తాడిపత్రికి పెద్దారెడ్డి.. జేసీ మాస్ వార్నింగ్

 

 

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ పట్టణంలో అడుగుపెట్టబోతున్నారు. పోలీసు ఆంక్షలను సవాలు చేస్తూ కేతిరెడ్డి కోర్టు అనుమతితో మరో రెండు రోజుల్లో తాడిపత్రి రాబోతున్నారు. అయితే ఆయన్ని అడ్డుకునేందుకు జేసీ వర్గీయులు కూడా సిద్ధమవ్వడం, తాడిపత్రికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు ... దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అని పట్టణ  వాసులు టెన్షన్ పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రి కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాష్ట్రమంతా రాజకీయం ప్రశాంతంగా ఉంటే  ఒక్క తాడిపత్రి లో మాత్రం ఎప్పుడు పొలిటికల్ హీట్ రగులుతూనే ఉంటుంది.


 తాడిపత్రిలో మాజీ  ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల వైరం ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఎప్పుడూ టెన్షన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. గత 30 ఏళ్లుగా తాడిపత్రిలో జేసీ కుటుంబానిదే ఆధిపత్యం. జేసీ కుటుంబంలో పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్న వారే గెలుస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటినుంచి ఈ ఆధిపత్య పోరు మరింత ఎక్కువయింది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తుతూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి పోలీసుల సహాయంతో  జేసీ ప్రభాకరరెడ్డిని ఇంటి బయటకు కూడా రానివ్వకుండా అనేకమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏక్కడ ఏ ధర్నా కార్యక్రమం, ఏ ఆందోళన చేసే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలో కూర్చుని ఆ కుటుంబానికి సవాల్ విసిరారు. 

ఇక అప్పటి నుంచి వారి మధ్య ఆధిపత్యపోరు మరింత పీక్స్ కు చేరింది.సీన్ కట్ చేస్తే ఇప్పుడు జేసీ వంతు . 2024 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కలు కనపడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి అనంతరం తాడిపత్రి కి దూరమైన పెద్దారెడ్డి ఇంతవరకు ఆయన సొంత ఇంటి మొహమే చూడలేదు. 2024 ఎన్నికల సమయంలో చెలరేగిన హింస వల్ల తాడిపత్రిలోని కీలక నేతలందరినీ పట్టణానికి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటూ  కాలం గడపాల్సి వచ్చింది. కానీ కోర్టు ఆదేశాలతో ఇటీవల నేతలు ఒక్కొక్కరిగా తాడిపత్రికి చేరుకుంటున్నారు. పెద్దారెడ్డి మాత్రం ఇప్పటివరకు తాడిపత్రిలోని తన సొంత ఇంటి మొహం చూడలేకపోయారు. మధ్యలో ఒకసారి ఏదో పేపర్స్ కోసమని తాడిపత్రి కి వెళ్లే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో పోలీసులు అప్పటినుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ఎంట్రీ లేకుండా చేశారు. ఆ క్రమంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు ఉత్తర్వులు  తెచ్చుకున్నారు. 

రెండుమూడు  రోజుల్లో ఆయన తాడిపత్రిలో ఎంటర్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ పెద్దారెడ్డి రాకను జేసీ ప్రభాకరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై పబ్లిక్ గానే పెద్దారెడ్డిని తాడపత్రిలోకి రానివ్వనని జేసీ స్టేట్మెంట్ ఇవ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో పెద్దారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న గ్రౌండ్ వద్ద పెద్ద సంఖ్యలో రాళ్ల కుప్పలు దర్శనమివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయి ఆ రాళ్ల కుప్పలను తొలగించారు. ఇక తాడిపత్రి వెళ్ళే విషయంలో పెద్దారెడ్డి కూడా గట్టిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నారు. జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలను చూపించి పోలీస్ బందోబస్తుతో వెళ్లాలని అనుకుంటున్నారు.. అయితే జేసీ వార్నింగ్ నేపథ్యంలో పోలీసులు కేతిరెడ్డికి పర్మిషన్ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠభరితంగా మారింది.