ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

 

ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. హెక్టారుకు రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై  సచివాలయంలో ముఖ్యమంత్రి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.  నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున రైతుల వద్ద నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం .ఉల్లికి గిట్టుబాటు ధర వచ్చే వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు. 

కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి అన్నదాతకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతుబజార్ల సంఖ్యను పెంచటంతోపాటు ఆధునికీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు
 

విశాఖ అందాలకు బండి సంజయ్ ఫిదా

  విశాఖపట్నంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా  అటల్ బీహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని బండి సంజయ్  ఆవిష్కరించారు. వైజాగ్ అందాలు, ప్రజలపై ప్రశంసలు కురిపించారు. ఈ నెల అందాలకు మాత్రమే కాదు.. పోరాటలకు ప్రసిద్ది. స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి పోరాటల వరకు ఉత్తరాంధ్ర ప్రజల పాత్రను మరువలేము. అవసరమైతే సముద్రంలా ఉప్పొంగుతారు.  అవకాశలు రావటం ఆలస్యం అయినా ప్రజల ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు నిరాశలో కాకుండా నమ్మకంతో జీవిస్తారు అని బండి సంజయ్ అన్నారు. అందుకే విశాఖ దేశానికి గర్వకారణమైందన్నారు. విశాఖ ఎదిగితే ఉత్తరాంధ్ర మాత్రమే కాదని, ఈ దేశమే ఎదుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.‘‘అందుకే నేను గర్వంగా చెబుతున్నాను. వైజాగ్ సముద్రం కాదు. భావోద్వేగాల అల. ఉత్తరాంధ్ర ప్రజలు. మధ్య నిలబడి మాట్లాడే అవకాశం నాకు దక్కిన అదృష్టం. మీ ప్రేమకు… మీ ఆప్యాయతకు… మీ పోరాట పటిమకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. 

టీ20 వరల్డ్‌కప్‌ భారత జట్టు ప్రకటన

  వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి జరిగే  టీ20 వరల్డ్‌కప్‌ 2026కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌కు జట్టులో చోటు దక్కలేదు. జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌ (వైస్‌కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, తిలక్‌వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దుబే, రింకూ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాన్‌ కిషన్‌. జనవరిలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్‌లోనూ ఇదే జట్టు ఆడుతుందని బీసీసీఐ ప్రకటించింది. భారత్, శ్రీలంక వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది.

రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీ కొని ఎనిమిది ఏనుగులు మృతి.. అసోంలో విషాదం

 రైలు ఢీకోని ఎనిమిది ఏనుగులు మృత్యువాతపడిన విషాద ఘటన అసోంలో శుక్రవారం (డిసెంబర్ 20) తెల్లవారు జామున జరిగింది. సైరంగ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఐదు  బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో రైలు ప్రయాణీకులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాగా ఈ ఘోర ప్రమాదం నుంచి ఒక గున్న ఏనుగు సురక్షితంగా తప్పించుకుంది. ఆ గున్న ఏనుగును అటవీశాఖ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అదలా ఉంటే  ఈ ప్రమాదం గువాహ‌టికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో  జరిగింది. ప్రమాద వార్త తెలియగానే సహాయక బృందాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  

ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు

దేశ రాజధాని నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ముఖ్యంగా చిన్న పిల్లలు కాలుష్యం కారణంగా అనారోగ్యం పాలౌతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులను కాలుష్యం బారి నుంచి కాపాడే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని మొత్తం స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న దాదాపు 38 వేల స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వీటికి అయ్యే వ్యయం పర్యావరణ సెస్ నిధుల నుంచి  ఉపయోగించనున్నట్లు తెలిపింది.  తమ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని ప్రకటించిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి కాలుష్యం బారి నుంచి విద్యార్థులను కాపాడేందుకే స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే ఢిల్లీలో కాలుష్య సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన అవన్నీ త్వరలో ఫలితాన్నిస్తాయన్నారు.  

ప్రమాదవశాత్తు రైల్లోంచి పడి నవదంపతులు దుర్మరణం

కొత్తగా పెళ్లైన దంపతులు రైలు నుంచి జారి పడి దుర్మరణం పాలైన ఘటన   యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి  రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం (డిసెంబర్ 18) అర్ధరాత్రి సమయంలో జరిగింది. మృతు లను ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా   గుర్తించారు. ఇటీవలే వీరికి వివాహమైంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.  హైదరాబాద్ నుంచి విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో  డోర్ వద్ద నిలబడిన ఈ జంట ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.  

