'బాబ్లీ' కథ వెనక రాజకీయ గాథ!

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

 

"రెండు రాష్ట్రాల మధ్య స్థానిక పరిస్థితులనుబట్టి పరస్పరం స్వార్థాలు బలిసి ఉంటాయి కాబట్టి, నదీజల పరివాహక ప్రాంతాల పరిథిలో ఉన్న రాష్ట్రాల హక్కులకు సంబంధించిన చట్టాలు తగాదాల పరిష్కారానికి తోడ్పడవు. హక్కుల్ని సమానతా సూత్రం ఆధారంగా మాత్రమే నీటిపంపిణీకి సంబంధించిన తగాదాలు పరిష్కారం కావాలి. తగాదాలో ఉన్న రాష్ట్రాలు దేనికదే తన రాష్ట్రంలోని రెండు ప్రాంతాలమధ్యనే నీటి తగాదా వస్తే తానేం చేస్తుందో ఆలోచించుకొని, ఆ సూత్రాన్నే రెండు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కూడా వర్తింపచేసుకోవాలి''!

 

   - జస్టీస్ బట్లర్ (1930): అమెరికాలోని మసాచూసెట్స్ X కనేట్ కట్ రాష్ట్రాల మధ్య జలపంపిణీ వివాదంలో యిచ్చిన తీర్పు."నీటి తగాదాలు న్యాయస్థానాల తీర్పులతో సంతృప్తికరంగా పరిష్కారం కాజాలవు''

                    - బర్బర్ (1959): అంతర్జాతీయ జలతగాదాల చరిత్ర''

 

దొంగలుపడిన ఆరునెలలకు 'అవేవో' తెగ మొరగడం మొదలెట్టాయట! నదీజలాల పంపిణీ విషయంలో ఇరుగుపొరుగుతో సమస్యలను పరిష్కరించుకోవటంలో అంతూపొంతూ లేని తాత్సారానికి అలవాటుపడిన ఆంధ్రప్రదేశ్ పాలనావ్యవస్థల తంతు కూడా అలాగే రూపుదిద్దుకుంటూ వచ్చింది. ఎడారిభూముల్ని సహితం సస్యశ్యామలం చేసుకుంటున్న ఈ ఆధునిక కాలంలో కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాలమధ్య నదీజలాల పంపిణీకి సంబంధించిన వివాదాలు పరిష్కారం కాకుండా ఏళ్ళువూళ్ళో గడిచిపోవటానికి ప్రధాన కారణం - పాలకపక్షాల మధ్య, పాలనా యంత్రాంగానికి దూరంగా ఉండే ప్రతిపక్షాల నాయకుల మధ్య పరస్పరం రాజకీయ ఎకవాక్యత కొరవడడమూ, జాతీయ దృక్పథం లేకపోతే మానె, కనీసం రాష్ట్ర రైతాంగ, సేద్యపునీటి అవసరాల పట్ల శ్రద్ధ లేకపోవటమూ! ఈలోగా, అవే కారణాలపైన ప్రాంతీయ తగాదాలు ముదురిపోవటమూ; ఈ తగాదాలకు దోహదం చేస్తున్న కారణాలలో రాష్ట్రాలమధ్య జలవివాదాలు ఒక భాగం కాగా, ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాలమధ్య జలపంపిణీ తాలూకు తగాదాలు ఎంతకూ ఒక కొలిక్కి రాకపోవటం మరో భాగం! ఈ లంపటంలో అంతర్భాగంగా ఇటీవల కాలంలో కొత్తగా తెలెత్తిన వివాదం మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తెలంగాణా ప్రాంతపు భూములకు సేద్యపునీటిని అందించవలసిన గోదావరిపైన మహారాష్ట్ర చడీచప్పుడు కాకుండా నిర్మించుకున్న బాబ్లీ ప్రాజెక్టు. తెలుగు 'సన్నాసులు' ప్రాంతీయ తగాదాల్లో 'మునగానాం-తీలానాం'గా ఉన్న సమయాన్ని కనిపెట్టి తెలివితో తేకువతో మహారాష్ట్ర పాలకులు అక్కడి రాజకీయ పక్షాలూ తెలుగువాడిని ఎక్కడ దెబ్బతీయాలో అక్కడనే తెలుగుజనాలకు జీవనాధారమైన నీటి అవసరాల మీదనే దెబ్బతీశారు! ప్రజాబాహుళ్యపు మౌలిక సమస్యలయిన తిండి, బట్ట, ఉపాథి, వసతి అవసరాలను ఈడేర్చడంపైన కేంద్రీకరించకుండా పనికిమాలిన పక్కదారులలోకి రాజకీయ నిరుద్యోగులు మళ్ళిపోవడంవల్లనే తెలంగాణాకు చెందిన అయిదారు జిల్లాలేగాక [ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు] కోస్తాంధ్రలోని గోదావరిజిల్లాలు కూడా సాగునీటి, మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుంది!


