పూజలు చేస్తే చదవకుండానే ఎంబీబీస్ పాస్.. దొంగ స్వామిజీ లీలలు
posted on Sep 6, 2021 @ 12:55PM
పరీక్ష పాస్ కావాలంటే బాగా చదవాలి.. కాని చదవకుండానే పరీక్ష పాసైతే.. అసలిది సాధ్యమేనా... అంటే అవునంటున్నాడు ఓ బాబా.. తాను చేసిన పూజ చేస్తే చదవకుండానే ఎంబీబీస్ పరీక్ష కూడా ఈజీగా పాసై పోవచ్చంటున్నాడు. ఈ బాబా ఎక్కడో లేడు.. మన హైదరాబాద్ లోనే. ఉద్యోగం దొరకడం లేదా? పరీక్షల్లో పాస్ కావడం లేదా? ఏదైనాసరే పూజలతో ఈజీగా మీ సమస్యను పరిష్కరిస్తానంటూ ఓ దొంగ బాబా ఇచ్చిన ప్రకటనను నమ్మి నిండా మునిగిపోయింది ఓ యువతి.
ఓ ఎంబీబీఎస్ పట్టభద్రురాలు ఓ స్వామిజీని నమ్ముకుంది. పూజలు చేస్తే చాలూ.. పాస్ అయిపోతావని ఆ కేటుగాడు చెప్పిన మాటలను నమ్మి దాదాపు రూ.80 వేలు సమర్పించుకుంది. ఎంతకూ పరీక్షలో పాస్ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింద. దొంగ బాబా చేతిలో మోసపోయింది సాధారణ యువతి కాదు.. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన మహిళ. ఈ ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ ప్రస్తుతం హైదరాబాద్లోని కొండాపూర్లో నివాసముంటోంది. 2011లో ఆమె విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. అయితే మన దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. ఈ మహిళ పలుమార్లు ఎఫ్ఎంజీఈ పరీక్షలకు హాజరైనా ఉత్తీర్ణత కాలేదు. ఈ క్రమంలోనే బాధితురాలి సోదరికి ఓరోజు ఫేస్బుక్లో ఓ పోస్ట్ కనిపించింది. ‘బిస్వజిత్ ఝా’ అనే స్వామిజీ పూజ చేస్తే చాలూ.. ఎలాంటి పరీక్షయినా పాస్ కావొచ్చని దానిలో ఉంది. వెంటనే ఆమె ఆ స్వామిజీ ఫేస్బుక్ ఖాతాను వెతికి మెసేజ్ చేసింది. అటువైపు నుంచి వెంటనే స్పందన రావడంతో.. తన సోదరి పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె స్వామిజీకి వివరించింది. దీంతో ఆ స్వామిజీ జాతక దోషాలున్నాయంటూ ఆమెకు ఎవేవో ముచ్చట్లు చెప్పాడు. చివరకు ఆమెకు నమ్మకం కుదరడంతో తన సోదరి నంబర్ స్వామీజికి ఇచ్చింది.
ఆ తర్వాత స్వామిజీకి సంబంధించిన వ్యక్తులు బాధితురాలిని సంప్రందించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. హాల్ టిక్కెట్ ఫొటో తీసి వాట్సాప్లో పంపమనడంతో ఆమె.. పంపింది. పూజ చేయాలంటే కొంత ఖర్చవుతుందని చెప్పడంతో ఆమె మొదట రూ.21,500 నగదును ఆన్లైన్లో పంపించింది. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన పరీక్షలో ఆమె పాస్ కాలేదు. ఇలా ఎందుకు జరిగిందంటూ స్వామిజీని ప్రశ్నించడంతో పూజలో లోపం జరిగిందంటూ మళ్లీ నమ్మబలికాడు.
అనంతరం మళ్లీ ప్రత్యేక పూజలు చేద్దామని.. ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతావంటూ నమ్మించాడు. దీనికి కూడా ఆమె అంగీకరించి మళ్లీ డబ్బులు పంపించింది. ఈ ఏడాది కూడా ఆమె పాస్ కాకపోవడంతో మళ్లీ స్వామిజీకి ఫోన్ చేసింది. ఎందుకిలా జరిగిందంటూ ప్రశ్నించడంతో అటువైపు నుంచి స్పందన రాలేదు. దీంతో చివరకు మోసపోయినట్లు ఆమె గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.
ఈ స్వామిజీ వలలో చాలామంది విద్యావంతులు చిక్కినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.