చంద్రబాబుకు అమిత్ షా ఫోన్.. జగన్ కు జబర్దస్త్ షాక్
posted on Oct 27, 2021 @ 3:33PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చే పరిణామం జరిగింది. ఇటీవల ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, టీడీపీ కార్యాలయాలపై దాడుల ఘటనలతో వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేయడం ఆసక్తిగా మారింది. వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది.
బుధవారం మధ్యాహ్నం అమిత్ షా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఏపీలో పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో కలవడం కుదరలేదని, మరోసారి కలుద్దామని చెప్పారు. చంద్రబాబు తనను ఎందుకు కలవాలని అనుకుంటున్నారో అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏపీ పరిస్థితులపై వినతి పత్రం తయారు చేశామని, అది పంపుతున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్రమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగ విధ్వంసం జరుగుతోందని, అలాగే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు తదితర విషయాలను అమిత్ షాకు వివరించారు.
అలాగే ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుపడినా దాని మూలాలు ఏపీకి రావడం, ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు వివరించారు. అదే విధంగా తాము రాష్ట్రపతికి అందించిన వినతిపత్రం, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో, వీడియోతో సహా పంపుతానని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుసుకున్న చంద్రబాబు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే అమిత్ షా మంగళవారం మధ్యాహ్నం వరకు జమ్మూ కశ్మీర్ నుంచి రాకపోవడం, తర్వాత ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడంతో కలవడం కుదరలేదని ఆయన పేషీ అధికారులు చంద్రబాబు బృందానికి సమాచారం అందించారు. దీంతో చంద్రబాబు బృందం ఢిల్లీ నుంచి తిరిగొచ్చింది.