Read more!

ఉపాధ్యాయులపై కోపంతో పిల్లల ప్రాణాలతో చెలగాటమా?

 రౌడీయిజం, ఫ్యాక్షనిజంలో కక్షలు కార్పణ్యాలు ఉంటాయి. అందులోనూ రాయలసీమ రాజకీయాల్లో ఫ్యాక్షనిజం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది అభిలషణీయం కాదు. అయినా  అదొక రకం. ఇప్పుడు విషయం అది కాదు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం ఎండలు మండుతున్నా ఒంటిపూట బడులు ప్రారంభించలేదని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో ఆరోపించారు.

 ఎండలు మండుతున్నా ఒంటిపూట బడులు ఎందుకు నిర్వహించరని, ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని ఆ లేఖలో అనగాని సత్యప్రసాద్  ప్రశ్నించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలులో ఉంది. అయితే ఒంటిపూట బడుల కోసం అడిగిన ఉపాధ్యాయులపై  మంత్రి బొత్స ఆగ్రహించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ మండిపడ్డారు.

అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా  ఫ్యాక్షనిస్టు రాజకీయాలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయా, లేవా అనే విషయాన్ని పక్కన పెడితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు కక్ష సాధింపు దాడులకు,  హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణ అయితే బలంగా వినిపిస్తోంది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ రెడ్డి కుల్చివేతల పాలనలో గీతం యూనివర్సిటీ సహా అనేక మంది ప్రతిపక్ష నాయకుల ఇళ్లూ, వాకిళ్ళ కూల్చివేతల సంఘటనలు అనేకం వెలుగు చూశాయి. రాజకీయ ప్రత్యర్ధులపై  భౌతిక దాడులు నిత్య కృత్యంగా సాగుతున్నాయనే ఆరోపణ ఎటూ ఉండనే వుంది. అలాగే, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది హత్యలకు గురయ్యారనే ఆరోపణలున్నాయి. ఈ నాలుగు సంవత్సరాలలో జరిగిన పరిణామాలను గమనిస్తే  వైసేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయం  సామాన్య ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది. 

ఈ నేపథ్యంలో  ప్రభుత్వం పట్ల ధిక్కార స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్న ఉపాధ్యాయులపై  ముఖ్యమంత్రి  కట్టారని, అందుకే, ఇరుగు  పొరుగు రాష్ట్రాలలో ఎప్పటినుంచో ఒంటి పూట  బడులు నిర్వహిస్తున్నా రాష్ట్రంలో మాత్రం నిర్ణయం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. మరోవంక   పిల్లల తల్లితండ్రులు ఎండలు తీవ్ర స్థాయికి చేరిన పరిస్థితిలో మీ రాజకీయాల కోసం పిల్లలు ప్రాణాలతో చెలగాటం వద్దని అంటున్నారు.