నీకు సబ్జెక్ట్ తెలియదు.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా?
posted on Dec 3, 2020 @ 4:21PM
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ముమ్మాటికీ ఫేక్ ముఖ్యమంత్రేనని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే పెన్షన్లను భారీగా తొలగించారని ఆరోపించారు. సభల్లో జగన్ చెప్పేది ఓ లెక్క అయితే.. ప్రభుత్వ డేటాలో ఉండేది మరో లెక్కని అన్నారు. టీడీపీకి చెందిన వారికి పెన్షన్, రేషన్ కట్ చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో 44.32 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం అబద్దం చెప్పిందన్నారు. టీడీపీ హయాంలో 50.29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. పెన్షన్ల విషయంలో వైసీపీ తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదని విమర్శించారు. అసెంబ్లీని వైసీపీ నేతలు తప్పుదారి పట్టించారని ధ్వజమెత్తారు. టీడీపీ వాళ్లు అసెంబ్లీకి రాకూడదని అంటున్నారు.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఒక జీరో సీఎం.. అవగాహన లేని ముఖ్యమంత్రి అని విమర్శించారు. దిశ చట్టం తెస్తున్నామని, అసెంబ్లీలో ప్రకటించిన నాడే జగన్ కు హితవు పలికానని అన్నారు. కొంచెం ఓపిక పట్టు, నీకు పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు అని నచ్చచెప్పేందుకు యత్నించానని తెలిపారు. సబ్జెక్టు గురించి ఏం తెలుసు నీకు? కనీసం బిజినెస్ రూల్స్ అంటే తెలుసా? హెచ్ఓడీ రూల్స్ తెలుసా? సచివాలయ రూల్స్ తెలుసా? ఏమీ తెలియవు నీకు అని విమర్శించారు. చట్టం తెచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. ఇవేమీ చెయ్యకుండా చట్టాన్ని ఢిల్లీకి పంపించి ఇక్కడ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. బుద్ధి ఉన్నవాడెవడూ ఇలా చేయడు. మేం కట్టిన పోలీస్ స్టేషన్లకు రంగులేసుకుని రిబ్బన్ కట్ చేశారు. ఇలాంటి వాళ్లతో రాష్ట్రం పరువేం కావాలి! అతను అమాయకుడో, మనం అమాయకులమో అర్థం కావడంలేదు అని విరుచుకుపడ్డారు.