ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
posted on Oct 15, 2020 @ 6:00PM
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలంటూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు సాయం చేయాల్సిందిగా ప్రధానికి లేఖ రాశారు. కాగా తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు అందించాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ సాయం కోరారు.
కాగా, ప్రధాని మోదీ ఇప్పటికే సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదన్నారు. తక్షణ సాయం కింద కేంద్రం రూ.1,000 కోట్లు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.