పశ్చిమ బెంగాల్ లో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు.. బయటపడ్డ వైసీపీ ఆర్థిక లోసుగులు

ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్థిక నేరం జరిగినా దానితో వైసీపీకి ఉన్న లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది.  పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు ఐ ప్యాక్ సంస్థ ఎన్నికల వ్యూహాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఐప్యాక్ తో తృణమూల్ అనుబంధం 2021 ఎన్నికలకు ముందు నుంచీ ఉంది. అలాగే ఇదే ఐ ప్యాక్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్  రెడ్డికి కూడా 2024 ఎన్నికలలో  ఇటువంటి సహకారమే అందించింది. అది పక్కన పెడితే  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో..  గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది.

ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోల్ కతా ఈడీ సోదాల్లో..  జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్‌ కసిరెడ్డికి చెందిన పలు కీలక డాక్యుమెంట్లు ఈడీకి లభించినట్టు తెలుస్తోంది. ఈ రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ జరిపిన సోదాలలో లభ్యం కావడంతో, ఈడీ రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి దర్యాప్తునకు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తోంది.  

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

   పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న  కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే అవకాశం ఉంది. వరుసగా తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అత్యధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ రికార్డు ఉంది. ఆయన రెండు దఫాల్లో 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

చైల్డ్ పోర్న్‌పై సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్... 24 మంది అరెస్ట్

  తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన సంచలన ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పిల్లలపై జరుగుతున్న ఆన్‌లైన్ లైంగిక దుర్వినియోగాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఒక్కరోజు వ్యవధిలోనే 18 ప్రత్యేక బృందాలతో తెలంగాణ వ్యాప్తంగా దాడులు నిర్వహించిన అధికారులు, చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను చూస్తూ, షేర్ చేస్తూ, అప్లోడ్ చేస్తున్న 24 మంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అత్యధికంగా హైదరాబాద్ నగరానికి చెందిన వారే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండటం సంచలనంగా మారింది. నిందితుల వయస్సు 18 నుంచి 48 సంవత్సరాల మధ్య ఉండగా, వారంతా మధ్యతరగతి వర్గానికి చెందినవారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులే కావడం గమనార్హం. అరెస్ట్ అయిన నిందితుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ స్టోరేజ్ పరికరాలను ఫోరెన్సిక్ పరిశీలన చేయగా, వీరి వద్ద భారీగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు లభ్యమయ్యాయి. ఈ వీడియోలు ప్రధానంగా విదేశాలకు చెందిన 4 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల మైనర్ బాలికలవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా యాప్‌లు, ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫార్ములు, మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఈ కంటెంట్‌ను షేర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.ఈ వ్యవహారంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మాట్లాడుతూ, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన నేరాలపై ఏమాత్రం ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.  ఐటీ యాక్ట్‌తో పాటు పోక్సో చట్టం కింద నిందితులపై కఠిన కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తరహా నేరాల్లో పాల్గొన్నవారిని గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో మరింత నిఘా పెంచుతున్నట్లు తెలిపారు. చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను చూడడం, డౌన్‌లోడ్ చేయడం, షేర్ చేయడం కూడా నేరమేనని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఇటువంటి కంటెంట్‌పై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సంచలన ఆపరేషన్‌తో తెలంగాణలో చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో స్పష్టమైందని, పిల్లల భద్రతే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలన విషయాలు

  తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యికి సంబంధించి కల్తీ ఆరోపణల కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నెయ్యి సరఫరా చేస్తున్న కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు లంచాలు తీసుకున్నట్టు టీటీడీ డైరీ ఎగ్జిక్యూటివ్ విజయ భాస్కర్ రెడ్డి అంగీకరించినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఆయనను A-34గా పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ  కోర్టులో విజయ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, సిట్ తరఫున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించగా వాటిని సమర్థిస్తూ బెయిల్‌ను తిరస్కరించింది. సిట్ వివరాల ప్రకారం 2023లో భోలే బాబా కంపెనీ నుంచి రూ.75 లక్షల లంచం, ప్రీమియర్ కంపెనీ నుంచి రూ.8 లక్షలు, ఆల్ఫా డైరీ నుంచి ఎనిమిది గ్రాముల బంగారం లంచంగా స్వీకరించినట్టు బయటపడింది. నిందితుడు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ విషయాన్ని వెలిబుచ్చారు.  ఇవన్నీ హవాలా మార్గంలో స్వీకరించినట్టు సిట్ గుర్తించింది. 2019 నుంచి 2024 వరకు సంబంధిత కంపెనీల పనితీరు సరైన విధంగా లేకపోయినా, నెయ్యి క్వాలిటీ బాగుందని తప్పుడు రిపోర్టులు ఇచ్చిన కారణంగా టిటిడికి సుమారు రూ.118 కోట్ల మేర నష్టం జరిగినట్టు విచారణలో తేలింది. ఇప్పటికే విజయ భాస్కర్ రెడ్డి నుండి సిట్ రూ.34 లక్షలను సీజ్ చేసింది. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని అసిస్టెంట్‌ పీపీ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. విజయ భాస్కర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌‌ను చేసింది. 

పాలసీల స్థిరత్వమే పెట్టుబడుల ప్రవాహానికి బలం : మంత్రి లోకేష్

  మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కీలకోపన్యాసం చేశారు. గతంలో ఏపీలో పీపీఏలను రద్దుచేయడంతో 2019–24 మధ్య అనేక కంపెనీలు భయపడి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని ఆయన అన్నారు. అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు, పాలసీల స్థిరత్వం అత్యంత కీలకమని ప్రజలు కూడా చైతన్యవంతులుగా ఉండాలని సూచించారు. రాష్ట్ర పరిపాలనలో టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెనెన్స్ ద్వారా 36 శాఖలకు చెందిన వెయ్యికి పైగా సేవలను ప్రజలకు సులభంగా అందిస్తున్నామని చెప్పారు. ఏఐ ఆధారంగా స్కిల్ సెన్సస్, ల్యాండ్ రికార్డులను బ్లాక్‌చైన్‌పైకి తీసుకురావడం వంటి విప్లవాత్మక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ కంపెనీలు ఏపీపై చూపుతున్న నమ్మకానికి మూడు కారణాలున్నాయని చెప్పారు—నిరూపితమైన నాయకత్వం, వేగవంతమైన అనుమతి విధానం, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో పనిచేసే “డబుల్ ఇంజిన్” ప్రభుత్వం. పరిశ్రమలకోసం “లిఫ్ట్ పాలసీ” అమలు చేస్తున్నామని, టాలెంట్, నీరు, విద్యుత్ వంటి వనరులతో పాటు వేగవంతమైన అనుమతులు అందించడం వల్లే పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని వివరించారు. క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్లు, రిన్యూవబుల్ ఎనర్జీ, స్పేస్, ఎలక్ట్రానిక్స్ మొదలైన రంగాల్లో పెద్ద ఎత్తున ఎకోసిస్టమ్ నిర్మాణం జరుగుతోందని లోకేష్ తెలిపారు. రాజకీయ సంకల్పంతో, పారదర్శక విధానాలతో భారీ ఎఫ్‌డీఐలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం గెలుస్తుందనీ, ఇందుకోసం పాలసీల స్థిరత్వమే ప్రధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.  

