనే ఉంటారు.
ఎవరు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించారన్న దగ్గర నుంచి, ఎలా ట్రాప్ చేశారు, సొమ్ముల సమీకరణ ఎలా వరకూ అన్ని అంశాలనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలుగులోనికి తీసుకు వస్తాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో సిట్ వైపు నుంచి మాత్రమే వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు సిట్ ఇంత వరకూ చేసిన దర్యాప్తు, వెల్లడించిన విషయాలూ అన్నీ పక్కకు వెళ్లిపోతాయి. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం ఇక సిట్ కు లేదు. సో.. ఆ దర్యాప్తును అంతా పక్కన పెట్టేసి కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రోహిత్ రెడ్డి కంగారు పడుతున్నారు.
ఈడీ, సీబీఐలకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారమే లేదంటున్నారు. హైకోర్టు ఫామ్ హౌస్ ట్రాప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రోహిత్ రెడ్డి తన స్పందన తెలిపారు. కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారన్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని నిందలేశారు. కోర్టు తీర్పు మేరకే కేసును సీబీఐ దర్యాప్తు చేయనుందన్న సంగతి విస్మరించి మరీ బీజేపీపై నిందలేశారు. అంతకు ముందు ఇదే కేసుకు సంబంధించి తనను ఈడీ విచారించిన తరువాత కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు.
రెండు సందర్భాలలోనూ ఆయనలో ఆందోళన, గాభరా స్పష్టంగా కనిపించింది. మీడియా ముందుకు రాలేదు కనుక మిగిలిన ముగ్గురూ ఎలా ఫీల్ అవుతున్నారన్న సంగతి తెలియడం లేదు.. కానీ ఈ ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో మొదటి నుంచీ క్రియాశీలంగా ఉన్నదీ, కీలకంగా వ్యవహరించినదీ పైలట్ రోహిత్ రెడ్డే. ఈడీ విచారణ అనంతరం తనపై కేసులు నమోదౌతాయనీ, అరెస్టు చేస్తారనీ అనుమానం వ్యక్తం చేసిన ఆయన నందకుమార్ ఫిర్యాదు మేరకే తనపై కేసులు పెడతారన్నారు. అయినా ఫామ్ హౌస్ లో డబ్బుల చెలామణియే జరగలేదనీ, అలాంటప్పుడు కేసులు ఎలా పెడతారనీ కూడా ప్రశ్నించారు.
అసలు వాస్తవానికి రోహిత్ రెడ్డి నందకుమార్ ద్వారా బీజేపీ పెద్దలు తనను ప్రలోభపెట్టారనీ, పార్టీ మారితే వందకోట్లు ఇస్తామని ప్రతిపాదించారనీ ఆరోపించారు. ఇంతకీ ఈ నందకుమార్ స్వయంగా రోహిత్ రెడ్డికి పార్టనర్. ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్ కేసులో ఇంత వరకూ బయటపడని మరింత లోతైన వ్యవహారం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ అనుమానాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడౌతాయని పరిశీలకులు అంటున్నారు. అలా వెల్లడౌతాయన్నకంగారు రోహిత్ రెడ్డి మాటల్లో బయటపడుతోందనీ అంటున్నారు. మొత్తం మీద సిట్ దర్యాప్తు తో బీఆర్ఎస్ నేతల్లో కనిపించివన ధీమా ఇప్పుడు హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోనికి దిగనుండటంతో ఆవిరైపోయినట్లే అన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. అయితే ఆ తరువాతే కథ విచిత్రంగా మలుపులు తిరుగుతోంది. కేసును సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ అప్పీల్ కు వెళ్లింది. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
అంతే ఇటు సిట్ దర్యాప్తుతో పాటు సీబీఐ దర్యాప్తు కూడా నిలిచిపోయింది. సీబీఐ విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు అయినా ఆ దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించలేదు. జనరల్ కన్సంట్ లేదన్న సాకు చూపుతూ వాచారణ కోసం సీబీఐ తెలంగాణ సర్కార్ కు లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినందున అలా అనుమతి కోరాల్సిన అవసరమే లేదు. అయినా సీబీఐ అనుమతి కోరుతూ లేఖ రాసింది. కోర్టు తీర్పు కారణంగా అనుమతి నిరాకరించే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. అందుకే అనుమతి నిరాకరించనూ లేదు.. అలాగని అనుమతి ఇవ్వనూ లేదు. ఇటు తెలంగాణ సర్కార్, అటు సీబీఐ కూడా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయని భావించాలి. అన్నిటికీ మించి ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా హఠాత్తుగా అనూహ్యంగా మౌనం దాల్చాయి. కేసు కోర్టు పరిధిలో ఉంది కనుక మాట్లాడటం లేదని అనుకోవడానికి కూడా లేదు. దీంతో ఈ నిశబ్దం ఈ కేసు విషయంలో తెరవెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.