డికే శివకుమార్ కు సిబిఐ నోటీసులు
posted on Jan 2, 2024 @ 3:06PM
లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిపై వత్తడి పెరుగుతోంది. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక డిప్యూటి సీఎం డికే శివకుమార్ కు కేంద్ర దర్యాప్తు సిబిఐ నోటీసులు జారి చేసింది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కాంగ్రెస్ హస్తగతం కావడంలో డికె ముఖ్యభూమిక వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టిపిని ఎల్లుండి కాంగ్రెస్ లో విలీనం కానున్న నేపథ్యంలో డికే ను టార్గెట్ బిజెపి ప్రభుత్వం టార్గెట్ చేసింది.
కేరళకు చెందిన ‘జైహింద్ టీవీ ఛానల్’లో పెట్టుబడుల వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేసింది. ‘జైహింద్ టీవీ’లో పెట్టుబడులు, వాటాల వివరాలు తెలపాలని కోరింది. ఈ కేసులో శివకుమార్, ఆయన భార్య ఉషతో పాటు మరో 30 మందికి కూడా సీబీఐ నోటీసులు పంపించింది. కాగా జైహింద్ ఛానల్లో పెట్టుబడులు రహస్యం కాదని డీకే శివకుమార్ చెబుతున్నారు. ఛానల్లో తనకు వాటా ఉందని 2017-18లో దాఖలు చేసిన ప్రమాణపత్రం, ఆస్తి వివరాలలో ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో తనపై ఒత్తిడి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.
కాగా డీకే శివకుమార్ రిచ్చెస్ట్ పొలిటిషియన్ అనే పేరు ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. 2013-18 మధ్యకాలంలో ఆయన ఆదాయం లెక్కకు మించి ఉందని 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. పలు అవినీతి ఆరోపణలు, ఢిల్లీలోని ఫ్లాట్లో రూ.8 కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు.
జైహింద్ టీవీ ఛానల్ పెట్టుబడుల వ్యవహారంలో శివకుమార్పై కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా యెడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నవంబరు 20న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీబీఐ అనుమతిని రద్దు చేసింది. కేబినెట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ యత్నాళ్ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేయగా విచారణ జరుగుతోంది.