సినిమాల్లోకి ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంట్రీ!
posted on Mar 2, 2021 8:40AM
తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఎమ్మెల్యే రాజా సింగ్ గు చెప్పుకుంటారు. 2018తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్. ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండే రాజా సింగ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. శంభాజీ మహా రాజ్ జీవిత గాధ ఆధారంగా సినిమాను తీయనున్నారు. అందులో శంభాజీ పాత్రను పోషించబోతున్నాడు రాజా సింగ్.
తాను నటించబోతున్న సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పారు ఎమ్మెల్యే రాజా సింగ్.
ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కుమారుడు శంభాజీ గురించి మాత్రం ఎవరికీ తెలియదన్నారు. శివాజీ కంటే ప్రమాదకరమైన నాయకుడు. శివాజీ మరణించిన తర్వాత .. ఔరంగజేబు సామ్రాజ్యంపై శంభాజీ దాడి చేసి 120 కోటలను స్వాధీనం చేసుకున్నారని శంభాజీ. ఆయన జీవిత గాధపై సినిమా చేయాలని.. అందులో నేనే నటించాలని అనుకున్నానని
రాజా సింగ్ తెలిపారు.
ఈ సినిమా కోసం తన బరువు 170 కేజీలు ఉంటే 90 కేజీలకు తగ్గినట్లు చెప్పాడు రాజా సింగ్. శంభాజీ పాత్ర కోసం.. అప్పట్లో ఆయన ఫిజిక్ ఎలా ఉండేదో అలాంటి బాడీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు తెలుగు, హిందీ, మరాఠీ సహా మొత్తం 4 భాషల్లో సినిమా తీయనున్నట్లు చెప్పారు రాజా సింగ్. ప్రస్తుతం నిర్మాత కోసం వెతుకుతున్నామని చెప్పారు. నిర్మాత దొరికితే వెంటనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. సినిమా తీసేంత ఆర్థిక స్థోమత తనకు లేదని.. ఒకవేళ ఉంటే తానే స్వయంగా శంభాజీ చిత్రాన్ని నిర్మించేవాడినని తెలిపారు. అందరి మాదిరి తన సినిమాలలో హీరోయిన్లతో పాటలు ఉండవని.. కామెడీ సన్నివేశాలు కనిపించవని.. కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు రాజా సింగ్.
శంభాజీ రాజే భోంస్లే.. 1657, మే 14న జన్మించారు. ఈయన మరాఠా సామాజ్రానికి రెండో రాజు. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు శివాజీ, ఆయన మొదటి భార్య సాయి భోంస్లేకు పెద్ద కుమారుడు.. ఈ శంభాజీ. శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. 1689, మార్చి 11న శంభాజీ మరణించారు. ఆయన 20 జులై, 1860 నుంచి 11 మార్చి, 1689 వరకు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. శంభాజీని మొగల్ చక్రవర్తులు కుట్రచేసి బంధించి.. చిత్రహింసలు పెట్టి చంపారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నీ అప్పగించి.. ఇస్లాంలోకి మారితే.. వదలిపెడతానని మొగల్ చక్రవర్తులు చెప్పారు. కానీ ఆయన ప్రాణం పోయినా ఇస్లాంలోకి మారనని స్పష్టం చేశారు. దాంతో శంభాజీని జైల్లో బంధించి.. చిత్రహింసలు పెట్టి.. చంపేసినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి వీరుడి బయోపిక్లో రాజాసింగ్ నటించనుండడంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.