చిలకలూరి పేటలో యాక్సిడెంట్, ఆరుగురు సజీవదహనం
posted on May 15, 2024 @ 11:00AM
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు.ఒకే కుటుంబానికి ముగ్గురు మంటల్లో కాలి బూడిదయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలో అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనాలు రెండూ నుజ్జునుజ్జయింది. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ఆరుగురు మంటలకు ఆహుతయ్యారు.
ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. మృతుల్లో లారీ డ్రైవర్, మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తంగా ఆరుగురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతులను అంజి (35), ఉప్పుగుండూరు కాశీ(65), ఉప్పుగుండూరు లక్ష్మి (55), ముప్పరాజు ఖ్యాతిసాయిశ్రీ (8)గా గుర్తించారు. వీరందరూ బాపట్ల జిల్లాకు చెందినవారే. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదంపై చంద్రబాబు, పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి బాధాకరంమని, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు.