నన్ను చంపాలని చూస్తున్నారు! డీజీపీపై చింతమనేని సంచలన వ్యాఖ్యలు..
posted on Sep 4, 2021 @ 4:14PM
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో తనకు ప్రాణ హాని ఉందని కాబట్టి తనకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం నిర్వహించి, ఎవరిదైనా నేర చరిత్ర తెలుసుకోవడం ఎలాగో యాప్ ద్వారా ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో ఎంటర్ ప్రైజెస్ సెర్చ్ లో టీడీపీ నేత చింతమేని ప్రభాకర్ పేరు టైప్ చేసి ఆయనపై ఉన్న కేసుల వివరాలను మీడియా ప్రతినిధులకు డెమో ఇచ్చారు. చింతమనేని బాగా ఫేమస్ కాబట్టి ఆయన పేరు సెర్చ్ లో కొడుతున్నానని డీజీపీ చెప్పారు.
అయితే నేర చరిత్రలు తెలుసుకునేందుకు డీజీపీ తన పేరును వాడడం పట్ల చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియా సమావేశంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ తానొక డీజీపీ అన్న విషయం మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎంతోమంది ఉండగా, కేసుల వివరాలు చెప్పడానికి నా పేరు ఎందుకు ఉపయోగించారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పే కట్టుకథలను డీజీపీ బాగా వంటబట్టించుకున్నారని, అక్రమ కేసుల సినిమాలు చూపించడంలో డీజీపీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మించిపోయారని చింతమనేని మండిపడ్డారు.
తనపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలన్నారు చింతమనేని. టీడీపీ క్యాడర్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు తను బంతిలా వాడుకుంటున్నారని విమర్శించారు. ఓ ఎస్పీ చింతమనేనిపై కేసులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ 1+1 ఆఫర్లు ప్రకటించారన్నారు. తప్పుంటే ఉరి శిక్షకైనా సిద్ధమే. కేసులు తొలగించమని దేహీ అని ఎవర్నీ అడగలేదు. నేను వనజాక్షి సమీపంలో కూడా లేనని ఆమె ఫిర్యాదులో పేర్కొంటే, అసెంబ్లీలో జగన్ రెడ్డి చెప్పిన కట్టుకథల్ని డీజీపీ వినిపించారు’’ అని చింతమనేని ప్రభాకర్ చెప్పారు.
"నాపై నమోదైన కేసుల్లో ఎన్ని ఇప్పటికీ నడుస్తున్నాయో డీజీపీ చెప్పాలి. కొన్ని కేసులు చార్జిషీట్లు వేయలేక మూసేశారు. వాటిపై ఏం సమాధానం చెబుతారు?..కేసులు ఏవీ దొరక్క... రండి, చింతమనేనిపై కేసులు పెట్టండి అంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా పైకిలేస్తా" అని చింతమనేని స్పష్టం చేశారు. "తప్పుడు కేసులకు భయపడేది లేదు. డీజీపీకి వైసీపీ అంటే అంత వ్యామోహం ఉంటే ఆ రుణం మరో రూపంలో తీర్చుకోవాలే తప్ప, నా వంటి వారితో చెలగాటాలు వద్దు...డీజీపీ పదవిని కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు" అని చింతమనేని హితవు పలికారు.