మహారాష్ట్ర నిర్మించిన ఈ బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణస్థలం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లోని శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు ఉన్న బ్యాక్ వాటర్ స్థలంలోనే ఉంది. శ్రీరాంసాగర్ గోదావరి నదిపైన మనం కట్టుకున్న తొలి సాగునీటి ప్రాజెక్టు. శ్రీరాంసాగర్ నిర్మాణ సమయంలో ఈ బ్యాక్ వాటర్ ఉన్న భూమిని మనం డబ్బిచ్చి కొనుకున్నదేగాని ఎవడూ ఉచితంగా దానం చేసిందికాదు! అయినా, "చూస్తూ ఉంటే మేస్తూ పోయిందన్న'' సామెతలా, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాడుకోవలసిన నీటి కేటాయింపు పరిథిని అధిగమించి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని శ్రీరాంసాగర్ పరిథిలోని బ్యాక్ వాటర్ స్థలంలో తలపెట్టింది! అయినా మన రాజకీయ నిరుద్యోగులకూ పాలకులకూ ఇది పట్టలేదు. ఇది రెండు రాష్ట్రాలమధ్య సమస్యకు దారితీసింది. అసలు అటు కృష్ణా జలాల పంపిణీకి చెందిన బచావత్ ట్రిబ్యునల్ గాని, ఇటు గోదావరి జలాల నిర్థారణకు సంబంధించిన ట్రిబ్యునల్ గానీ ఆంధ్రప్రదేశ్-కర్నాటక, ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలమధ్య జలసమస్యలను తమ ఓపాన శక్తికొలదీ పరిష్కరించడానికి ప్రయత్నించాయి. కాని వచ్చిన చిక్కు అంతా అటు పాలకపక్షాలుగానీ, ఇటు ప్రతిపక్షాలుగానీ పరస్పరం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జలసమస్యల్ని పట్టించుకోకుండా చూస్తూ వచ్చాయేగాని రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పరిశీలించకపోవడం వల్లనే వచ్చిపడింది. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లో సాగునీటి ప్రాజెక్టులపై తీసుకున్న పాటి శ్రద్ధను తరువాత వచ్చిన పాలకపక్షాలు [ఒక్క ఎన్టీఆర్, వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాలనలలో మినహాయించి] చూపలేదు! పైగా కృష్ణాజలాల విషయంలో కర్నాటక, గోదావరి జలాల వినియోగం విషయంలో మహారాష్ట్ర పాలకులు తమ రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించుకున్నంతగా మన రాష్ట్రపాలకులూ, ప్రతిపక్షాలూ శ్రద్ధ వహించకుండా ఎంతసేపూ పనికిమాలిన స్పర్థలతోనే కాలక్షేపం చేస్తూ వచ్చారు. 'సందట్లో సడేమియా' అన్నట్టు, కాగల కార్యాన్ని కాస్తా ఆల్మట్టి విషయంలో కర్నాటక, 'బాబ్లీ' విషయంలో మహారాష్ట్ర పాలకులు "గంధర్వులై'' గుట్టుచప్పుడు కాకుండా నెరవేర్చేశారు!

 

ఆంధ్రప్రదేశ్-మహారాస్ష్ట్రలమధ్య కుదిరిన 1955 నాటి ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణాన్ని తలపెట్టినప్పటికీ గోదావరి జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 60 శతకోటి ఘనపుటడుగుల నీటిని తన ప్రాజెక్టులకు వాడుకునే హక్కు మహారాష్ట్రకు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు జలాశాయంలోనే రహస్యంగా మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించడం తీవ్రమైన ఉల్లంఘన. ఈ ఉల్లంఘనకు కేంద్రప్రభుత్వ జలవనరుల సంఘం కూడా అభ్యంతరం చెప్పింది; తీరా చేతులు కాలిన తరువాత ఆంధ్రప్రదేశ్ పాలకులు గుడ్లు అప్పగించి చూస్తుండిపోవటమేగాక, ప్రాంతీయ తగాదాల్లో మునిగిపోయిన రాజకీయ నిరుద్యోగ నాయకులూ ఇటీవల కాలంలోనే ఇందుకు కారకులు.

 


