ఎఎస్పీని చంపాలని చూసిన ఎస్పీ?

తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు పోలీస్ బాసులు బాహాటంగా కొట్టుకుంటున్నారు. ఎస్పీ త్రివిక్రమవర్మకు ఎఎస్పీ నవీన్ కుమార్ కి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఎస్పీ తనను చంపడానికి ప్రయత్నించారని అడిషనల్ ఎస్పీ నవీన్ కుమార్ ఆరోపించారు. జీపు స్టీరింగ్ బోల్డ్ ని ఊడదీయించి తనను హత్యచేసేందుకు కుట్రచేశారని ఆరోపించారు. అదృష్టం బాగుండి బతికి బైటపడ్డానని
చెబుతున్నారు. గంజాయి స్మగ్లర్లనుంచి ఒత్తిడి ఎక్కువకావడంవల్లే త్రివిక్రమవర్మ తనను వేధిస్తున్నారని ఎఎస్పీ ఆరోపిస్తున్నారు. తను చార్జ్ తీసుకున్న దగ్గర్నుంచి గంజాయి స్మగ్లర్లను ఏరేస్తున్నానని, లంచాలకోసం పాకులాడే ఎస్పీ.. ఆ కారణంగా తనపై కక్షకట్టి  ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఎస్పీకి వ్యతిరేకంగా కేసు నమోదుచేసేందుకు రంపచోడవరం పోలీస్టేషన్ అధికారులు సహకరించకపోవడంతో నవీన్ కుమార్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గోపాలకృష్ణను కలిసి ప్రైవేట్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డ్రైవర్ బసవ దగ్గరుండి గంజాయి స్మగ్లింగ్ మామూళ్లను వసూలు చేస్తాడని, ఎస్పీకి వాటాని పంపిస్తాడని ఎఎస్పీ నవీన్ కుమార్ చెబుతున్నారు.

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.