కాంగ్రెస్ లో పదవుల పందారం

 

కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్ట్ ల పందారం మొదలయ్యింది. అధికార భాషాసంఘం అధ్యక్షుడి కుర్చీలో మండలి బుద్ధప్రసాద్ ని కూర్చోపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయితే బాధ్యతలు చేపట్టేందుకు ఆయన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి  నేదురుమల్లి రాజ్యలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. ఐదేళ్లనుంచీ మరుగునపడిపోయిన నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ వ్యవహారం ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో తెరమీదికొచ్చింది. ఈ రెండు పోస్టులూ భర్తీ అయితే నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలైనట్టే లెక్కని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయ్. కావాల్సిన పదవులను చేజిక్కించుకునేందుకు పార్టీలో లాబీయింగ్ మరింతగా ఊపందుకుంది. ఆఖరు క్షణంలో అనుకున్న వ్యక్తి పేరు మారిపోయి కొత్త వ్యక్తికి కుర్చీ దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నంతగా నామినేటెడ్ పోస్ట్ ల కోసం ఢిల్లీ స్థాయిలో భారీ లాబీయింగ్ జరుగుతోందని పార్టీలో సీనియర్లు అంటున్నారు. ఏకాభిప్రాయం ఉన్నచోట్ల గతంలోనే పోస్టుల్ని భర్తీ చేసినా, పోటీ గట్టిగా ఉన్నచోట్ల లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకోవడం ఎందుకన్న ధోరణిలో పోస్ట్ లు భర్తీని పార్టీ వాయిదా వేస్తూ వచ్చింది. వేడిలోవేడికింద ఆ పోస్టుల్నికూడా భర్తీ చేసేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో నేతలు గట్టిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.