మహారాష్ట్ర పూర్తి చేసుకున్న 12 బాబ్లీగేట్ల నిర్మాణాన్ని, నేను సలహాదారుగా పనిచేసిన ఓకే దినపత్రిక సీనియర్ పాత్రికేయులయిన ఎం.ఎస్.సి.హెచ్. బాబ్జీ రహస్యంగా మారువేషాల్లో వెళ్ళి బాబ్లీ కథ ముగిసిన వైనాన్ని సాధికారికంగా ఫోటోలతోసహా అయిదారు రోజులపాటు వార్తాకథనాన్ని రాష్ట్రప్రజలకు వెల్లడించేదాకా తగాదాల్లో ఉన్న తెలంగాణాప్రాంత నాయకులు ఒక్కరూ నోరెత్తకపోవటం మరో విశేషం! ఈ విషయంలో మిగతా రాష్ట్ర రాజకీయ నాయకులూ "నిమ్మకునోరెత్తినట్టే'' కూర్చున్నారు! అంతకుముందే విషయం తెలిసిన ఆనాటి "తెలుగుదేశం'' ప్రభుత్వం ఏమీ ఎరగనట్టే బయటకు పొక్కనివ్వలేదు. తరువాత విషయాన్ని గ్రహించిన వై.ఎస్.ప్రభుత్వం సుప్రీంకోర్టు జోక్యాన్ని అర్థించింది. ఆ పిమ్మట సుప్రీంకోర్టు తాత్కాలిక 'స్టే'ద్వారా బాబ్లీ నిర్మాణపనుల్ని వివాదం తేలేవరకూ తాత్కాలికంగా ఆపుచేయించింది. కాని ఫిబ్రవరి (2013)లో సుప్రీమ్ ఉభయపక్షాల వాదనలను విన్న తరువాత బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్రకు గోదావరి జలాల్లో నిర్ణయించిన 60 శతకోటి ఘనపుటడుగుల నీటిని ఆ రాష్ట్రం వాడుకోడానికి గల హక్కును గుర్తిస్తూనే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక షరతు విధించి, ఆ షరతు అమలు జరిగేట్టు చూసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సహా ముగ్గురు ఉన్నతస్థాయి సభ్యులతో కూడిన పర్యవేక్షక సంఘానికి అప్పగించింది. దీని ప్రకారం బాబ్లీ బరాజ్ నిర్వహణ తీరును ఈ సాధికార సంఘం పరిశీలిస్తూ 60టి.ఎం.సి. నీటి కేటాయింపులో బరాజ్ వద్ద నీటినిల్వ (కెపాసిటీ) సామర్థ్యాన్ని 2.74 టి.ఎం.సి.కి ఎట్టిపరిస్థితుల్లోనూ మించకుండా చూడాలని సుప్రీమ్ ఆదేశించింది. అయితే, శ్రీరాంసాగర్ జలాశయం భూభాగంలో అక్రమంగా నిర్మించిన బాబ్లీ కట్టడాన్ని తొలగించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినతిని మన్నించకపోవడం విచారకరం. అందుకే రెండు రాష్ట్రాలమధ్య నదీజల పంపిణీ వివాదాలను సామరస్యంతో ఆయా ప్రభుత్వాలను నిర్వహించే పాలకులు పరిష్కరించుకోవాలి గాని కోర్టులు పరిష్కరించజాలవు.

 

ఇందుకు ఉదాహరణలు - ఆల్మట్టి నిర్మాణం విషయంలో (కృష్ణా జలాల పంపిణీ)  బరాజ్ ఎత్తును ఆంధ్రప్రదేశ్ కోరికమేరకు నిర్దిష్టు పరిమితికి మించి పెంచరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని కర్నాటకలోని హెగ్డే, దేవెగౌడ ప్రభుత్వాలు, బాబ్లీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వమూ తుంగలో తొక్కాయి. అసలు ఈ తొక్కిసలాటకంతకూ ప్రధాన కారణం - నదీజలాల వినియోగం విషయంలో పాలకులకు జాతీయ దృక్పధంకన్నా సంకుచితమైన వైఖరీ, ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలమధ్య దామాషాన పంపిణీ కావలసిన ఉమ్మడి జలరాశి విషయంలో ఎవరికీ వారికి ఉమ్మడి రాష్ట్రప్రయోజనాల పట్ల సమగ్రమైన దృక్పధం బొత్తిగా కొరవడటమూ! రాజకీయ నిరుద్యోగులు ప్రజలపేరిట ప్రజలపైన తమ స్వార్థంకొద్దీ ఉద్యమాలవల్ల మొత్తం రాష్ట్రప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. బాబ్లీ విషయంలో దాదాపుగా అందరూ దొంగలే, నంగనాచులే, కొంగజపాలరాయుళ్ళే! మనకు ధర్మరాజులకన్నా శకునులు ఎక్కువైపోయారు! మన రాష్ట్ర చిత్రపటం ఇలా తగలడబట్టే ఏనాడో, దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికే, ఆ తరవాతి దశలో కూడా దశాబ్దాలక్రితం శొంఠి రామమూర్తి యావదాంధ్రుల (తెలుగువారి)కోసం రూపకల్పన చేసిన రామపాదసాగర్ ప్రాజెక్టు ఈ రోజుకీ పోలవరం ప్రాజెక్టుగా పూర్తిగా ప్రాణం పోసుకోలేకపోతుంది!


కొంతమంది తెలివితక్కువ ప్రాంతీయవాదులు పోలవరాన్ని తెలుగుప్రాజెక్టుగా భావించుకోలేక పోతున్నారు; కృష్ణా, గోదావరులు సేద్యపునీరుగా, తాగునీరుగా యావత్తు తెలుగుప్రజల అనుభవంలోకి రావలసిన బృహత్ నిర్మాణాన్ని జలరాశిగా భావించుకొనక పోవడంవల్లనే ఎటా లక్షలాది క్యూసెక్కుల నీరు శిశువుకు దక్కని తల్లిపాలలా సముద్రం పాలవుతున్నా రాజకీయ స్వార్థం బలిసిపోయి కించిత్తు బాధను కూడా వ్యక్తం చేయలేకపోతున్నారు! ఇలా బలిసిపోయిన నిరాసక్త ధోరణి వల్లనే తెలంగాణాలోని రాజోలిబండకు సహితం ఉపయోగపడగల కృష్ణనీటికి గండికొట్టేందుకు కర్నాటక పన్నిన కుట్రలో భాగంగా తుంగభద్ర నోర్డును (ఇది ఆంధ్రప్రదేశ్-కర్ణాటకల సంయుక్త మండలి) కర్నాటక ప్రభుత్వం ఏకపక్షంగా నర్మగర్భంగా రద్దు చేయబోయినప్పుడు కూడా నేటి వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు సహా రాష్ట్రనాయకులెవరూ నోళ్ళు విప్పలేక పోయారు!


