ఇద్దరు ఉన్నతాధికారులకు ఏడు రోజుల జైలు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
posted on Jun 22, 2021 @ 4:26PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు ఉన్నతాధికారులకు ఏడు రోజుల జైలు శిక్ష విధించింది. ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరిలకు వారం రోజుల పాటు జైలు శిక్షను విధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ గత ఏప్రిల్ లో తాము ఇచ్చిన ఆదేశాలను వీరు అమలు చేయకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేయడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది.
ఆ 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను అమలుచేయాలంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశించింది. అయినప్పటికీ, ఆ ఆదేశాలను ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరి బేఖాతరు చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ నేడు కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఆ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకుగాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు.
ఏపీలో కొద్ది నెలల క్రితం ముగిసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఐఏఎస్ అధికారి, నాటి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పై బదిలీ వేటు పడింది. అప్పటి పంచాయతీశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లతో భేటీ అయ్యేందుకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నించగా వారు హాజరు కాలేదు. దీంతో గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్లను బదిలీ చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు. దీంతో, వారి స్థానంలో మరో ఇద్దరిని నియమించారు. ఆ తర్వాత గిరిజా శంకర్, ద్వివేదీలపై ప్రొసీడింగ్స్ జారీ చేయడం, సర్వీసు రిజిస్టర్ లో రిమార్క్ రాయడం, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు సిఫారసు చేయడం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది.