సెలెక్ట్ కమిటీ ఫైల్ వెనక్కి... ధిక్కరణ నోటీసులు ఇస్తామంటోన్న టీడీపీ

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఫైల్ ను శాసనమండలి కార్యాలయం వెనక్కిపంపింది. రూల్‌ 154 కింద కమిటీ వేయడం చెల్లదని ఫైలు మీద రాసి తిప్పిపంపారు. దాంతో సెలెక్ట్ కమిటీ ఫైల్ తిరిగి మండలి ఛైర్మన్ వద్దకే చేరింది. అయితే, ఫైల్ వెనక్కి పంపారన్న సంగతి తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు మండలి కార్యదర్శిని కలిశారు. సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై కౌన్సిల్ ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని కోరారు. అయితే, ఈసారి ఛైర్మన్ నుంచి ఫైల్ వచ్చిన వెంటనే సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయకపోతే మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రూల్‌ 154 కింద మండలి ఛైర్మన్‌ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే సెలెక్ట్ కమిటీలు వేయాల్సి ఉంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. అసలు సెలెక్ట్ కమిటీలంటేనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే మండలి సెక్రటరీని బెదిరించి ఫైల్ ను వెనక్కిపంపేలా చేశారని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు.

ఇక, సెలెక్ట్ కమిటీలకు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు ఇవ్వగా, తాము ఆ కమిటీల్లో ఉండబోమని అధకార వైసీపీ తేల్చిచెప్పింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ ప్రక్రియలో తాము భాగస్వాములు కాబోమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లు మండలి ఛైర్మన్ కు లేఖలు రాశారు.

Teluguone gnews banner