ఒక్క దెబ్బకు వంద పిట్టలు... కేసీఆర్ ఝలక్ మామూలుగా లేదుగా..!
posted on Dec 19, 2019 9:10AM
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. యూనియన్ నేతలకు ఇచ్చే అన్ని రకాల ఆన్ డ్యూటీ సౌకర్యాలను రద్దు చేశారు. అసలు యూనియన్లు అంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో యూనియన్లపై తీవ్ర స్థాయిలో ఫైరైన కేసీఆర్.... చివరికి ఆర్టీసీ సమ్మెపైనా, యూనియన్లపైనా పైచేయి సాధించి... ఆ తర్వాత అసలు యూనియన్లే ఉండొద్దంటూ మాట్లాడారు. దాంతో ఆర్టీసీ యూనియన్ల ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. ఇక, ఇంటర్ బోర్డు వ్యవహారంతో జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘాన్ని, ఇతర సంఘాలను నామరూపాలు లేకుండా చేశారు. దాంతో, ఉపాధ్యాయ సంఘాలు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నాయి. అయితే, ఇదే తరహాలో అన్ని ఉద్యోగ సంఘాలపై ఉక్కుపాదం మోపబోతోందని తెలుస్తోంది.
అయితే, యూనియన్ సంఘాల నేతలు విధులకు వెళ్లకుండా మినహాయింపు ఉంటుంది. ఈ మినహాయింపు కింద దాదాపు 25మంది రాష్ట్రస్థాయి నేతలకు ఆన్ డ్యూటీ సౌకర్యం ఉంటుంది. జిల్లాస్థాయి నేతలు కూడా అధికారులను మేనేజ్ చేసుకుని అనధికారికంగా ఆన్ డ్యూటీలో కొనసాగుతున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం... ఉద్యోగ సంఘాల నేతలకు ఉన్న అన్ని రకాల ఆన్ డ్యూటీ సౌకర్యాలను రద్దు చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని ఉద్యోగ ఉపాధ్యాయ నేతలను ఆదేశించింది. జిల్లా స్థాయిలో కూడా ఎవరికీ అనధికారిక ఆన్ డ్యూటీ సౌకర్యం ఇవ్వొద్దని కలెక్టర్లకు, డీఈవోలకు, ఇతర అధికారులకు ఆర్డర్స్ ఇచ్చింది. దాంతో, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, యూనియన్ల ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది.
అయితే, యూనియన్ల నేతలకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కొద్దిమందికైనా ఆన్ డ్యూటీ సౌకర్యం ఇవ్వాలంటూ కోరుతున్నారు. కానీ, యూనియన్ నేతల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోందని అంటున్నారు.