జగన్ సర్కార్ దే అన్నమయ్య వరద పాపం! గేట్లు ఎత్తకపోవడం వల్లే కొట్టుకుపోయిందన్న కేంద్రం..
posted on Dec 4, 2021 @ 10:36AM
కడప జిల్లాలో వరదలు బీభత్సం స్పష్టించాయి. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా వరద విలయం సంబవించింది. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వందలాది గ్రామాలు రోజుల తరబడి జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. కడప జిల్లాలో కనివినీ ఎరుగని రీతిలో నష్టం జరిగింది. వరద విలయానికి అన్నమయ్య డ్యాం కారణం కాగా.. అసలు అన్నమయ్య డ్యాం ఎలా కొట్టుకుపోయిందన్నది ప్రశ్నగా మారింది. ప్రాజెక్ట్ నిర్వహణ లోపం వల్లే డ్యాం కొట్టుకుపోయిందనే విమర్శలు వస్తున్నాయి. వరదను అంచనా వేయడంలో యంత్రాంగం విఫలమైందని, సకాలంలో గేట్లు ఎత్తలేదనే ఆరోపణలు వచ్చాయి.
తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సాక్షాత్తూ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సేఫ్టీ బిల్లును ప్రవేశ పెడుతూ అన్నమయ్య ప్రాజెక్టుకు ఒకటిన్నర రెట్లు వరద వచ్చిందని కానీ గేట్లు ఎత్తలేదని కేంద్ర మంత్రి చెప్పారు. చివరికి ఎత్తేందుకు ప్రయత్నించినా ఓ గేటు పని చేయలేదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పడమే కాదు .. అంతర్జాతీయంగా పరిశీలన జరిపితే పరువుపోతుందన్నారు. అన్నమయ్య డ్యాంకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. జగన్ సర్కార్ వైఫల్యం బట్టబయలైంది.
అన్నమయ్య డ్యాం నిర్వహణ విషయంలో ప్రభుత్వంపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. గేట్ల నిర్వహణ పట్టించుకోలేదని.. మరమ్మతుల గురించి ఆలోచించలేదని.. పైగా వరద ముంచుకొస్తుందని తెలిసినా ఇసుక కోసం నీటిని దిగువకు విడుదల చేయలేదన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. డ్యాం దిగువ ప్రాంత ప్రజలకు కనీస సమాచారం కూడా వెళ్లకపోవడం.. వారికి అందిన సమాచారం వల్లనే గుట్టపైకి వెళ్లి మిగిలిన వారు ప్రాణాలు కాపాడుకున్నారు. అందుకే ప్రమాదంలో జ్యూడిషియల్ విచారణ జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.
అంతర్జాతీయంగా పరిశీలన జరిపితే భారత్ పరువు పోతుందని మంత్రి గజేంద్ర షెకావత్ కామెంట్లపైనా విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ పరిశీలన సరే మరి కేంద్రానికి బాధ్యత లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓ కేంద్రం ఎందుకు బాధ్యత తీసుకుని విచారణ జరపదన్న సందేహం సామాన్య ప్రజలకు వస్తుంది. ఇలాంటి సమయంలోనూ కేంద్రం స్పందించకపోతే మొదటికే మోసం వస్తుంది. తీరిగ్గా విచారించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే కేంద్రమే మేలుకోవాల్సి ఉందని అంటున్నారు.