మందు సీక్రెట్ను కొట్టేసే కుట్ర!.. హైకోర్టులో ఆనందయ్య పిటిషన్..
posted on May 28, 2021 @ 1:58PM
అనుకున్నట్టే అవుతోంది. ఆనందయ్య మందు సీక్రెట్ను కొట్టేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయం స్వయంగా ఆనందయ్యనే చెబుతున్నారు. చెప్పటమే కాదు.. ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. అవును, నిజమే. కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఆనందయ్య.. హఠాత్తుగా హైకోర్టు పిటిషన్ రూపంలో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. కొవిడ్ నివారణ మందు తయారీకి అవసరమైన పదార్థాలతో పాటు ఫార్ములా చెప్పాలని అధికారులు వేధిస్తున్నారని ఆనందయ్య హైకోర్టులో గురువారం వ్యాజ్యం దాఖలు చేశారు. మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నానని.. ఈ కార్యక్రమానికి రక్షణ కల్పించేలా ఆదేశించాలన్నారు.
‘‘లోకాయుక్త ఆదేశాల మేరకు మందు విషయంలో వాస్తవాలు తేల్చేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీ ఆయుష్ కమిషనర్తో వచ్చి నమూనాలు సేకరించింది. మందుపై ప్రజలు ఎవరూ నెగెటివ్గా చెప్పడం లేదని నివేదికలో పేర్కొన్నారు. మందు తయారీకి వాడే ఫార్ములా చెప్పాలని త్రిసభ్య కమిటీ సభ్యులతో పాటు ఆయుష్ కమిషనర్ ఒత్తిడి చేస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీగా ఖర్చు చేయలేని సామాన్య ప్రజలను నా మందు ఆకర్షించింది. ప్రస్తుతం నేను మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, అధికార యంత్రాంగం కలిసి దీన్ని కమర్షియలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన కలుగుతుంది. అధికరణ 301 ప్రకారం స్వేచ్ఛాయిత వృత్తి, వాణిజ్యం నిర్వహించుకోవచ్చు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని నా ఆయుర్వేద వృత్తిలో అధికారుల జోక్యాన్ని నిలువరించండి’’ అని ఆనందయ్య కోరారు.
ఆనందయ్య వ్యాజ్యంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్ర అంటూ జనం మండిపడుతున్నారు. రెండు వారాల పాటు సజావుగా సాగిన మందు పంపిణీ కార్యక్రమం.. ప్రభుత్వ జోక్యంతో సడెన్గా ఆగిపోయింది. ఆయూష్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. మందు పంపిణీ మాత్రం ఇంకా మొదలు కాలేదు. అప్పటి నుంచీ ఆనందయ్య సైతం కనుమరుగు. ఆయన్ను రహస్య ప్రదేశంలో ఉంచి.. పెద్ద ఎత్తున మందును తయారు చేయిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు సాక్షంగా పలు వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అధికారుల అండతో.. పాలకులు ఆనందయ్య మందును ఫార్ములాతో సహా కొట్టేసే కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.