ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధానికి సీఎం జగన్ లేఖ...

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పదేపదే తెరపైకి తెస్తున్నారు సీఎం జగన్. హోదాతోనే అభివృద్ధి సాధ్యమని వీలైనంత త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని జోక్యం అవసరం ఉందని లేకపోతే ఏపీ ప్రజలు దురదృష్టవంతులుగా మిగిలిపోతారని జగన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సరైన న్యాయం జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏపీకి చేయూత ఇవ్వడానికి బడ్జెట్ లో ఎలాంటి ప్రస్తావన కూడా లేదని లేఖలో పేర్కొన్నారు జగన్. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కునేందుకు ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇప్పటివరకు రాకపోవడం వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 

పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకిచ్చే ప్రత్యేక హోదాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం రెండు వేల పదహారులో ప్రకటించిందని, అయితే పదిహేనవ ఆర్థిక సంఘం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని నివేదికలో పేర్కొన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. కానీ, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవడం అనేది తమ పరిధి కాదని పదిహేనవ ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని అన్నారు. దీన్ని బట్టి కేంద్ర ఆర్థిక శాఖకు, పదిహేనవ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత ఏపీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. విభజన జరిపిన తీరు వల్ల తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ లబ్ధి పొందిందని ఏపీకి కేంద్రం నుంచి సరైన సాయం అందలేదని లేఖలో ప్రస్తావించారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు జగన్.

Teluguone gnews banner