హ్యాట్రిక్ పై కమల నాథుల కన్ను.. రాముడే బీజేపీ ధీమా?
posted on Feb 14, 2023 6:15AM
బీజేపీ కష్టంలోనూ, సుఖంలోనూ రామనామ జపమే చేస్తూ వస్తోంది. ఆ పార్టీ ఎదుగుదలకు, నేడు అధికారంలో ఉండటానికీ ఆ శ్రీ రామచంద్రుడి పేరు వాడుకోవడమే కారణం. ఔను నిజం ఇప్పుడు ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కూడా బీజేపీ రామనామ జపాన్నే నమ్ముకుంది. బీజేపీ
ఇప్పుడైతే జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగి ఉండోచ్చు. వరసగా రెండు సార్లు (2014, 2019) సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి ఉండోచ్చు. స్వయంగా సంపూర్ణ మెజారిటీ సాధించి, మూడు దశాబ్దాలకు పైగా నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను తిరగ రాసి ఉండొచ్చు. ఈ రోజున కేంద్రంలో, సగానికి పైగా రాష్ట్ర్రాలలో అధికారంలో ఉండొచ్చు.
అయితే బీజేపీ విజయాల వెనుక, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల బలహీనత కంటే రామజన్మ భూమి పేరిట ఆ పార్టీ చేసిన ఆందోళన, 1990 దశకంలో దేశాన్ని కదిలించిన రామజన్మ భూమి ఆందోళన..అద్వానీ రథ యాత్రే కారణం. అవును 1990 లో, అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా వెనక బడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు.
అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బీజేపీ, అప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఇతర సంఘ పరివార్ సంస్థలు సాగిస్తున్న రామ జన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అందుకు అనుగుణంగా అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ 1990లో రథ యాత్రను చేపట్టారు.ఇక ఆ తర్వాత 1992 డిసెంబర్ 6,అయోధ్యలోని వివాదాస్పద కట్టడం, (బాబ్రీ మసీదు) కూల్చివేత వరకు, సాంస్కృతిక జాతీయవాదం పేరిట బీజేపీ సాగించిన ప్రయాణమే, బీజేపీ ఎదుగుదలకు బీజం వేసింది. ఇక ఆ తర్వాత జరిగింది చరిత్ర.
ఇక అప్పటి నుంచి బీజేపీ, ప్రతి ఎన్నికలలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే, రామజన్మభూమి అయోధ్యలో దివ్య భవ్య రామ మందిరం నిర్మిస్తామని వాగ్దానం చేస్తూనే వుంది. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరే రోజు దగ్గరకొచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు 2019 నవంబర్ లో అనుమతి ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, 2020 ఆగష్టులో శంకుస్థాపన చేశారు. ఇదంతా మన కళ్ళముందు కదులుతున్న చరిత్ర.
కాగా, ఈ సంవత్సరం జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా, వచ్చేస సంవత్సరం ( 2024) లోక్ సభ ఎన్నికల విజయానికి బీజేపీ మరో మారు రాముడినే నమ్ముకుంది. రామ మందిర్ అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా వినియోగించుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల సన్నాహయాత్రలు సాగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. వచ్చే సంవత్సరం (2024) జనవరి 1న రామ మందిరాన్ని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. రాహుల్ బాబా విను, .2024 జనవరి 1 నాటికి అయోధ్యలోని రామ మందిరం సిద్ధం అవుతుంది అంటూ అమిత్ షా కాంగ్రెస్ పార్టీని, రామమందిర్ వివాదంలోకి లాగేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నం చేశారు.
అలాగే, అయోధ్యలో రామ మందిర్ నిర్మాణాన్ని కాంగ్రెస్, వామపక్ష, లౌకిక వాద పార్టీలు అడ్డుకున్నాయని, ఆరోపించారు. అయోధ్య అంశాన్ని కోర్టు పరిధిలో సుదీర్ఘ కాలం ఉండేలా చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను,ఇతర లౌకికవాద పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలుగా చిత్రించే ప్రయత్నానికి ఈ విధంగా అమిత్ షా శ్రీకారం చుట్టారు. అంటే 2024 ఎన్నికలలో బీజేపీ మరోమారు రామ మందిర్ అంశాన్ని ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రం చేసుకునేందుకు సిద్డంవుతోందని అమిత్ షా వ్యాఖ్యలతో అర్ధమైపోయింది. నిజానికి అయోధ్య రామమందిరం అంశాన్ని బీజేపీ ప్రతి ఎన్నికలలోనూ ఉపయోగించుకుంటూనే వుంది. అయితే, ఈసారి, రామ మందిర నిర్మాణం పూర్తి చేసిన నేపధ్యంలో హిందూ ఓటు బ్యాంకును మరింత పటిష్ట పరచుకునే ప్రయత్నం మొదలెట్టింది. అమిత్ షా మాటలు ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తున్నాయి.