జయభేరి కోసం రైతులకు అన్యాయం చేసిన చంద్రబాబు!!

టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అనడం సరికాదని హితవు పలికారు. సమస్యలు చెప్పుకొనేందుకు సీఎం జగన్ ని రాజధాని రైతులు కలిశారని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా పూలింగ్‌ పేరిట చంద్రబాబు బలవంతపు భూసేకరణ చేశారని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు మిత్ర అని చెప్పుకునే చంద్రబాబు మంగళగిరిలో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. నేషనల్ హైవేను ఆనుకుని జయభేరి అపార్ట్ మెంట్స్ కట్టారు. వాటికి సమీపంలో ఈస్ట్‌ ఫేస్‌తో రైతులకు సంబంధించిన భవనాలు కడుతుంటే.. వాటి కారణంగా జయభేరి అపార్ట్ మెంట్స్ అమ్ముడుపోవనే కారణంతో వాటిని రిజర్వు జోన్‌లో పెట్టారని ఆరోపించారు. స్దానికంగా 600 ఎకరాల రైతులకు అన్యాయం చేయలేదా అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు.. తన ఇంటి దగ్గర బల్బుల కోసమని... ఉండవల్లి పంచాయతీ నుంచి రూ. 50 లక్షలు డ్రా చేయించారని ఆరోపించారు. రైతుల సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయాలు చేస్తూ గ్రామస్థాయి నేతలా చంద్రబాబు మాట్లాడుతున్నారు అని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Teluguone gnews banner