వైసీపీ, బీజేపీ మధ్య వార్! ఢిల్లీ డైరెక్షన్ లోనే జగన్ టార్గెట్?
posted on Jun 17, 2021 @ 4:38PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయా? అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక గండమేనా? జగన్ రెడ్డిపై బీజేపీ ఫోకస్ చేసిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం, వైసీపీ టార్గెట్ గా ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారిగా దూకుడు పెంచడం చర్చగా మారింది. కేంద్రం పెద్దల డైరెక్షన్ లోనే కమలం నేతలు స్పీడ్ పెంచారని అంటున్నారు. ఇకపై వైసీపీ టార్గెట్ గానే ఏపీ బీజేపీ కార్యక్రమాలు ఉండనున్నాయని తెలుస్తోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడప నుండే బీజేపీ వార్ మొదలైనట్లు కనిపిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశం వైసీపీ, బీజేపీల మధ్య రచ్చ రాజేసింది. స్వాతంత్య్ర సమరయోధుడుగా కీర్తిస్తూ పట్టణంలోని జిన్నా రోడ్డు సర్కిల్లో టిప్పుసుల్తాన్ సర్కిల్ ఏర్పాటు చేస్తుండడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతోందియ టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. భారతీయులను కాఫీరులుగా ముద్ర వేసి ఊచకోత కోసిన పరమ దుర్మార్గుడికి విగ్రహాం ఏర్పాటు చేయడం ఏంటని సోము వీర్రాజు మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరు మత సామరస్యానికి మారుపేరుగా ఉందని, ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.టిప్పుసుల్తాన్ క్రూరుడు కాబట్టే గతంలో ఎక్కడ విగ్రహాలు పెట్టలేదని వెల్లడించారు. దేశానికి ఎనలేని సేవ చేసిన మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కన్నా టిప్పుసుల్తాన్ గొప్పవాడు కాదని, టిప్పుసుల్తాన్ విగ్రహం స్థానంలో అబుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జిన్నా రోడ్డు, మైదుకూరు రోడ్డు కూడలిలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటు చేయాలని కొందరు ముస్లిం పెద్దలు భావించారు. ఈనెల 13న టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి భూమిపూజ చేశారు. దీంతో అసలు వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే రాచమల్లు టిప్పుసుల్తాన్ను దేశ భక్తుడు, చారిత్రక పురుషుడు అంటూ కీర్తించడాన్ని ఖండిస్తోంది భారతీయ జనతా పార్టీ. టిప్పుసుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తానని చేసిన ప్రకటనపై మండిపడుతోంది ఆ పార్టీ. మరోవైపు టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశం పదిహేనేళ్ల కల అంటున్నారు ముస్లింలు.
ఇప్పటికే కర్నాటకలో టిప్పుసుల్తాన్ జయంతి కార్యక్రమాల్ని వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో, అదీ వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహం కావడం మరింత కాక రేపుతోంది. విగ్రహం ఏర్పాటు అంశాన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామంటోంది. టిప్పుసుల్తాన్ చరిత్రపై ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధమంటున్నారు బీజేపీ నేతలు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన టిప్పుసుల్తాన్ వ్యవహారం ప్రస్తుతం ప్రొద్దుటూరులో అలజడి సృష్టిస్తోంది. ఈ సెన్సిటివ్ ఇష్యూ ఎటు దారితీస్తుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.