అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటున్న బిర్లా ప్లానిటోరియం...

 

బిర్లా ప్లానిటోరియం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంత కాలం ఇమేజ్ షోస్ తో సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించి ఆకట్టుకున్న బిర్లా సైన్స్ సెంటర్ డిజిటలైజేషన్ లోకి మారిపోయింది. పరిశోధనాత్మక పద్ధతులో దూసుకుపోతోంది. భారత్ ను ప్రపంచ దేశాల సరసన నిలిపిన ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగాన్ని గ్రాఫిక్ పద్ధతిలో ప్రదర్శించింది. పాత విధానానికి స్వస్తి పలుకుతూ ఆధునిక పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఆకాశం, నక్షత్రాలు, రోదసీ, గ్రహణాలపై సైంటిఫిక్ కోణంలో విశ్లేషిస్తూ భావిభారత తరాలకు విజ్ఞానాన్ని పంచుతుంది బిర్లా ప్లానిటోరియం.

ఖగోళంలో జరిగే మార్పుల్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ అన్ని వయసుల వారికి సైన్స్ పై ఆసక్తి పెంచుతోంది. వివిధ భాషల్లో వివరిస్తూ చూపించే విజువల్స్ బిర్లా ప్లానిటోరియంకి దేశ వ్యాప్తంగా గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక ముందు చంద్రయాన్ లాంటి ఉపగ్రహ ప్రయోగాల్ని డిజిటల్ రూపంలో మరింత నూతనంగా అదిస్తోంది బిర్లా ప్లానిటోరియం. గతంలో కేవలం ఫొటోల సాయంతో చూపించి సైన్స్ పై ఆసక్తిని పెంచేది, ఇప్పుడు విజువలైజేషన్ లో వచ్చిన మార్పుల్ని అందిపుచ్చుకుంది ప్లానిటోరియం.

పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ ఆధునిక పద్ధతిలో డిజిటలైజేషన్ ను ఇవన్ సన్ సదరన్ లాండ్స్ యూయస్ఏ నిర్మించిన పవర్ ఫుల్ డిజిటల్ సిస్టమ్ ను బిర్లా ప్లానిటోరియం నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. విక్రమ్ లాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుత క్షణాలని డిజిటలైజేషన్ ద్వారా ప్రదర్శించాయి, చంద్రయాన్-2 ప్రయోగం తొలి నుంచి చంద్రుడిపై దిగే చివరి దృశ్యం హోవరింగ్ స్టేజ్ అని అంతిమ దశ వరకు ఇందులో పొందుపర్చారు. నలభై ఐదు నిమిషాల పరిశోధనాత్మక డిజిటలైజేషన్ చంద్రయాన్-2 షోను తెలంగాణ గవర్నర్ తమిళ సాయి సౌందర్ రాజన్ ప్రారంభించారు.

చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి డిజిటల్ ప్రోగ్రాం కళ్లకు కట్టినట్టుగా చూపించారని గవర్నర్ ప్రశంసించారు. పదిహేనేళ్లుగా తాము చేస్తున్న ఆలోచనలు ఈనాటికి కార్యరూపం దాల్చాయని బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ సిద్దార్థ తెలిపారు. ఇకపై రాబోయే రోజుల్లో డిజిటలైజేషన్ కు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారాయన. మొత్తం మీద ఇవాన్ సన్ సదరన్ లాండ్స్ యు.ఎస్.ఎ నిర్మించిన ఈ పవర్ ఫుల్ డిజిటల్ సిస్టమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్ని వయసుల వారినీ ఆకట్టుకునేలా నలభై ఐదు నిమిషాల షోను ప్రదర్శించారు.

Teluguone gnews banner