ఎడారి దేశంలో వర్ష బీభత్సం

అతివృష్టి అనావృష్టి అంటూ వరుణుడి విషయంలో తరచూ అనుకుంటూ ఉంటాం. కురిస్తే కుండపోత వానలూ, లేకుండా ముఖం చాటేసే మబ్బులు. ఈ పరిస్థితి ఇండియాలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రైతాంగానికి బాగా అలవాటైన వాతావరణ పరిస్థితి. అయితే చినుకుకే మొహంవాచిపోయి ఉండే ఏడారి దేశంలో వర్షం బీభత్సం సృష్టించడం అంటే.. ఊహకు అందడం ఒకింత కష్టమే. అయితే ఇప్పుడు ఎడారి దేశాల్లో కూడా వరుణుడు వీరంగం ఆడుతున్నాడు.   ముఖ్యంగా యూఏఈలోని దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. రోడ్లు చెరువులను తలపించాయి. విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీచ్‌లు, పార్కులు మూసివేశారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన పరిణామం. మొన్నటి వరకు భారీ వర్షాలు ఇండియాను అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటాలు, పంట ధ్వంసం సంభవించాయి.  ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు   పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు కురిశాయి. చాలా చోట్ల క్లౌడ్ బరస్ట్ జరిగింది. వరదలతో రోడ్లు కొట్టుకుపోయాయి.. ఇళ్లు, పంటలు మునిగిపోయాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. ఈ ఏడాది వర్షాల వల్ల ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండియా వంటి దేశాలలో వానలు, వరదలు సర్వసాధారణం. కానీ  అటువంటి పరిస్థితులు ఎడారి దేశాల్లో ఏర్పడటం అరుదు.  అయితే ఇప్పుడు కుండపోత వానతో  అబుదాబీ, దుబాయ్ లు అతలాకుతలమౌతున్నాయి.   ఎడాది దేశం యూఏఈలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో  అబుదాబీ, దుబాయ్‌తో పాటు పులు నగరాల్లో జనజీవనం స్తంభించిపోయి. గంటల పాటు కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపించాయి.  ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానరాకపోకలకు తీవ్ర జాప్యం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  వరద తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దని, అది ఏ నిమిషంలోనైనా ప్రమాదకరంగా మారవచ్చని షార్జా సివిల్‌ డిఫెన్స్‌ అథారిటీ  హెచ్చరించింది. దుబాయ్, అబుదాబీతో పాటు దోహా, ఖతార్‌లలోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం  చేసేశాయి. యూఏఈలో భారీ వర్షాలు దాదాపు పాతికేళ్ల రికార్డును బ్రేక్ చేశాయి.  వరదల నేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక మున్సిపల్‌ సిబ్బంది.. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అలానే ట్రావెల్‌ అడ్వైజరీలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కార్యాలయం సీసీఎస్ కు మార్పు

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్​ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం హదరాబాద్ సీపీ నేతృత్వంతో  మరో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొనసాగిన  సిట్ కార్యాలయాన్ని  కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ (సిసిఎస్)కు మార్చారు. శనివారం (డిసెంబర్ 20) నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యకలాపాలన్నీ సీసీఎస్ కేంద్రంగానే సాగుతాయి.   ఫోన్ ట్యాపింగ్‌  కేసులో మరింత లోతైన, సమగ్రమైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం (డిసెంబర్ 18) ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.   ఈ సిట్‌ లో  రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి,   డీఎస్పీలు శ్రీధర్. నాగేందర్ సభ్యులుగా నియమించారు.   రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలను వెలికితీయడమే లక్ష్యంగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ కు విస్తృత అధికారాలు కల్పించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.   ఇలా ఉండగా ఈ కేసులో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ ఎంక్వయిరీలో ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును సిసిఎస్‌కు తరలించారు. సిసిఎస్‌లో ప్రభాకర్ రావుకు ప్రత్యేక గదిని సిట్ ఏర్పాటు చేశారు.   

ఐదో టి20లో సఫారీలు చిత్తు..టి20 సిరీస్ టీమ్ ఇండియా కైవసం

దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ను టీమ్ ఇండియా 3-1 తేడాతో కైవసం చేసుుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్ 19) రాత్రి జరిగిన చివరి ఐదో టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా  సఫారీలను  30 పరుగుల తేడాతో చిత్తు చేసింది.  ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్నీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి  231 పరుగుల భారీ స్కోరు సాధించింది. 232 పరుగులు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 201 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. భారీ విజయలక్ష్యంతో భాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత ఆరంభాన్ని అందించాడు.   డికాక్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా ప వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసి మంచి స్థితిలో ఉంది. ఆ తరువాత  13 పరుగులు చేసిన హండ్రిక్స్  ఔటయ్యాడు. అయితే డికాక్ దూకుడు కొనసాగించాడు. డికాక్ క్రీజ్ లో ఉన్నంత సేపూ దక్షిణాఫ్రికా లక్షాన్ని ఛేదిస్తుందనే అనిపించింది. అయితే  11వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా   డికాక్ ను కాట్ అండ్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపాడు. డీకార్   డికాక్ 35 బంతుల్లో 65 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా లయ కోల్పోయింది. బ్యాట్స్ మన్ పరుగుల కోసం అంత చలిలోనూ చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. డికాక్ ఔటైన తర్వాత   5 ఓవర్లలో ఆఫ్రికా 38 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే.. భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్ధమౌతుంది.  డివాల్డ్ బ్రెవిస్ (31) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.  ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరే ఆరంభాన్నిచ్చారు. సంజు శాంసన్  22 బంతుల్లో 37 పరుగులు, . అభిషేక్ శర్మ 21 బంతుల్లో34 పరుగులు చేశాడు. ఆ తరువాత తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యాలు పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా హార్ధిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగి పాతిక బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  అలాగే తిలక్ వర్మ  42 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, హర్షదీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్ధిక్ పాండ్యాకు దక్కింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు.

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

  ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి తాజా రాజకీయ పరిణామలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను చంద్రబాబు, అమిత్ షాకి వివరించారు.  కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయిన సీఎం అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని, హైవే నెట్‌వర్క్‌లతో రాజధానిని కనెక్ట్ చేయాలని కోరారు. మరోవైపు కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి  హర్దీప్ ఎస్ పూరీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రూ. 96,862 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటి అయిన నెల్లూరు జిల్లాలోని బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి  మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి సమావేశం  అయ్యారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు అవశ్యకతను ఆయన కు వివరించారు. సవరించిన డీపీఆర్ లను ఆమోదించాలని కోరారు.