"రాజాసాబ్" సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్  విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటీషనర్ తరఫున వాదించిన న్యాయవాది విజయ్ గోపాల్, నిబంధనలకు విరుద్ధంగా సినిమా టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హోంశాఖ కార్యదర్శికి టికెట్ ధరల పెంపుపై మెమో జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు, హైదరాబాద్ పరిధిలో సీపీ మాత్రమే టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని వాదించారు. నిబంధనలకు విరుద్ధంగా మెమో జారీ చేసిన అధికారిపై రూ.5 లక్షల జరిమానా విధించాలని కూడా కోర్టును కోరారు. అంతేకాకుండా గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియకుండానే టికెట్ రేట్ మెమోలు జారీ అయ్యాయని చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టు ముందు ప్రస్తావించారు. వాదనలు విన్న హైకోర్టు, సినిమా టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ అంతటా ఒకే రకమైన టికెట్ ధర ఉండేది. మేము కూడా సినిమాలకు వెళ్లాం, మాకు టికెట్ ధరలు తెలుసు” అంటూ వ్యాఖ్యానించింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. నిబంధనలు ఏమిటో మెమో జారీ చేసే అధికారికి తెలియదా అని కోర్టు నిలదీసింది. టికెట్ రేట్లకు సంబంధించిన మెమోలపై విచారణ జరగడం ఇదే మొదటిసారి కాదని, ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ ఆలోచనా విధానం ఎందుకు మారడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపిస్తూ, టికెట్ ధరల పెంపు వల్ల ఇబ్బందిపడేది ప్రైవేట్ వ్యక్తులే తప్ప, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని తెలిపారు. ఇది కేవలం ఒక రిట్ పిటిషన్ మాత్రమేనని పేర్కొన్నారు.  సినిమా యూనిట్ కోరిన అన్ని సడలింపులకు ప్రభుత్వం అంగీకరించలేదని, కొన్నింటికే మాత్రమే అనుమతి ఇచ్చామని వివరించారు. అలాగే టికెట్ ధరల పెంపులో భాగంగా 20 శాతం లాభాలను సినీ కార్మికులకు ఇవ్వాలనే షరతు విధించినట్లు తెలిపారు. దీనివల్ల సినీ కార్మికులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. అయితే సినీ కార్మికుల అసోసియేషన్‌ను పార్టీగా చేర్చకుండా వారి వాదనలు వినకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై మరింత విచారణ అవసరమని భావించిన హైకోర్టు, తదుపరి విచారణకు కేసును వాయిదా వేసింది.  

పది నెలల కొడుకుకు విషమిచ్చి తల్లి సూసైడ్

    హైదరాబాద్‌ నగర శివారులోని మీర్‌పేట్ ప్రాంతంలో చోటు చేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక తల్లి తన పది నెలల పసికందుకు విషమిచ్చి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. మీర్‌పేట్‌కు చెందిన సుస్మితకు యశ్వంత్ రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు పది నెలల వయసున్న కుమారుడు యశ్వవర్ధన్ రెడ్డి ఉన్నాడు. యశ్వంత్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తు న్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత తన కుమారుడికి విషమిచ్చి అనంతరం తానూ ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. ఘటన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, కూతురు సుస్మితతో పాటు పసికందు యశ్వవర్ధన్ మృతదేహాలను చూసి అమ్మమ్మ తీవ్రంగా కలత చెందింది. ఈ షాక్‌ను తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటనతో మీర్‌పేట్ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ విధంగా ఒక కుటుంబం పూర్తిగా ఛిన్నాభిన్నం కావడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా...ఎందుకంటే?

  టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడుకు పంపారు. తనపై ఓ ప్రముఖ పత్రికలో తనపై వచ్చిన తప్పుడు కథనాల వల్ల మనస్తాపంతో రిజైన్ చేస్తున్నానని లేఖలో జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అయితే జంగాకు టీటీడీ కేటాయించిన భూమిని కేబినెట్ రద్దు చేయడమే కారణమని తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆయన మనస్థాపం చెందారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం జంగా రాజీనామా చర్చనీయాంశంగా మారింది.  అయితే గతంలో తిరుమల బాలాజీనగర్‌లో ప్లాట్ నెంబర్ 2ను జంగాకు కేటాయించారు. ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగా ఉండటంతో మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జంగాకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని తీర్మానించారు. గతంలో తనకు కేటాయించి.. రద్దు చేసిన భూమిని తాను చైర్మన్‌గా ఉన్న ఓం శ్రీ నమో వెంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్‌కు మళ్లీ కేటాయించాలని టీటీడీని కోరానంటూ జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఇది ఎలా తప్పు అవుతుందంటూ జంగా ప్రశ్నించారు . తాను ఈ నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకు ఇబ్బంది వస్తుందనే ఈ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. ముచ్చటగా మూడోసారి తిరుమల శ్రీవారి సేవ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు తనకు అవకాశం కల్పించారని  కృష్ణమూర్తి తెలిపారు.  

