దీపావళికి 2 గంటలే టపాసులు కాల్చాలి.. సుప్రీంకోర్టు తీర్పు.!!
posted on Oct 23, 2018 @ 2:15PM
'దీపావళి అంటే టపాసులు వల్ల వచ్చే పెద్ద పెద్ద శబ్దాలు, పొగ కాదు. దీపావళి అంటే దీపాల పండుగ' అని.. టపాసులు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అయినా టపాసుల మ్రోత ఆగదు. అయితే ఈ మధ్య వరుస సంచలన తీర్పులు ఇస్తున్న సుప్రీంకోర్టు.. టపాసుల విక్రయం, దీపావళి వేడుకుల గురించి కూడా సంచలన తీర్పు ఇచ్చింది. దీపావళి రోజు టపాసులు రెండు గంటలు మాత్రమే పేల్చాలని స్పష్టం చేసింది.
పెద్దమొత్తంలో టపాసులు కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని, దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. టపాసుల విక్రయాలను పూర్తిగా నిషేధించడం కుదరదని, అయితే అమ్మకాలకు కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. తక్కువ పొగ విడుదల చేసే, తక్కువ శబ్దం వచ్చే, పర్యావరణానికి హాని కలిగించని టపాసులను మాత్రమే విక్రయించాలని కోర్టు తేల్చి చెప్పింది. లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే వీటిని అమ్మాలని ఆదేశించింది. అంతేగాక ఆన్లైన్ ద్వారా టపాసుల విక్రయాలపై న్యాయస్థానం నిషేధం విధించింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి విక్రయాలు జరిపితే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం దీపావళి పండగకు మాత్రమే కాదని, అన్ని మతాల పండగలు, శుభకార్యాలకు వర్తిస్తుందని సుప్పీంకోర్టు తెలిపింది. దీంతో పాటు టపాసులు పేల్చేందుకు సమయాన్ని కూడా నిర్దేశించింది. దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది. ఇక క్రిస్మస్, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.55 నుంచి 12.30 గంటల మధ్య టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది.