బాబు నిర్లక్ష్యంతో.. కంచుకోటలాంటి ఆ నియోజకవర్గంలో మూడో స్థానానికి టీడీపీ..
posted on Aug 25, 2020 @ 1:43PM
నిన్నటివరకు ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ ఈ రోజు అక్కడ పార్టీ పరిస్థితి అంతా అయోమయంగా తయారైంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్ ను కలిసి జెండా ఎత్తేయడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వం లేకుండా పోయింది. వంశీ టీడీపీని వీడి చాలా కాలం అయినా కూడా ఆయన స్థానంలో ఇన్ఛార్జిని నియమించకుండా చంద్రబాబు మీన మేషాలు లెక్కపెడుతున్నారని స్థానిక కార్యకర్తల నుండి విమర్శ వినిపిస్తోంది. అసలు వంశీ ఎప్పుడైతే సీఎం ను కలిసి మద్దతు ప్రకటించారో అపుడే ఇన్ఛార్జిని ప్రకటిస్తే గన్నవరంలో పార్టీ పరిస్థితి బాగుండేదనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లోనూ, సానుభూతిపరుల్లోనూ వ్యక్తం అవుతోంది. అయితే వంశీ పార్టీని వీడిన తరువాత అయినా ఇన్ఛార్జి వ్యవహారం తేల్చకుండా అటు చంద్రబాబు ఇటు లోకేష్ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని.. ఇప్పటికే నాయకత్వం లేక పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు కొంత మంది వంశీ వెంట వెళ్లుతున్నారని మరి కొన్ని రోజుల్లో పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవారంతా కూడా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి టిడిపి నుంచి వైసిపి లోకి వెళ్లిన వంశీ పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఇప్పటికే వైసిపి లో ఉన్న గ్రూపు తగాదాలతో ఆయనకు కూడా చుక్కలు కనపడుతున్నాయంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎప్పటి నుండో పాతుకుపోయిన దుట్టా రామచంద్రరావు వర్గీయులు ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరో పక్క గత ఎన్నికల్లో వైసిపి తరుపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా ఎమ్మెల్యే వంశీ కి చిక్కులు సృష్టిస్తున్నారు. దీనికి తోడు దుట్టా అల్లుడు నియోజకవర్గ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. అయితే దుట్టా, యార్లగడ్డ వర్గాలను కలుపుకుని వెళ్లాలని వంశీ ఎంత ప్రయత్నిస్తున్నా వారు ఆయనకు సహకరించడం లేదు. ఒకవేళ వారిద్దరూ సహకరిస్తే తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళతానని వైసిపి తరుపున గెలిచి రాజధాని ప్రాంతంలో రికార్డు సృష్టించాలని వంశీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అది సాధ్యం కాకపోవడంతో తనతో పాటు నిన్నటి వరకు టిడిపిలో పనిచేసి తన వెంట రాని నాయకులను తనవైపు తిప్పుకుంటున్నారు.
కొన్ని గ్రామాల్లో ఉన్న టిడిపి నాయకులు వంశీ వెంట వెళుతున్నా వారిని ఆపేవారు కానీ, వారికి సర్దిచెప్పి పార్టీలో ఉండేలా చేయగలిగిన నాయకులు కానీ ప్రస్తుతం టిడిపిలో కనిపించడం లేదు. రోజు రోజుకు నియోజకవర్గంలో టిడిపి బలహీనం అవుతున్నా బాబు గారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని టాక్. ఒకవేళ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిగి వంశీ కి వైసిపి టికెట్ వస్తే ఆయనను వ్యతిరేకించే వైసిపి నాయకులు ఇండిపెండెంట్గా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉపఎన్నికల్లో పోటీ వంశీకి ఇండిపెండెంట్ అభ్యర్ధికి మధ్యే జరిగే పరిస్థితి. దీంతో టిడిపి మూడవ స్థానానికి పరిమితమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని ఎవరో ఒకరికి ఇన్ఛార్జి పదవిని అప్పగించకపోతే అయన కలలుగన్న రాజధాని ప్రాంతంలో, టీడీపీ కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో టీడీపీ మూడోస్థానానికి పడిపోయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.