పుస్తక పఠనం ద్వారా క్రియేటివ్ థింకింగ్.. నారా లోకేష్
posted on Sep 22, 2025 @ 4:05PM
ఇటీవలి కాలంలో పుస్తక పఠనం అన్నది యువత, చిన్నారులలో బాగా తగ్గిపోయిందని ఆంద్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 22) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే గణబాబు గ్రంథాలయాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు నారా దేవాంశ్ ను ప్రస్తావించారు. ఇటీవల తాను లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలో తాను ఐదు పుస్తకాలను కొని తిరిగి వచ్చాకా దేవాంశ్ కు ఇచ్చాననీ, వాటిని అతడు ఐదు రజులలో చదివేశాడనీ చెప్పారు. తన కుమారుడికి పఠనాశక్తి ఎక్కువ అన్న లోకేష్.. పుస్తకాలు చదవడం అన్నది చాలా మంచి అలవాటని అన్నారు.
రాష్ట్రంలో గ్రంథాలయాలకు పెద్ద పీట వేయడం ద్వారా యువత, పిల్లలలో పఠనాశక్తి పెంపొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రపంచ స్థాయి గ్రంథాలయాల అభివృద్ధి కోసం షోబాబెవలపర్స్ సంస్థ వంద కోట్ల రూపాయలతో ముందుకు వచ్చిందన్నారు. రెండేళ్లలో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయనీ, వాటిని 26కు పెంచుతామనీ చెప్పారు.
ఇక పోతే గ్రంధాలయాల్లో పుస్తకాల కొనుగోలు కూడా సరిగా జరగడంలేదన్న ఆయన.. అవసరమైన పుస్తకాల జాబితాను ఇస్తే ఆ మేరకు పుస్తకాలను కొనుగోలు చేసి వాటిని గ్రంధాలయాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. మొబైల్స్కి పిల్లలను దూరంగా ఉంచుతూ.. లైబ్రరీలకు దగ్గర చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేష్ చెప్పారు.