అవినీతి అనకొండ శ్రీలక్ష్మి.. భూమన సంచలన ఆరోపణలు
posted on Aug 26, 2025 @ 4:58PM
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. జగన్ అక్రమాస్తుల కేసులోనూ, అలాగే ఓబులాపురం మైనింగ్ కేసులోనూ కూడా శ్రీలక్ష్మి నిందితురాలుగా అభియోగాలు ఎదుర్కోన్నారు. కొన్ని నెలల పాటు జైలులో కూడా ఉన్నారు.
రాష్ట్ర విభజన తరువాత శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. అయితే 2019 ఎన్నికలలో ఏపీలో వైసీపీ విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె ఏపీకి వచ్చేశారు. ఆమెను ఏపీకి తీసుకురావడం కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కేసీఆర్ ను కోరారు. సరే ఆమె ఏపీకి వచ్చిన తరువాత జగన్ ఆమెకు కీలకమైన మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలలో తిరుగులేని పెత్తనం చెలాయించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆమెకు తిరుగులేని స్వేచ్ఛ, అధికారాలు అప్పగించారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా ఖాతరు చేయలేదు.
ఆ తరువాత 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం విపక్ష హోదా కూడా దక్కనంత పరాభవాన్ని ఎదుర్కొంది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. చంద్రబాబు ఆమె నుంచి కనీసం బొకే అందుకునేందుకు కూడా ఇష్టపడలేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన క రుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్ష్మిని అవినీతి అనకొండగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశేషమేమిటంటే తెలుగుదేశం ఇంత కాలం శ్రీక్ష్మిపై చేసిన విమర్శలన్నిటినీ ఇప్పుడు తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి చేశారు. శ్రీలక్ష్మి ఆమె నిర్వహిస్తున్న శాఖ మంత్రిని కనీసం గౌరవించలేదు సరికదా అవమానించారంటూ ఆరోపించారు. టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో శ్రీలక్ష్మి మాస్టర్ మైండ్ అన్నారు. తన కింది ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించేవారని దుయ్యబట్టారు. తన అక్రమాలకు సహకరించని నాయకులపై ఆమె అసత్య ఆరోపణలు చేశారని విమర్శించారు.
అయితే భూమన ఆమెపై విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడటం అందరినీ విస్మయపరుస్తోంది. అసలు భూమన ఈ విమర్శలు , ఆరోపణలు జగన్ కు తెలిసే చేశారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో జగన్ భూమనను సమర్ధిస్తారా లేక శ్రీలక్ష్మిని డిఫెండ్ చేస్తారా అన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది. లేదా అసలేం జరగనట్లు భూమన ప్రెస్ మీట్ ను పూర్తిగా విస్మరించి మౌనం దాలుస్తారా? చూడాల్సి ఉంది. ఏది ఏమైనా శ్రీలక్ష్మిపై భూమన విమర్శలు జగన్ హయాంలో ఆమె అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే శ్రీలక్ష్మికి డబ్బు సంపాదించాలన్న యావ తప్ప నైతిక విలువలు లేవని భూమన విరుచుకుప్పడారు. తిరుపతిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తున్న సమయంలో, టీడీఆర్ బాండ్ల ద్వారా భారీగా దోచుకోవాలని ఆమె ప్రణాళిక వేశారని, అయితే తాము దానిని అడ్డుకున్నామని భూమన చెప్పుకొచ్చారు. అందుకే శ్రీలక్ష్మి నెల్లూరు జిల్లా నేతలకు తప్పుడు సమాచారం అందించి4 తాను రెండు వేల కోట్టు దోచుకున్నట్లు అసత్య ప్రచారం చేయించారన్నారు. శ్రీలక్ష్మి 35 ఏళ్ల సర్వీసులో ఎక్కడ పని చేసినా వందల, వేల కోట్ల లూటీకి పల్పడ్డారనీ, ఆమె అవినీతి వ్యవహారం సుప్రీం కు కూడా తెలుసునని చెప్పరు.