ఆర్థిక కష్టాల్లో కరెంట్ కొనడమెలా? జగన్ రెడ్డి పాలనలో ఏపీకి చీకట్లేనా?
posted on Oct 11, 2021 @ 12:19PM
ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు కరెంట్ గండం రాబోతోందా? రానున్న రోజుల్లో రాష్ట్రం అంధకారం కాబోతోందా? అంటే ప్రభుత్వ వర్గాలు, విద్యుత్ రంగ నిపుణుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరెంట్ కు కటకట ఏర్పడింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో.. పవన్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఈ పరిస్థితి ఏపీలో మరీ దారుణంగా ఉంది. ఏపీలోని ఎనిమిది థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉత్పత్తికి గండం ఏర్పడింది. గతంలో మిగిలు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. రానున్న రోజుల్లో తీవ్ర సంక్షోభంలో పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఏపీకి పవర్ గండంతో పాటు ఆర్థిక కష్టాలు మరింతగా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికంతటికి కారణం జగన్ రెడ్డి సర్కార్ విధానాలేననే ఆరోపణలు వస్తున్నాయి.
విద్యుత్ పై గతంలో సీఎం జగన్ చేసిన ప్రకటనలను గుర్తు చేస్తూ.. గత రెండున్నర ఏండ్లుగా విద్యుత్ రంగంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ... జగన్ సర్కార్ ఎలాంటి తప్పులు చేసిందో వివరిస్తున్నారు విద్యుత్ రంగ నిపుణులు. 2019 మే 30వ తేదీన ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంలో విద్యుత్ పై మాట్లాడారు” కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్ పవర్ కోసం గ్లోబల్ టెండరింగ్ చేస్తూ యూనిట్ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్కు రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్ అవర్స్ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను…” ఇది సీఎం జగన్ తన తొలి ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు.
చెప్పినట్లుగానే సీఎం జగన్ పీపీఏలు రద్దు చేశారు. ఈ వ్యవహారాన్ని మాజీ చీఫ్ సెక్రటరీ.. చంద్రబాబు వద్దే సీఎస్గా పని చేసి రిటైరన కల్లా అజేయరెడ్డి చూశారు. విద్యుత్ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని వాదించారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండానే యూనిట్ రూ.2.72కు అందిస్తామని.. కంపెనీలు ముందుకు వచ్చాయని.. పీపీఏలు అవసరం లేదన్నారు. కానీ రెండేళ్లు తిరిగే సరికి సీన్ మారిపోయింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ. ఇరవై పెట్టి యూనిట్ విద్యుత్ కొనాల్సిన పరిస్థితి ఏపీకి వచ్చింది. కొంతకాలంగా ప్రభుత్వం రూ.పది కన్నా ఎక్కువ రేటుకే కొనుగోలు చేస్తోంది. అందుకే ట్రూ అప్ చార్జీల భారం కూడా పడింది.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఎనిమిది వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేశారు. కోర్టుల్లో కుదరకపోయినా కొనుగోలు మాత్రం ఆపేశారు. ఆ విద్యుత్ ధర యూనిట్కు నాలుగున్నర వరకూ ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం పవర్ ఎక్సైంజీల్లో రూ. ఇరవై పెట్టి కొంటోంది. పవర్ ఎక్సైంజీల్లో సెప్టెంబర్ 15 వరకు సగటున యూనిట్ రూ.4. 60 పైసలు ఉండగా ఇప్పుడు అది రూ.20కు చేరింది. బహిరంగ మార్కెట్లో డిమాండ్ సప్లయ్కు తగ్గట్లుగానే కరెంట్ చార్జీలు ఉంటాయి. ఏపీ సర్కార్ కొరత కారణంగా విద్యుత్ ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు తప్పడంలేదు. ఓ వైపు ఆర్థిక కష్టాలు మరో వైపు చేసిన తప్పులు మీద పడటంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
రెండు రోజుల క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఏపీ విద్యుత్ సంక్షోబంలో చిక్కుకుపోయిందని.. తక్షణం ఆదుకోవాలని కోరారు. ఏపీలోని 2,300 మెగావాట్ల గ్యాస్ విద్యుత్ ప్లాంట్లకు ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థల నుంచి అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. ఏపీలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోందని దానికి తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు ఉండటం లేదన్నారు. ఏపీ విద్యుత్ సంస్థలు సామర్థ్యం మేర విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని సగం మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని ప్రధానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 8 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు బొగ్గు ఆధారిత ప్లాంట్లతో ఉన్న ఒప్పందాలను వినియోగించుకోలేకపోతున్నామని దీని వల్ల ప్రతి రోజూ 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తుండగా.. దాని ధర ఇప్పుడు మూడు రెట్లు పెరిగిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15 వరకు సగటున యూనిట్ రూ.4.6 ఉండగా, అక్టోబర్ 8 నాటికి రూ.15కు చేరిందని కొన్ని సందర్భాల్లో విద్యుత్ కొనుగోలుకు యూనిట్కు రూ.20 చెల్లించాల్సి వస్తోందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏం చేయాలో కూడా లేఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చారు. ఏపీలోని విద్యుత్ కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్ను కేటాయించాలని కోరారు. ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖతో రాబోయే కాలంలో కరెంట్ కోతలకు.. వాతలకు సూచనగా ఎక్కువ మంది భావిస్తున్నారు. అధిక ధరను పెట్టి విద్యుత్ను కొనుగోలు చేస్తున్నామంటే ఆ భారం ప్రజలపై వేయడానికేననని భావిస్తున్నారు.