పచ్చదనం కోసం హరిత నిధి.. కేసీఆర్ ప్రకటనతో మొదలైన విరాళాలు
posted on Oct 1, 2021 @ 5:04PM
హరితహారం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ అని… తెలంగాణ హరిత నిధి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్.
హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. అలాగే ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నుంచి నెలకు రూ.25 ఇవ్వాలని తెలిపారు. రిజిస్ట్రేషన్లు, భవనాలు అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొద్ది మొత్తం వసూలు చేయాలని వెల్లడించారు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఒక్కొక్కరికి ఐదు రూపాయలు, అలాగే… స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
హరితనిధిని ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే విరాళాలు మొదలయ్యాయి. తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్. హరితనిధికి ప్రజా ప్రతినిధులందరూ తమ శక్తి సామర్థ్యాల మేరకు సహకరించాలని కోరినందుకు ప్రకృతి ప్రేమికుడిగా హర్షిస్తున్నానని చెప్పారు. ప్రకృతి ప్రేమికుడిగా గ్రీన్ ఫండ్ కోసం ప్రతి నెల 5000 విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ఎంపీ సంతోష్ కుమార్