తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు
posted on Jul 4, 2025 @ 9:49AM
తిరుమల కొండపై ఏనుగులు హల్ చల్ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోనే ఏనుగుల గుంపు తిష్టవేసి ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
యువకులు గట్టిగా కేకలు వేయడంతో ఏనుగుల గుంపు కొద్దిగా వెనక్కు వెళ్లింది. గత కొద్ది రోజులుగా శేషాచలం అడవుల నుంచి ఏనుగులు సమీప గ్రామాలలోకి ప్రవేశించి పంటపొలాలను ధ్వంసంచేసిన ఘటనలు జరిగాయి. దీంతో వాటిని తిరిగి అడవుల్లోకి తరిమేసేందుకు అధికారులు శతథా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏనుగులు ఏకంగా తిరుమల ఘాట్ రోడ్డు పైకి రావడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ అధికారులు రంగ ప్రవేశం చేసి ఏనుగులను అడవిలోనికి తరిమివేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.