మోడీ సభకు వచ్చే జనాల కోసం 8వేల బస్సులు
posted on May 1, 2025 @ 4:10PM
అమరావతి నిర్మాణ పనుల పున్: ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (మే2)న రానున్న నేపథ్యంలో తెలుగుదేశం కూటమి సర్కార్ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటనలో ఎటువంటి లోటుపాట్లూ లేకుండా అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ పర్యటనలో భాగంగా రోడ్ షో తో పాటు భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. దీంతో జనసమీకరణకు అన్ని చర్యలూ లీసుకుంది. ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ దాదాపు ఐదులక్షల మంది వస్తారన్న అంచనాలతో ఏర్పట్లు చేశారు. కనీసం ఎనిమిది వేల బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రాజధానికి సమీపంలోని ఎనిమిది జిల్లాల నుంచి వచ్చే జనాల కోసమే 6600 బస్సులను, మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే జనాల కోసం 1400 బస్సులను కేటాయించింది. అలాగే జనాలను తరలించడానికి వినియోగించే అన్ని బస్సులలోనూ ప్రభుత్వ ఉద్యోగులను ఇన్ చార్జీలుగా నియమించింది. అంటే ఒక్కో బస్సుకూ ఒక్కో ఉద్యోగిని నియమించిందన్న మాట. ప్రధాని మోదీ సభకు, రోడ్ షోలకు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొని రావడంతో పాటుగా వారిని ఆయా ప్రాంతాలకు క్షేమంగా తరలించే బాధ్యతలను కూడా ఇన్ చార్జిలకే అప్పగించింది
సభకు తరలి వచ్చే ప్రజలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనం సదుపాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం కల్పించనుంది. అలాగే వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచి నీళ్లు, పండ్లు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించింది. అంతేకాకుండా సభ ప్రాంగణంలోను, సభా గ్యాలరీల్లోను ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఆరుగురు సిబ్బందితో కూడిన వైద్య బృందాలు వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఇక శుక్రవారం (మే 2) మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో ప్రధాని అమరావతికి చేరుకుంటారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలను సభకు రావాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు.