ఉత్తరప్రదేశ్ లో బెంగాల్ ఫలితాలు?
posted on Nov 16, 2021 @ 1:50PM
ఉత్తరపదేశ్ శాసనసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంకా వాద్రా గట్టి ప్రయత్నం చేస్తున్నారు.ఇతర పార్టీల కంటే ఒకడుగు ముందుగానే, ప్రియాంక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ కేవలం ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, ఏమేమి చేస్తుందో చెపుతూ ప్రచార యాత్ర సాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, ముస్లిములు, యువతను ఆకర్షించేందుకు ప్రియాంక వ్యూహాత్మకంగా పవులు కదుపుతున్నారు.
మహిళలలకు సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలెండర్లు, ఆశా,అంగన్వాడీ మహిళలకు ప్రతి నెల రూ.10 వేల గౌరవవేతనం.కొత్త ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం మహిళలకు రిజర్వేషన్. నెల నెలా వెయ్యి రూపాయల వితంతు పింఛను, విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు పంపిణీ వంటి ఉచిత వరాలు వాగ్దానం చేశారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్ఆర్సీ, సీఏఏ అమలు చేయమని వాగ్దానం చేశారు. ఇవిగాక మహిళలకు 50 శాతం అసెంబ్లీ టికెట్లు.. ఇంకా ఇతర వాగ్దానాలు, వరాలు ఎదజల్లుతున్నారు.
అయితే ఏబీపీ-సీవోటర్స్-ఐఏఎన్ఎస్ నిర్వహించిన తాజా సర్వే ఉత్తర ప్రదేశ్ తో పాటుగా వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే, ఐదు రాష్ట్రాలలో ఒక పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలోనూ తిరిగి బీజేపీనే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది. మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెట్టి, కాంగ్రెస్ అభిమానుల్లో ప్రియాంక వాద్రా ఆశలు రేకెత్తిస్తున్న ఉత్తర ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఒకే ఒక్క సీటు మాత్రమె ఎక్కువ వస్తుందని సర్వే చెపుతోంది. గత ఎన్నికల్లో 7 సీట్లతో సరిపెట్టుకున్న హస్తం పార్టీ ఈసారి 8 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంటోంది.మరో వంక బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినా, ఆ పార్టీ రేపటి ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు కోల్పోతుందని సర్వే చెపుతోంది.
గత(2017) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 సీట్లను సొంతం చేసుకున్నాయి. అనూహ్య ఫలితాన్ని సాధించాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో మాత్రం బీజేపీ/ ఎన్డీయే 108 స్థానాలను కోల్పోనుందని సర్వే తేల్చింది. అయినా.. 217 సీట్లను సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని వివరించింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 48 సీట్లతో సరిపెట్టుకున్న సమాజ్వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలు.. ఈ సారి 156 సీట్లను దక్కించుకునే అవకాశముందని తెలిపింది. అంటే ఒక సీటు అటూ ఇటుగా బీజీపే కోల్పోయే ప్రతి సీటు సమాజ్ వాదీ ఖతాలోకే చేరుతోంది. మరో వంక బీజీపే సీట్ల విషయంలో చాలా తేడా కనిపిస్తున్నా.. ఓట్ల శాతం విషయంలో బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని పేర్కొంది. బీఎస్పీకి ప్రస్తుతమున్న 19 సీట్లలో ఒక సీటు తగ్గనుందని, కాంగ్రెస్ 7 నుంచి 8 పెరుగుతుందని తెలిపింది.
ఈ సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితిని గమనిస్తే యూపీలో ఓటరు తీర్పు బెంగాల్ ఓటరు తరహాలో ఉండబోతోందని, విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్’లోలానే యూపీలోనూ బీజేపీ వ్యతిరేక ఓటు, కన్సాలిడేట్’ అవుతోందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే బీజేపీ ఓటు షేర్ పెద్దగా తగ్గక పోయినా,సమాజ్ వాదీ పార్టీ ఓటు షేర్’తో పాటు సీట్ల సంఖ్య కూడా పెరుగుతోందని అంటున్నారు. బెంగాల్లో బీజేపీ వ్యతిరేక లౌకిక వాద ఓటు గంప గుత్తగా తృణమూల్ ఖాతాలో చేరడం వల్లనే, తృణమూల్ తిరిగి అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్, వామపక్ష కూటమి కలిసి పోటీచేసినా ఫలితం లేక పోయింది. ఆ పార్టీల ఓటు కూడా బీజేపీ భయంతో తృణమూల్ ఖాతాలో చేరింది. అందుకే కాంగ్రెస్, వామపక్ష కూటమి ఒక్క సీటు గెలుచుకోలేక పోయింది. అదే విధంగా యూపీలో, బీజీపీ వ్యతిరేక ఓటర్లు ఆ పార్టీని ఓడించే సత్తా ఉందని భావిస్తున్న సమాజ్ వాదీ పార్టీవైపు మొక్కు చూపుతున్నారనేది సర్వే ఇస్తున్న సంకేతం.
అయితే సర్వేలన్నీ సత్యం కావాలని లేదుకానీ, బెంగాల్ ఎన్నికల తర్వాత తెలంగాణలోని హుజూరాబాద్ సహా, దేశంలో ఉప ఎన్నికలు జరిగిన 30 అసెంబ్లీ, మూడు లోక్ సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, ఓటర్లు గతంలోలాగా పార్టీలు, సిద్ధాతలు, కులం, మతం ఇతర ప్రాధాన్యతలను పక్కన పెట్టి ఎవరిని అయితే ఓడించాలను కుంటున్నారో, ఆ పార్టీ, అభ్యర్ధిని ఓడించే ప్రత్యర్ధి పార్టీ, అభ్యర్ధి వైపు ఏకీకృతం అవుతున్నారు. నిజానికి హుజూరాబాద్’లో జరిగింది కూడా అదే ... కేసీఆర్’ ను ఓడించాలనే నిర్ణయానికి వచ్చిన ఓటర్లు, (అందుకు ఈటల పట్ల సానుభూతి కూడా ఒక కారణం అయితే కావచ్చును) తెరాసను ఓడించే సత్తా ఈటల రాజేందర్’ కు మాత్రమే ఉందని గుర్తించారు. అందుకే ఆయన ఏ పార్టీ ఏమిటి? అనేది చూడ లేదు. కేసీఆర్’ ను ఓడించాలనే సంకల్పం చెప్పుకున్నారు .. తెరాసను ఓడించారు. ఈటలను గెలిపించారు.ఇక ముందు ఎక్కడైనా కూడా ఇదే వొరవడి కొనసాగే అవకాశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.