ఎసిబి కస్టడీలో ఎసిపి ఉమమహేశ్వరరావు 

అవినీతిని కూకటి వేళ్లతో పీకి వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అవినీతి చేపలను ఏరివేసే పనిలో నిమగ్నమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును బుధవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని తమ కస్టడీకి అప్పగించాలంటూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, పది రోజుల కస్టడీ కోరగా.. మూడు రోజులు మాత్రమే కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 22న ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.3.95 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఏసీపీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా, జైలు నుంచి ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

Teluguone gnews banner