రెచ్చగొట్టిందంటూ ఎమ్మెల్సీ ఫిర్యాదు.. యువతిపై కేసుతో హైడ్రామా..
posted on Aug 4, 2021 @ 1:13PM
ఎక్కడనైనా ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు చేయడం చూస్తుంటాం. కానీ, అక్కడ సంథింగ్ డిఫరెంట్. స్వయానా అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడా ఓ యువతిపై. అందులోనూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టిందంటూ కంప్లైంట్. పోస్టులు పెట్టడమే నేరమన్నట్టు పోలీసులు సైతం వెంటనే కేసు కట్టేశారు. మహిళ అని చూడకుండా స్టేషన్కు తరలించారు. రాత్రి సమయంలో కూడా సీఐడీ కార్యాలయంలోనే ఉంచారు. ఆమె టీడీపీ సపోర్టర్ కావడం వల్లే ఇలా వేధిస్తున్నారంటూ ప్రతిపక్షం భగ్గుమంది. ఇటు ఎమ్మెల్సీ, అటు సీఐడీ తీరుపై మండిపడింది.
రెండు గ్రూపులు, రెండు కులాలను రెచ్చగొట్టే విధంగా.. ఓ కులాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. విచారణను గుంటూరు సీఐడీ రీజినల్ కార్యాలయానికి దర్యాప్తు నిమిత్తం పంపారు. సీఐడీ సీఐ సంజీవ్కుమార్ కేసు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా తెనాలికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలు బొలినేని జ్యోతిశ్రీని అధికారులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి తరలించారు. ఆమెను విచారించి సాయంత్రానికి స్టేషన్ బెయిల్పై విడుదల చేస్తారని భావించారు.
సాయంత్రం 6 గంటలు దాటినా జ్యోతిశ్రీని విడుదల చేయకపోవటంతో టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని సంజీవ్కుమార్ను కలిసి వివరాలు అడిగారు. అప్పిరెడ్డి ఫిర్యాదు మేరకు 153ఎ, 120 రెడ్విడ్ 505(2) సెక్షన్ కింద సీఐడీ రాష్ట్ర కార్యాలయం కేసు నమోదు చేయటంతో జ్యోతిశ్రీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.
జ్యోతిశ్రీ మాట్లాడుతూ.. గంటలో పంపిస్తామని తీసుకువచ్చి రాత్రి వరకు నిర్బంధించారని తెలిపారు. తాను పార్టీపరంగా పోస్టింగ్స్ పెట్టానని, ఎవరినీ కించపరచలేదని, కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళను రాత్రి పూట సీఐడీ కార్యాలయంలో ఉంచడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.