అల అమరావతిపురమున.. మే 2న..సెకండ్ రిలీజ్
posted on May 1, 2025 @ 12:01PM
మళ్లీ మోడీ చేతుల మీదుగా ప్రారంభం
పత్రికలో పవన్ కళ్యాణ్ మిస్సింగ్
అమరావతి పునః ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యత లేదు.. అందుకే ఆహ్వాన పత్రంలో ఆయన పేరు వేయలేదు.. అన్న కోణంలో వైసీపీ తెగ ఫీలవుతోంది. ఈ దిశగా కూటమిలో చీలికలు తెచ్చే యత్నం ఒకింత జోరుగానే తెలుస్తోంది.. అందుకే రకరకాల మీమ్స్ తయారు చేసి.. తద్వారా కూటమిలో వారికి వారు కొట్టుకు చచ్చే ఎత్తుగడ వేస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు కూటమి కనుక ఇదే ఒరవడితో తమ బంధాన్ని కొనసాగిస్తే.. మళ్లీ కూడా ప్రభుత్వం వారిదే అవుతుంది. దీంతో కూటమిలో ఎలాగైనా సరే చీలికలు తేవాలన్న కృత నిశ్చయంతో ఉంది వైసీపీ. ఈ దిశగా ఆ పార్టీ చేయని విశ్వ ప్రయత్నం లేదు.
మొన్న పవన్ కేరళ, తమిళనాడు తీర్ధయాత్రలకు వెళ్లినపుడు కూడా ఇంతే. పవన్ ఉప ముఖ్యమంత్రిగా అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. ఆయన్ను తీసి పక్కన పెట్టేశారు. వచ్చే రోజుల్లో లోకేషే డిప్యూటీ సీఎం కాబోతున్నారు. కాబట్టి పవన్ అలిగి వెళ్లిపోయారంటూ తమకు తాము ఎన్నెన్నో కలలు కన్నారు. ఊహాగానాలను వ్యాప్తి చేసే యత్నం చేశారు. తీరా యాత్ర నుంచి వచ్చిన పవన్ ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమానికి హాజరై యాభై లక్షల విరాళం కూడా ఇచ్చారు. దీంతో అవాక్కవడం ఫ్యాను పార్టీ నేతల వంతయ్యింది.
కట్ చేస్తే ఇప్పుడు మరో గొడవ. పవన్ పేరు అమరావతి ఆహ్వాన పత్రంలో లేదు కాబట్టి ఇక ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది. ఆయన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే యత్నం చేస్తున్నారంటూ మీమ్స్ చేస్తున్నారు. రెడీ సినిమాలో బ్రహ్మానందం క్లిప్పింగు వాడి.. నానా హంగామా చేస్తున్నారు. దీని కారణంగా కూటమిలో ఎలాగైనా ఒక గ్యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఏతా వాతా వైసీపీ వాళ్లు ఈ అంశంలో లాగే లాజిక్ ఏంటంటే.. బీజేపీ, టీడీపీ కలవడానికి మూల కారకుడు.. కూటమి మూల పురుషుడు.. పవనే కదా? మరి పవన్ కి ఆహ్వాన పత్రికలో ప్రాధాన్యత లేకుంటే ఎలా? అన్నది వీరి ప్రశ్న.
ఇక్కడే కాదు ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికినా సరే పవన్ ని బయటకు లాగి ఆయన్ను గానీ, ఆయన అభిమాన గణాన్ని కానీ, ఆయన సైనికులను కానీ.. టెంప్ట్ చేయాలి. వారి మనోభావాలను దారుణంగా రెచ్చగొట్టాలి అన్నది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారులా ఉంది చూస్తుంటే. అందుకే నిన్న మొన్న వైసీపీ హంగామా చేసిన గో మరణాల విషయంలో అయితేనేమీ, శ్రీ కూర్మం తాబేళ్ల విషయంలో అయితేనేమీ.. పవనానంద స్వామి ఏమై పోయాడు? ఏడీ ఆయన సనాతన ధర్మ పరిరక్షణ అంటూ నానా హంగామా చేస్తున్నారు.
అయితే ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తెలుసుకోవల్సిన విషయమేంటంటే పవన్ తనకు తాను ఎప్పుడో ప్రొటోకాల్ అంశంలో ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఈ విషయంలో మనకున్న ఆధారాలు ఏంటంటే.. మొన్న జగన్ మోహన రెడ్డి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్న సమయాన.. ఆయన ఒక మాట అన్నారు. నాకు మోడీతో సాన్నిహిత్యం ఉండొచ్చుగాక.. కానీ ప్రొటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం అక్కడ తనకు స్థానం కేటాయిస్తారు. ఉప ముఖ్యమంత్రి అన్నది అంత గొప్ప పదవి కాదు. రాజ్యాంగ బద్ధమైనది అంతకన్నా కాదు. అది కూటమి ప్రభుత్వంలో నెంబర్ టూ పొజిష్ అయి ఉండొచ్చుగాక.. కానీ దానికి విశాల దృక్పథంతో చూస్తే ఉన్న విలువ వేరు. మొదట ప్రధాని, తర్వాత స్పీకర్, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు మంత్రులు ఇలా ఉంటుంది. అంతే కానీ, నా సీటు తీసుకెళ్లి ప్రధాని పక్కన వేయలేదని తాను ఎలా బాద పడకూడదో జగన్ కూడా సరిగ్గా అలాగే బాధ పడకూడదని ఆయన కుండ బద్ధలు కొట్టారు. ఈ క్రమంలో చూస్తే పవన్ కి పిచ్చ క్లారిటీ ఉందన్న మాట. పవన్ ప్రొటో కాల్ విషయంలో ఇంత స్పష్టమైన విజన్ కలిగి ఉన్నా కూడా వైసీపీ నేతలు ఇంకా అదే భ్రమతో.. పిచ్చి ఆశ కొద్దీ.. కూటమిలో చీలిక తెద్దామన్న విశ్వ ప్రయత్నాలైతే మానడం లేదు. నిజంగా రాజధాని విషయంలో చింతించాల్సిన అంశాలేంటి? అన్నది ఆలోచించాలి. చిత్తశుద్ధి ఉంటే.. తమకు కూడా రాజధాని పట్ల ఒక స్థిర అభిప్రాయం ఏర్పడిందని ప్రకటించాలి. ఎందుకంటే మూడు ప్రాంతాల ప్రజలు రాజధాని ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు కాబట్టే వారు కూటమికి 164 సీట్ల ఆధిక్యం కట్టబెట్టారని గుర్తించాలి. అలా చేయకుండా పిల్లి ఉట్టి గానీతెగి కింద పడితే ఆ పాలన్నీ తాగొచ్చన్న భ్రమలో ఉండి ఎలా శాపాలు పెట్టుకుంటూ ఉంటుందో, అలా వైసీపీ కూటమి ప్రభుత్వంలో విబేధాలు లేకున్నా ఏదో లా సృష్టించి వాటి ద్వారా లబ్ధి పొందాలని చూడ్డం దారుణంగా భావిస్తున్నారు ఆంధ్రులు. మరి చూడాలి వైసీపీ వైఖరి ఇకనైనా మారుతుందా లేదా అన్నది.