కరోనా చికిత్స కోసం అదనంగా రూ. 1000 కోట్లు: సీఎం జగన్
posted on Jul 24, 2020 @ 5:37PM
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. శుక్రవారం జరిగిన కోవిడ్ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా 2380 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ చెప్పారు.
వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఇవికాకుండా కోవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలకోసం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు.