ఏయూలో 65 మందికి కరోనా.. హాస్టల్స్ మూసివేత
posted on Mar 27, 2021 @ 5:18PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. వర్సిటీకి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలో 65 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ లో మొత్తం 15 వందల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు వచ్చిన పరీక్షల్లో 65 మందికి వైరస్ సోకింది. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కు తరలించారు వైద్యాధికారులు.
విద్యార్థులకు కరోనా సోకడంతో ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ లో హాస్టళ్లను మూసివేశారు. యూనివర్శిటీ పరిధిలోని పలు కాలేజీలు తమ విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని నిర్ణయించాయి. ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఏయూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా, ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విభాగాలు ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ బోధనకు మారాలని వర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏయూలో కరోనాపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించారు. జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సూర్యనారాయణను అడిగి ఏయూలో కరోనా వ్యాప్తి వివరాలు తెలుసుకున్నారు.వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో నిత్యం 7 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని... పాడేరు, అరకు, కేజీహెచ్, అనకాపల్లి, నర్సీపట్నం, విమ్స్ ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశామని, 1000 బెడ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 42,696 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 947 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో విశాఖ జిల్లా (156), గుంటూరు జిల్లా (145) ఉన్నాయి.