తెలుగు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరించుకుందాం : సీఎం రేవంత్‌

  పక్క రాష్ట్రంతో సయోధ్య లేకుండా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం అవసరం అని ముఖ్యమంత్రి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కంటే పరిష్కారానికే తాను మొగ్గు చూపుతానని తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని రేవంత్ పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని తెలిపారు. దేశంలో పోర్టు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని...అందుకే మచిలీపట్నం పోర్టు నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి 12 లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్రం అనుమతులు అడిగామని ముఖ్యమంత్రి అన్నారు.  పోర్టు కనెక్టివిటీ ఉంటేనే మానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు వస్తాయిని సీఎం తెలిపారు. ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో సయోధ్య, సహకారం ఉండాలని తెలిపారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదు తెలిపారు. రాష్ట్రంపై ఆర్ధిక భారం కూడా పడుతోందని పేర్కొన్నారు. మేం వివాదం కోరుకోవడంలేదు, పరిష్కారం కోరుకుంటున్నామని  రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.   మరోవైపు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అనవసరంగా తెలుగు రాష్ట్రాలమధ్య గొడవలు వద్దు. మాకు రెండు రాష్ట్రాల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే కొంతమంది నీళ్లొద్దు గొడవలే కావాలంటున్నారని చంద్రబాబు అన్నారు. అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు వద్దని చంద్రబాబు హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఓ వీరుడు బయలుదేరాడని అని ఆయన తెలిపారు. 

హైకోర్టులో డీజీపీ శివధర్‌రెడ్డికి ఊరట

  తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో కీలక ఊరట లభించింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు డీజీపీగా శివధర్‌రెడ్డి కొనసాగడంపై తాత్కాలిక అడ్డంకులు తొలగినట్ల య్యాయి.ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ నియామకానికి సంబంధించి రెగ్యులర్ ప్రాసెస్‌ను తప్పనిసరిగా నాలుగు వారాల్లో పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యంగా యూపీఎస్సీ  ద్వారా జరగాల్సిన నియామక ప్రక్రియను నిర్ణీత గడువులోగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూపీఎస్సీ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కూడా హైకోర్టు సూచించింది. నియామకంలో విధివిధానాలు, నిబంధనలు పూర్తిగా పాటించాలన్న అంశంపై కోర్టు స్పష్టతనిచ్చింది. డీజీపీ నియామక వ్యవహారంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ప్రభుత్వం యూపీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికి, డీజీపీ శివధర్‌రెడ్డికి ప్రస్తుతం హైకోర్టు నుంచి ఊరట లభించినప్పటికీ, తుది నియామకం విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ కేసుపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

నేను నెంబర్ వన్ యాక్టర్‌ని కాదు..కానీ : పవన్ కళ్యాణ్

  తాను నెంబర్ వన్  యాక్టర్‌ను కాకపోయిన తన సినిమా ప్లాప్ అయిన డబ్బు సంపాదించగలిగే కెపాసిటీ తనకు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు.  ప్రజల మద్దతు, ప్రేక్షకులకు మద్దతునే ఇది తనకు సాధ్యమైందని పవన్ తెలిపారు. అయిన సరే తాను రాజకీయాల్లోకి ఎందుకువచ్చానంటే...ప్రజాసేవను తాను బాధ్యతగా భావించానని చెప్పారు.   పిఠాపురంలో చిన్న చెట్టు మీద పక్షి ఈక రాలిపడినా బిగ్ న్యూస్ అయిపోతుందని డిప్యూటీ సీఎం అన్నారు. పిఠాపురంలో తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి మానవ సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారన్నారు. తాను  పిఠాపురం శాసన సభ్యుడిగా గెలిచిన కేవలం ఏడాదిలోనే రూ.308 కోట్లను నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించానని తెలిపారు. మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. పిఠాపురం సింగపూర్ తరహాలో వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థలా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. ఫంక్షన్లకు హాజరు కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పవన్ తెలిపారు. తాను ఎక్కడా ఉన్నా తన గుండెల్లో పిఠాపురం ఉంటుందనే విషయం పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోవాలని విన్నవించారు.తాను నల్గొండ ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో సమస్యలు చూసి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అని డిప్యూటీ సీఎం తెలిపారు.