జిల్లాకి కలెక్టరే బాస్.. కలెక్టర్లకు ప్రత్యేక నిధులు!
posted on Feb 12, 2020 @ 11:02AM
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ లకు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల పై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై వివరణ ఇచ్చారు. జిల్లాలో కలెక్టర్లే బాస్ అని స్పష్టంజేశారు. మంచి జరిగినా చెడు జరిగినా వారే భరించాలి అని చెప్పారు. ఏదైనా ఎమర్జెన్సీలో నిధుల కొరత రాకుండా కలెక్టర్ లకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. అందులోభాగంగా అత్యవసర పనుల కోసం కలెక్టర్ లకు నిధులు విడుదల చేశారు. ఒక్కో కలెక్టర్ కు కోటి రూపాయల చొప్పున 33 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పల్లెప్రగతి తరహాలో పట్టణ ప్రగతి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో ఈ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ లకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన చర్యల పై అవగాహన కల్పించడానికి అన్ని జిల్లాల కలెక్టర్ లు మున్సిపల్ సమావేశం నిర్వహించి మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కమిషనర్లకు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. పట్టణ ప్రగతి కంటే ముందే అన్ని వార్డుల్లో కమిటీలను నియమించాలని కార్యక్రమం కోసం వార్డుకో అధికారిణి ఇన్ చార్జ్ గా నియమించాలనే సూచించారు. పట్టణాలూ నగరాల్లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పార్క్ లు ఇతర అవసరాల కోసం వినియోగించుకోవాలన్నారు. కేబీఆర్ పార్క్ తరహాలో అన్ని పట్టణాలకు రెండు కిలోమీటర్ల దూరంలో నడక కోసం పార్కులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.