రాష్ట్రంలో 100 ఇండస్ట్రియల్ పార్కులు!
posted on Aug 14, 2024 @ 10:36AM
రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామికాభివృద్ధి పార్కులు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నందుకు వాటి ఏర్పాటుకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పారిశ్రామికాభివృద్ధి పార్కుల్లో ఎన్ని అభివృద్ధి చేశారు, ఇంకా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్న వాటిపై పరిశీలన చేయాలని చెప్పారు.
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఏరియా ఆధారిత ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఇ శాఖలపై సచివాలయంలో సీఎం మంగళవారం (ఆగస్టు 13) సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నపారిశ్రామికాభివృద్ధి పార్కులు, కొత్తగా ఏర్పాటు కానున్న ఓడరేవులపై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఒ కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 100 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, దేశంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న ఉత్తమ పోర్టులపై అధ్యయనం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. దేశంలో రెండవ అతిపెద్ద సముద్రతీర ప్రాంతాన్నికలిగి ఉన్నందున ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు మరిన్ని పోర్టులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల నిర్మాణం జరగినప్పుడే ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయనీ, ఆదిశగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ పోర్టుల ఏర్పాటుకై మాస్టర్ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.