అప్పుడు కూడా నేను ఒక ప్రముఖ దినపత్రికకు సంపాదకునిగా ఉన్నప్పుడు విశ్వేశ్వర్రావు (అనంతపురం)లాంటి సీనియర్ పాత్రికేయ మిత్రులద్వారా మొదటిసారిగా పెద్దస్థాయిలో ఆ కుట్రను బహిర్గతం చేస్తూ వార్తా కధలు ప్రచురించాల్సి వచ్చింది' అలాగే ఇటీవల కాలంలోనూ మరొక పత్రికద్వారా పాత్రికేయ మిత్రులను రహస్యంగా బాబ్లీకి పంపించి మొట్టమొదటిసారిగా తిరుగులేని దృశ్యమాలికల ద్వారా "బాబ్లీ కథకు తెరదించిన మాయల మరాఠీ'' అన్న మకుటంతో [19-06-2010 నుంచి 26-07-2010 దాకా] ప్రముఖంగా ఏడు వార్తాకథనాలు ప్రచురించాల్సి వచ్చింది. అంతవరకూ సాగుతున్న తంతును ఆ వార్తలో యిలా నమోదు చేయవలసివచ్చింది:


"రాష్ట్రం తెలంగాణా ఉద్యమ ఆందోళనలు, అల్లర్లతో అట్టుడికిపోతున్న సమయంలో మహారాష్ట్ర గుట్టుచప్పుడు కాకుండా తనపనిని పూర్తీచేసుకుని మనల్ని 'వెవ్వెవ్వ' అంటూ వెక్కిరించింది. మహారాష్ట్ర నిర్వాకంతో ఒక్క తెలంగాణా మాత్రమే కాకుండా అన్నపూర్ణగా పిలుచుకునే ఉభయగోదావరి జిల్లాలు సహా గోదావరిజలాలపైన ఆధారపడిన జనావాసాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని పారిశ్రామిక వాడలూ తీవ్ర సంకటస్థితిని ఎదుర్కోనున్నాయి. మహారాష్ట్రకు దిగువన గోదావరినదిపై ఉన్న నీటిప్రాజెక్టులకు ఇక ఇసుకతిన్నెలే గతి. అక్కడ పూర్తయింది బాబ్లీ ప్రాజెక్టు కాదు, నేలకూలిన తెలుగుప్రజల ఆత్మగౌరవం ... అన్ని రాజకీయపార్టీలూ దీన్ని జలరాజకీయం చేసి ప్రయోజనం పొందాయే తప్ప ఈ దారుణాన్ని ఆపలేకపోయాయి, నిర్మాణాన్ని నిలపలేకపోయాయి''

అంతేగాదు, పాత్రికేయుడు బాబ్జీ ఈ బాబ్లీ గాథను వెలికితీయడానికి పడినశ్రమనూ, ఎదుర్కొన్న కష్టాలను కూడా ఆ నివేదికలోనే ఇలా వెల్లడించం :


"సుప్రీంకోర్టు చెప్పనున్న తీర్పుతో ఇక ఇప్పుడు కొత్తగా ఒరిగేదేమీ కనిపించడం లేదు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన ఈ ప్రత్యేక ప్రతినిధికి కళ్ళు తిరిగే దృశ్యాలు కనిపించాయి. ఇప్పటివరకూ రెండు కిలోమీటర్ల దూరం నుంచే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ వ్యక్తి అయినా ఫోటోలు తీయగలిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క పురుగును కూడా అనుమతించని మరాఠా పోలీసులు ప్రాజెక్టు కాంట్రాక్టర్ గూండాలు, 'బాబ్లీ పరిరక్షణ సమితి' కళ్ళు కప్పి ఎన్నో వ్యయప్రయాసల కోర్చాల్సివచ్చింది. అక్కడకు చేరుకున్న తర్వాత, ప్రారంభోత్సవానికి పెళ్ళికూతురులా ముస్తాబయి కూర్చున్న బాబ్లీ ప్రాజెక్టు దర్శనమిచ్చింది. ఈ ప్రాజెక్టును చేరుకోడానికి అడుగడుగునా సోదాలు, గూండాల నిలవరింతలు, గ్రామస్తుల నిలదీతలు ఈ ప్రత్యేక ప్రతినిధికి లభించాయి. ఒక దశలో ఈ ప్రతినిధి ప్రాణాలకు కూడా తెగించాల్సి వచ్చింది. స్థానికంగా పరిచయమైనా ఇద్దరు మరాఠీ మిత్రులతో కలిసి తెలుగు మాట్లాడకుండా జాగ్రత్తపడుతూ బాబ్లీని చేరుకోవాల్సి వచ్చింది. బోధన నుంచి సాలూర,మహారాష్ట్రలోని బిలాని నుంచి అర్జాపూర్ మీదుగా షేర్ గావ్, కొండల్ వాడికి చేరుకున్నాం. అక్కడినుంచి గ్రామస్తులతో కలసి వారి వేషభాషలతోనే బాబ్లీ ప్రాజెక్టుకు కాలినడకన చేరాల్సివచ్చింది ... 2.70 టి.ఎం.సి.ల నీటి సామర్థ్యాన్ని మించేలా గేట్లు గనుక దించితే మరికొన్ని వందల టి.ఎం.సి.ల నీరు నిల్వ అయ్యేలా వేలాది ఎకరాల భూమిని సిద్ధం చేశారు. ముంపునకు గురి అయ్యే గ్రామాలను తరలించేశారు. నిర్మాణం పూర్తికావడంతో నిర్మాణ సామాగ్రి యంత్రాలు, వాహనాలను తరలించేశారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలమైనా, ప్రతికూలమైనా తమ ప్రయత్నం సఫలమయిందని కోర్టుతీర్పు ఏవిధంగా వచ్చినా ఫర్వాలేదనీ బాబ్లీ పరిరక్షణ సమితి సభ్యుడొకరు చెప్పారు. నిర్మాణం ఆగిపోయిందనే భ్రమలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది తిరుగులేని షాక్. సింగూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు హైదరాబాద్ మంచినీటి సరఫరాకు అంకితమైంది. కాగా బాబ్లీ నిర్మాణంతో శ్రీరాంసాగర్ ఎడారికానుంది. ఇక రాష్ట్రంలో రూ.200 కోట్ల వ్యయంతో అత్యంత ఆర్భాటంతో ఆరంభించిన ఆలీసాగర్ ఎత్తపోతల పథకం నీరు రాక వెక్కిరిస్తోంది. జలయజ్ఞానికే తలమానికంగా భావించిన ఈ ఎత్తిపోతల పధకాన్ని బాబ్లీ పూర్తిగా కబళించివేసింది'' [19 జూన్ 2010]!


