కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు
posted on Mar 24, 2021 8:30AM
దేశంలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మహమ్మారి కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నిర్ధారణ పరీక్షలు, బాధితుల గుర్తింపు, చికిత్సపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నూతన మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 30 వరకు ఇవి వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు పెంచాలని.. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఆ తర్వాత వారు ఎవరెవరిని కలిశారో గుర్తించాలని.. పాజిటివ్ కేసులను బట్టి కంటైన్మెంట్ జోన్లను గుర్తించాలని ఆదేశించింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపర్చాలని, కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటికి తిరిగి పరీక్షలు చేయాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. మాస్క్లు ధరించడం, సామాజికదూరం పాటించడం వంటి నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాలి. ఉల్లంఘించిన వారిపై అవసరమైతే జరిమానా వంటి చర్యలు కూడా తీసుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించవచ్చని చెప్పింది. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం ఉండదని.. వ్యక్తులు, సరకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
కంటైన్మెంట్ జోన్ వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉందని కేంద్రం తెలిపింది. అయితే ప్రయాణికుల రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్ సెంటర్లు తదితర వాటిల్లో మాత్రం నిర్దేశిత ప్రమాణాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత్ ప్రారంభించిందని చెప్పిన కేంద్రం.. ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోందని వెల్లడించింది.ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చైన్ను విడగొట్టాలంటే టీకానే ఆధారం. అందువల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్పై మరింత దృష్టిపెట్టాలి. అర్హులైన వారందరూ టీకా వేయించుకునేలా చూడాలని రాష్ట్రాలను కేంద్ర సర్కార్ ఆదేశించింది.