కరోనాకు హైదరాబాద్ నుంచే మరో టీకా!
posted on Mar 27, 2021 @ 4:54PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు భారీగా డిమాండ్ వస్తోంది. దాదాపు 40 దేశాలు కోవాగ్జిన్ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. అయితే కరోనా వ్యాక్సిన్ల తయారీలో కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్ నుంచి మరో టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. నోరు, ముక్కు ద్వారా చుక్కల రూపంలో అందించే వీలున్న ‘నియోకోవ్’టీకా హైదరాబాద్ లోనే తయారు కాబోతోంది.
నియోకోవ్ టీకాను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్కు చెందిన నియోడెల్ ఫార్మా కంపెనీ, అమెరికాలోని అట్లాంటాకు చెందిన ఎమోరి విశ్వవిద్యాలయం నుంచి పేటెంట్స్ పొందింది. మశూచీ టీకాల తయారీకి ఉపయోగిస్తున్న మాడిఫైడ్ వ్యాక్సినా అంకారా సాంకేతిక పరిజ్ఞానంతో నియోకోవ్ తయారుకానుంది. అమెరికా-భారత్ ఉమ్మడి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్ను సిద్ధం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. మిగిలిన టీకాలకు భిన్నంగా ఇది వైర్సను ఎక్కువకాలం పాటు సమర్ధంగా అడ్డుకుంటుందని నియోడెల్ కంపెనీ సారథి డాక్టర్ కె. కోటేశ్వరరావు తెలిపారు. నియోకోవ్ టీకా ఇచ్చినప్పుడు 7 నుంచి 10 రెట్లు అధికంగా ప్రతిరక్షకాలు విడుదలవుతున్నట్లు జంతువులపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు.
కరోనా వైరస్ కొత్త వేరియంట్లను దారికి తెచ్చేందుకు వీలుగా హెల్పర్ సెల్స్గా పిలిచే ‘సీడీ 4’, కిల్లర్ సెల్స్గా పిలిచే ‘సీడీ 8’ రక్షకాలు నియోకోవ్ టీకాకే ప్రత్యేకం.
వైరస్ ఏ రూపంలో దాడి చేసినా ఈ కిల్లర్ టీ సెల్స్ అడ్డుకోవడంతో పాటు వైరస్ మరోసారి దాడి చేయకుండా కూడా రక్షణ కల్పించనున్నాయి. 2022 మే నాటికి నియోకోవ్ టీకా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 2022లో 5.6 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023 నాటికి 600 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వాక్సిన్ ముక్కు ద్వారా అయితే ఒక చుక్క, నోటి ద్వారా అయితే రెండు మూడు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. నియోకోవ్ టీకాలన్నింటినీ దేశ ప్రజల అవసరాలకే అందిస్తామని డాక్టర్ కె. కోటేశ్వరరావు చెప్పారు. నియోకోవ్ టీకా ధర కూడా 140 రూపాయలే.
నియోడెల్ ఫార్మా కంపెనీ అధినేత డాక్టర్ కె. కోటేశ్వరరావు ఏలూరు సమీపంలోని దెందులూరు వాసి. బ్రిటన్లో విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. ఆ దేశ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన ఆయన, జన్యుమార్పిడి చేసిన హెపటైటిస్-బి వ్యాక్సిన్ను భారత్కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈయనతో ఎమోరి విశ్వవిద్యాలయంలోని మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ అమర రామారావు జత కలిశారు. డాక్టర్ రామారావు ఎయిడ్స్, ఎబోలా, సార్స్ వ్యాధులపై రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో నిర్వహించిన పరిశోధనల నుంచి నియోకోవ్ టీకా రూపుదిద్దుకుంది.