ఇలా పాలకపక్షాలలో, ప్రతిపక్షాల్లో ఉన్న స్వార్థపర రాజకీయ నిరుద్యోగుల మూలంగా రాష్ట్ర సేద్యపు నీటి ప్రాజెక్టులు ఎన్నింటినో నిర్మించుకోలేక రైతాంగమూ, సాధారణ ప్రజాబాహుళ్యమూ ఎంతగానో ఇన్నేళ్ళుగా నష్టపోతూ వచ్చారు. నేటి బాబ్లీ విషయంలో మాదిరే మిగతా ప్రాజెక్టుల విషయంలో కూడా పాలక, ప్రతిపక్షాలలోని రాజకీయ నిరుద్యోగుల మధ్య ఎకవాక్యత లేకపోవడంవల్ల పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మరింత చులకనైపోయాం! దానికితోడు కృష్ణ, గోదావరి నదుల్లో పారే జలరాశిలో నిక్కచ్చిగా ఆధారపడదగిన (డిపెండబిలిటీ) మొత్తాన్ని అంచనా వేయడంలో లోపం ఉందని భ్రమకు లోనుకారాదనీ డాక్టర్ కె.ఎల్,రావు లాంటి సుప్రసిద్ధ ఇంజనీర్లు కూడా అభిప్రాయపడుతూ వచ్చారు. అలాగే, ప్రాజెక్టులు తలపెట్టడంలో జాప్యంవల్ల కొన్నాళ్ళు, తలపెట్టిన తర్వాత ప్రారంభంకాక కొన్నాళ్ళు, ప్రారంభించిన తర్వాత సకాలంలో నిర్మాణం పూర్తికానందువల్ల తడిసిమోపెడైన ఖర్చులవాళ్ళ కొన్నాళ్ళు గడిచిపోవడం వల్ల కూడా రాష్ట్రంలో ప్రాంతాల మధ్య తగాదాలు తలెత్తడమూ జరిగింది. అలాగే నదులలో "అదనపు జలరాశి'' అన్నది ఒక మిథ్యగా తయారవడం వల్ల, ఆ ''మిథ్య'' ఆధారంగా ట్రిబ్యునళ్ళు రాష్ట్రాల మధ్య జలపంపిణీని నిర్ణయించడం వల్ల కూడా ఆచరణలో సమస్యలు తలెత్తుతూ వచ్చాయని మరచిపోరాదు.


అలాగే కేంద్ర వాటర్ కమీషన్ చీఫ్ ఇంజనీరు, తుంగభద్ర బోర్డు చైర్మన్ గా పనిచేసిన గాడ్ బోలే అంచనా ప్రకారం "మన దేశంలో దాదాపు ఏ ప్రాజెక్టు కిందా మనం ఇసుకమేటలు సకాలంలో తొలగించిన పాపాన పోలేదు''! అందుకే ఈ రోజుకీ అటు ఉత్తరాంధ్రలోని వంశధార రెండవ దశగానీ, ఇటు తెలంగాణాలోని శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు రెండవదశగానీ పరిపూర్తి కాకపోవడానికి కారణం ప్రాంతాలమధ్య వివక్షవల్ల కాదు, పాలనావ్యవస్థల ముందుచూపులేని విధానాలవాళ్ళ మాత్రమే! అందుకే మూడుప్రాంతాలలోని చిన్నవీ, మధ్యరకం, భారీ నీటిపథకాలు నిర్మాణం కోసం, ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నవీ ఎన్నో ఉన్నాయి. వేర్పాటు ఉద్యమాలే మౌలిక సమస్యలను పరిష్కరించజాలవు. సమస్యల మూలాలలోకి, పెట్టుబడీదారీ విధానాల తీరుతెన్నులలోకి వెళ్ళి పరిశీలించకుండా గావుకేకల వల్ల ప్రయోజనం శూన్యం! ఇది నేటి మాటే కాదు, హెచ్చరికగా రేపటి మాట కూడా. కులాసా కబుర్లనుంచీ, విలాసక్షేత్రాలనుంచీ (ఫామ్ హౌసెస్) నీరు పారదు, కనుకనే పాలనా విధానాల, ఉత్తుత్తి ఉద్యమాల తీరూమారదు!

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. కేటీఆర్ కు ముళ్ల కిరీటమేనా?

క‌మ్యూనిస్టుల‌కు  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి ఎంత  ప‌వ‌ర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అంటే అంత వేల్యుబుల్.  అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి  నుంచి ఇప్ప‌టి  వ‌ర‌కూ   గ్రేట‌ర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత  రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు.  దుబ్బాక నుంచి మొద‌లు పెడితే నిన్న మొన్న‌టి  జూబ్లీహిల్స్ బై పోల్ వ‌ర‌కూ ప్ర‌తి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది.  ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల‌లోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.   రేవంత్  విమర్శలను పక్కన పెడితే..  కేటీఆర్ కి కానీ,  బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేసీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.  అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  కేటీఆర్  పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  గా  ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?

సీఎం లోకేష్.. ముహూర్తం ఫిక్సైందా?

లోకేష్ ని 2027 ఉగాది నాటిక‌ల్లా  ముఖ్య‌మంత్రిని చేసే దిశ‌గా  కొన్ని  పావులు క‌దులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి మోడీ క‌లిసిన‌పుడు జ‌రిగే  ప్ర‌ధాన  చ‌ర్చ ఇదేనంటారు చాలా మంది. ఇటు ఢిల్లీ, అటు నాగ్ పూర్ వ‌ర్గాల స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఇదే జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతోంది.  ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  నంబర్ 1, 2,  3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది.  అయితే ఈ హైరాక్కీని దాటి   త్వ‌ర‌లో  లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. లోకేష్ కు సీఎం పదవి విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి అగ్రనాయకత్వం సుముఖంగా ఉందంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదంటున్నారు పరిశీలకులు. సీఎం పదవి కోసం పవన్ తొందరపడటం లేదనీ, ఆయన తన పాతికేళ్ల పొలిటికల్ కేరీర్ లు ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.   అన్నిటికీ మించి లోకేష్ కు సీఎం పట్టాభిషేకం చేయడానికి నంబర్స్ కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు మించిన సంఖ్యా బలం ఉంది. ఇక కూటమి ఐక్యత విషయానికి వస్తే.. పవన్ కు కూటమి అవసరమా? కూటమికి పవన్ అవసరమా? అన్న ప్రశ్నే తలెత్తే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కూటమి పటిష్ఠత గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతిలో లోకేష్ క్రెడిట్ ను గుర్తించడానికే మొగ్గు చూపుతున్నారు.  ఈ నేపథ్యంలోనే   సీఎం చైర్ కు లోకేష్ లైన్ క్లియ‌ర్ అయ్యిందనే అంటున్నారు పరిశీలకులు. 

ఓట్ చోరీ.. రాహుల్ ని గట్టెక్కించలేదెందుకు?

