కేసీఆర్ కు మరో సవాల్.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ?
posted on Nov 13, 2021 @ 6:51PM
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేన్లు మొదలయ్యాయి. ఎన్నిక అవసరమైతే డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటస్తారు. అయితే ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ స్థానిక సంస్థల ప్రతినిధుల్లో దాదాపు 80 శాతానికి పైగా అధికార పార్టీ వారే ఉన్నారు. దీంతో అన్ని స్థానాలు కారు పార్టీ గెలుచుకుంటదనే అంచనాలు ఉన్నాయి. అంతేకాదు బలం లేనందున విపక్షాలు పోటీ చేయకపోవచ్చని, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయనే చర్చ కూడా ఉంది.
అయితే అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది. బలం లేనప్పుడు కమలం పార్టీ ఎందుకు బరిలో దిగుతోంది? కమలనాథుల వ్యూహం ఏంటి? అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. తమ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు ఉన్నచోట పోటీ చేయాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించారని సమాచారం. రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పోటీ చేయడం ద్వారా అధికారపార్టీకి చెమటలు పట్టించవచ్చని బీజేపీ నేతల స్కెచ్ అని అంటున్నారు.
గతంలో కూడా బీజేపీకి సంఖ్యాబలం లేకపోయినా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు కూడా బరిలో దిగడం వల్ల తమ ఓట్లు తమకే పడతాయని.. చెదిరిపోవని భావిస్తున్నారట. నిధుల విడుదల, విధుల కల్పనలో ప్రభుత్వంపై MPTCలు గుర్రుగా ఉన్నారని బీజేపీ వాదన. అలాంటి వారంతా MLC ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తారని అనుకుంటున్నారట. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో బీజేపీకి.. గ్రేటర్ కార్పొరేటర్లను కలుపుకొంటే 150కిపైగా ఓట్లు ఉన్నాయట. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ బీజేపీకి కార్పొరేటర్లు ఉన్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయేమోనని బాధపడ్డ ప్రజాప్రతినిధులకు బీజేపీ నిర్ణయం హుషారు తీసుకొచ్చిందట. టీఆర్ఎస్తోపాటు మిగతా పార్టీలు బరిలో ఉంటేనే..తమ పంట పండుతుందని అనుకుంటున్నారట. వారి ఆశలు ఎలా ఉన్నా.. బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ..