ఉద్యోగులు, రైతుల విషయంలో సీఎం సీరియస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు?
posted on Dec 18, 2021 @ 3:23PM
ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. పాలనపై సుదీర్ఘంగా సమీక్షించారు. పలు అంశాలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన వరి సాగు, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలా ముందుకు వెళ్లాలో సూచనలు చేశారు. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్.
నూతన జోనల్ వ్యవస్త నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పన తో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన , నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ తెలిపారు. వెనకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు.
నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలన్నారు. భార్యాభర్తల ఉద్యోగులు (స్పౌస్ కేస్) వోకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతరని,ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని, సిఎం తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వొక్క కిలో వడ్లు కూడా కొనలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని కలెక్టర్ల సమావేశంలో ఆయన పునరుద్ఘాటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టంచేసే దిశగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారత చరిత్ర లో ఏ రాష్ట్రం అమలు చేయలేదని సీఎం కేసిఆర్ అన్నారు. వీటిని కొనసాగిస్తామని స్పష్టం చేసారు. రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. వానాకాలం లో ప్రధానంగా పత్తి., వరి., కంది సాగు పై దృష్టి సారించాలని కలెక్టర్ల ను, వ్యవసాయ అధికారులను కేసిఆర్ ఆదేశించారు. రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు. సమావేశం లో మంత్రులు, అందుబాటులో వున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిఎస్ , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.