ఏపీలో పాజిటివిటీ రేటు ఆందోళనకరం..
posted on May 16, 2021 @ 10:31AM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు,మరణాలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా పెరిగిపోతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. కరోనా కేసులు తీవ్రస్థాయిలో ఉన్న ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్లోని కొవిడ్ పరిస్థితులపై మంత్రి.. వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో వారం వృద్ధిరేటు అత్యధికంగా 30 శాతం ఉందని పేర్కొన్నారు.
విశాఖపట్టణం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు.కొవిడ్ను కట్టడి చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కట్టడికి కఠినంగా వ్యవహరించాలి. బెడ్లు, ఆక్సిజన్, ఐసీయూ, ఔషధాలు అందుబాటులో ఉంచాలి. ప్రాణనష్టం నియంత్రణే లక్ష్యంగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి’ అని ఏపీ సర్కారుకు ఆయన సూచించారు. కేంద్రం పంపిస్తున్న వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో కరోనా పరిస్థితులపై సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఇద్దరు, ముగ్గురు సభ్యులతో అధికారుల బృందాన్ని నియమించుకోవాలని సూచించారు.
జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ సుజీత్ కె.సింగ్ మాట్లాడుతూ.. సమీప గ్రామాల నుంచి కొవిడ్ రోగులను పట్టణాలకు తరలించే అవకాశం ఉండడంతో పట్టణాల్లోని ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలని సూచించారు. ఇప్పటి వరకు 18 కోట్ల డోసుల టీకాలను ప్రజలకు అందించామని, జులై చివరి నాటికి మరో 33.6 కోట్ల డోసులు అందిస్తామన్నారు.స్పుత్నిక్ వ్యాక్సిన్కు ఇప్పటికే అనుమతి ఇచ్చామని, ఆగస్టు-డిసెంబరు మధ్య మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. జైడస్ క్యాడిలా, సీరం ఇనిస్టిట్యూట్ నోవావ్యాక్స్, భారత్ బయోటెక్ నుంచి నాసల్ వ్యాక్సిన్, జెనోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అన్నీ కలిపి దాదాపు 216 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.