ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!!

ఏపీ రాజధాని వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. విజయవాడలో జరిగిన ‘ది హిందు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ కార్యక్రమానికి హాజరైన ఆయన.. రాజధాని ప్రస్తావన తెచ్చారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అన్నారు. పదేళ్లలో విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. విశాఖలో అభివృద్ధికి అపార అవకాశం ఉందని తెలిపారు. అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని చెప్పారు. అలాగే, అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని మరోసారి జగన్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు.

‘ముఖ్యమంత్రిగా రాజధానిపై నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుంది’ అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు. రాజధాని గురించి బాహుబలి లాంటి గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని అన్నారు. తాను ఏం చేయగలనో ఆ వాస్తవాలను మాత్రమే చెప్తాను అన్నారు. ప్రజలను మభ్యపెట్టాలని, గ్రాఫిక్స్‌ చూపించాలని అనుకోవట్లేదు.. జపాన్, సింగపూర్‌ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని అని జగన్ వ్యాఖ్యానించారు.

Teluguone gnews banner