ఒక‌ప్పుడు ఇందిరాగాంధీ, ఆ తరువాత  రాజీవ్ గాంధీ.. భార‌త రాజ‌కీయాల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించారు. వారికి చట్టసభల్లో సంఖ్యాబలానికి ఒక పరిమితి అంటూ ఉండేది కాదు.  ఇప్పుడైతే వ‌రుస‌గా మూడోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చినా, మూడో సారి బీజేపీకి స్వయంగా వచ్చిన స్థానాలు   240 కాగా.. ఎన్డీయే  భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో ఎలాగోలా  గ‌ట్టెక్కి అధికార పీఠం చేప‌ట్ట‌గ‌లిగింది. అదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో అయితే అప్ప‌ట్లో  లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం  400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి  చేయ‌లేదు. ఎవ‌రి  క‌ష్టం  వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ చేస్తున్న ఆర్భాటాన్నీ, హంగామానూ బిల్డప్ ప్రక్రియగా కొట్టి పారేశారు.  ఏదో ఒక నేరేటివ్ బిల్డ‌ప్ చేయ‌డంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని  తెర‌పైకి తెచ్చారంటున్నారు. రాహుల్ అందిపుచ్చుకున్న ఓట్ చోరీ..  వ్యూహ‌క‌ర్త‌లిచ్చిన స‌ల‌హా  లేదా సూచ‌న  కావ‌చ్చు. అదీ కాదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వమే స్వయంగా ఈ నినాదాన్ని ఎత్తుకుని ఉండవచ్చు. అయితే ఓటు చోరీ నినాదం ప్రజల్లోకి లోతుగా వెళ్లినట్లనిపించినా.. అది కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చింది లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఓట్ చోరీ స్లోగ‌న్ తో బీహార్ ఎన్నిక‌ల‌కు వెళ్తే అది బూమ‌రాంగ్ అయ్యింది. రాహుల్ లాంటి ప్ర‌చార‌క్ ఉన్నంత వ‌ర‌కూ బీజేపీ  అధికారంలోకి వ‌స్తూనే ఉంటుంద‌న్న టాక్  అధికార కూటమిలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.  రాహుల్ విషయంలో చెప్పుకోవలసిందంటూ ఏదైనా ఉంటే ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర.  ఆ యాత్ర ద్వారా.. రాహుల్  ఇటు కాంగ్రెస్ ని అటు ఇండి కూట‌మిని  ఈ మాత్ర‌మైనా  నిలబెట్టగలిగారు.   అలాగ‌ని రాజ‌కీయ ప‌రంగా అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలాంటి చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌క పోవ‌డం వ‌ల్ల  కాంగ్రెస్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు.  కార్య‌క‌ర్త‌లను ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంచాలి.  అందులో భాగంగానే రాహుల్ గాంధీ.. ఈ నినాదం భుజానికి  ఎత్తుకున్నారు. త‌ర‌చూ త‌న వాద‌న‌ల రూపంలో  ఏదో ఒక అంశాన్ని, సమస్యను తెరమీదకు తీసుకువస్తుంటారు. తినగతినగ వేమ తియ్యగుండు అన్నట్లుగా.. నిరంతరం జనంలోకి ఏదో ఒక అంశాన్ని తీసుకువెడుతుంటే.. ఏదో ఒక లీడ్ దొరికి అధికారం ‘చేతి’కి రాకుండా ఉంటుందా అన్నది ఆయన ఆలోచనో, వ్యూహమో అయి ఉంటుందంటున్నారు పరిశీలకులు.   ఇవాళ్రేపు రాజ‌కీయంగా ఒక నెగిటివిటీని నూరిపోస్తే త‌ప్ప రాణించ‌లేని గ‌డ్డు కాలం న‌డుస్తోంది. అందుకే రాహుల్ ఈ దేశం నుంచి ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షాల‌ను పార‌దోలాల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంద‌నీ,  వారి ప్ర‌భావం నుంచి దేశాన్ని కాపాడాలని అంటున్నారు కానీ అది ఎలా సాధ్యం అన్న విషయంలో మాత్రం రాహుల్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ క్లారిటీ కానరావడం లేదంటారు పరిశీలకులు. ఓట్ చోరీ నినాదం విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉండటం యాధృచ్ఛికమేనా?  

జ‌గ‌న్ ‘పీపీపీ’.. డుం డుం డుం!

మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విధానాల‌ పై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎంత ఉందో తెలియ చేస్తూ కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల  నుంచి మెడికల్ కాలేజీల ప్రభుత్వ, ప్రైవేటు   భాగస్వామ్యం విధానానికి వ్యతిరేకంగా కోటీ  4 ల‌క్ష‌ల   ఈ సంత‌కాల సేక‌ర‌ణ చేసి గ‌వ‌ర్న‌ర్ కి స‌మ‌ర్పించారు జగన్.  ఈ సందర్భంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. జగన్ స్వయంగా 40 మంది బృందంతో కాలినడకన వెళ్లి మరీ ఆ సంతకాల పత్రాలను గవర్నర్ కు అందజేశారు. అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.  ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ఇంత‌కీ జ‌గ‌న్ అండ్ కో  పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ఏమిటంటే..   పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీ అభివృద్దికి ముందుకు వచ్చే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాపేక్షతోనే వస్తారు. కోట్లు కొల్లగొడతారు. దీని వల్ల పేదలకు వైద్య విద్య మ‌రింత ఖ‌రీద‌వుతుంది. ఇది వారి పాలిట ఆశ‌నిపాతంగా మారుతుంది. ఇదీ జగన్ అండ్ కో అంటే జగన్, వైసీపీయులు చేస్తున్న వాదన. ఇక కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించే సందర్భంగా  జగన్ హాట్ కామెంట్లు కూడా చేశారు. అందులో యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావించారు. యోగాంధ్ర కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం పేదల మెడికల్ విద్య కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు.  ఇక్కడే ఆయన ఆర్థిక అజ్ణానం బయటపడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం స్వయంగా ఖర్చు చేయడం లేదు.. ప్రైవేటు వ్యక్తులను ఆ వ్యయంలో భాగస్వాములను చేస్తున్నది. అదే పంధాలో సంక్షేమ పథకాలనూ అమలు చేస్తున్నది. జగన్ హయాంలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసి బటన్ నొక్కుడు అంటూ ఖజానా మొత్తం సంక్షేమం అంటే ధారపోసి జగన్ బావుకున్నదేంటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అంటే జగన్ కు ఘోర పరాజయం, రాష్ట్రానికి తలకు మించిన అప్పులు మాత్రమే.  ప్రభుత్వానికి తలకు మించిన భారం కాకుండా  ప్రైవేటు వ్య‌క్తుల‌ను కూడా ఇన్వాల్వ్ చేయ‌డం మంచిదే కదా అంటున్నారు ఆర్థిక నిపుణులు. జ‌గ‌న్  హయాంలో ఆయన రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇంకా అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పులు తెచ్చి మరీ సంక్షేమం అంటూ చేసిన పందేరం.. ఓట్ల వేటే తప్ప మరేదీ కాదంటున్నారు.  ఇటీవల వలంటీర్ల విషయంలో తనకు జ్ణానోదయం అయ్యిందని ఇటీవల జగన్ ప్రకటించారు. మరి అప్పులు చేసి రష్ట్ర ప్రగతిని శూన్యం చేసి అమలు చేసిన సంక్షేమం దారి తప్పిందన్న విషయంలో ఆయనకు ఇంకా జ్ణానోదయం కలిగినట్లు లేదంటున్నారు విశ్లేషకులు.   ప్ర‌తిదీ ప్ర‌భుత్వం నుంచే ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల అది  పెట్టుబ‌డి అనిపించుకోదు.   ప్ర‌భుత్వ‌మే  అన్నీ ఉచితంగా చేయ‌డం వ‌ల్ల ఎన్ని నిధులూ సరిపోవు. అప్పులే శరణ్యం అవుతుంది. అందుకే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నది చంద్రబాబు సర్కార్.  ఈ విషయం అర్ధం చేసుకోకుండా,  జగన్ ఇలాగే వ్యవహరిస్తే..  2029 కాదు.. 2034నాటికి కూడా  వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులే కాదు... వైసీపీయులు కూడా  అంటున్నారు.  ఎవరో అనడం ఎందుకు జగన్ తాను స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా అవే చెబుతున్నాయి కదా!  మరి జగన్  ఈ తీరు వైసీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే. 

ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టిన పంచయతీ ఫలితాలు.. సీఎం రేవంత్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గురువారం (డిసెంబర్ 17) మీడియాతో మాట్లాడిన ఆఈయన ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు రిఫరెండంగా ఆయన అభివర్ణించారు.  పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.  మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందనీ, అంటే 66శాతం స్ట్రైక్ రేట్ సాధించిందనీ చెప్పిన రేవంత్, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైపోటీ చేశాయనీ, అయినా కూడా రెండు పార్టీలూ కలిపి 33 శాతం పంచాయతీల్లోనే గెలిచాయని రేవంత్ అన్నారు.   పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారన్న రేవంత్ రెడ్డి వారిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మొత్తం 8 వేల 335 పంచాయతీలలో జెండా పాతిందన్నారు.  ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 87 సెగ్మెంట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిందన్నారు.  అంటే  2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తామని స్పష్టమౌతోందన్నారు.  2028 ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయగలరా?!

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ భారతం ఆకలితో అలమటించేలా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రం ఈ పథకంలో ఉన్న లోపాలను సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది. పేదలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి వైదొలగుతోందని దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలోనే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు.  జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారు సరే.. భారత కరెన్సీ నోట్ల మీద నుంచి గాంధీ బోమ్మను తొలగించగలరా?  అని చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందనీ, దేశ సమగ్రత, సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నదని డికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. జగన్ పై చంద్రబాబు విజయం!?

తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. గత అసెంబ్లీ ఎన్నికలనాటి కంటే అధికంగా కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక రెండో స్ధానంలో బీఆర్ఎస్ నిలిచింది. బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై   తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది. అదేంటంటే మూడో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇదేంటి ఎన్నికలు జరిగింది తెలంగాణలో  ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై గెలవడమేంటి? అన్న ఆసక్తి కలిగించేలా సోషల్ మీడియాలో వార్త  హల్ చల్ చేసింది. ఇంతకీ విషయమేంటంటే..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ సంర్పంచ్ పదవికి పోటీ పడిన వారిలో ఒకరి పేరు భేక్య చంద్రబాబు కాగా, మరో వ్యక్తి పేరు బానోత్ జగన్నాథమ్. ఈ పేర్లే ఈ ఎన్నికను ఆసక్తిగా మార్చేశాయి.  ఈ ఎన్నికలో   భూక్య చంద్రబాబు  బానోత్ జగన్నాథమ్  బానోత్ జగన్నాథమ్ పై విజయం సాధించారు.  దీనిపైనే నెటిజనులు తెలంగాణలో కూడా జగన్ ను చంద్రబాబు ఓడించారు అంటూ సెటైరిక్ గా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  

సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతున్నారు. ఈ సారి చంద్రబాబు పర్యటన లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టులకు అనుమతుల సాధనే అంటున్నారు. నల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో చంద్రబాబు  ప్రధాని మోడీ,  జలవనరులశాఖ మంత్రి సిఆర్‌ పాటిల్‌ తో వేర్వేరుగా భేటీ కానున్నారు.నల్లమల సాగర్‌కు అనుమతులతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ పర్యటనలో కేంద్రాన్ని సిఎం కోరనున్నట్లు తెలుస్తోంది. 

పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా   ఉపాధి హామీ  పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.  ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే  ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే  దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ భగ్గు.. బీజేపీ కార్యాలయాల ముట్టడి

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి జరుగుతోంది. అఖిల భారత కాగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం (డిసెంబర్ 18)  దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల మట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  తెలంగాణలో కూడా  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే  అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధిస్తోందని కాంగ్రెస్  నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.    బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.