"తప్పులు చేశాం, అబద్ధాలూ చెప్పాం'' : జయపాల్!

 


 

- డా. ఎబికె ప్రసాద్


[సీనియర్ సంపాదకులు]

 

 

జ్ఞానులయిన కొందరు తాత్వికుల అభిప్రాయంలో "దేవుడికీ త్యాగాలూ, త్యాగశీలురంటేనే యిష్టం''! కాని ఆధునిక యుగంలోని పెక్కుమంది రాజకీయవేత్తలూ, కుహనా రాజకీయాలూ తాము త్యాగాలు చేయకుండా తమ పదవుల వేటలో భాగంగా సామాన్యప్రజల్ని తమకోసం త్యాగాలు, ప్రాణత్యాగాలూ చేసేందుకు పురిగొల్పడం సర్వసాధారణమైపోయింది. అవసరమైతే తమ స్వార్థంకోసం దేశ రాజ్యంగాన్నీ, చట్టాలనూ వక్రీకరించడానికి సహితం ఏమాత్రం వెనుదీయరని కేవలం పది-పదిహేను పార్లమెంటు సీట్లకోసం అంగలార్చడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే స్థితికి దిగజారిపోయారు. భారత రాజ్యాంగ నిబంధనలను అధ్యయనం చేసిన ఏ బుద్ధజీవీ ఈ పరిణామాన్ని సహించలేడు! కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నలలోనే, దాని ఆశీస్సులతోనే, ఒకేజాతి, భాషాప్రాతిపదికపైన తన ఉత్తర్వులు ఆధారంగానే తాను నియమించిన "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం'' సిఫారసులు పునాదిగానే, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన నాటి జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, దాని సభలూ పదేపదే ఆమోదించిన తీర్మానాల సాక్షిగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని - నిట్టనిలువునా చీల్చడానికి, తెలుగుజాతిని ముక్కలు చేయడానికి నేటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానాన్ని హడావుడిగా ఆమోదించింది; దానికి అంతే ఆదరాబాదరాగా క్యాబినెట్ ఆమోదముద్ర వేయించింది.

 

 

రాష్ట్రానికి చెందిన తన సొంతపార్టీ ఎం.పి.లను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా అకస్మాత్తుగా రాష్ట్రాన్ని విభజించే నిర్ణయాన్ని ప్రకటించింది. క్యాబినెట్ ఆమోదానికి ముందు పచ్చి అబద్దాల ద్వారా రోజుకొక తీరుగా రాష్ట్రప్రజలను మభ్యపెట్టి మోసగించింది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండుసార్లు ఎన్నికల్లో అఖండ విజయం ద్వారా రాష్ట్రప్రజలు కాంగ్రెస్ కు అత్యధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులను అప్పనంగా చేతికి అందించినందుకు ప్రతిఫలం - కేవలం తన కొడుకు రాహుల్ ను ప్రధానమంత్రిగా ఎలాగోలా నిలపడంకోసం తెలుగుజాతినే విచ్చిన్నం చేయబోవటం! పైగా అది కూడా ఏ ప్రాతిపదికపైన? రాజ్యాంగంలోని "3వ అధికరణ'' చాటున అక్రమంగా దాగి కాంగ్రెస్ అధిష్ఠానం కుట్రపన్నడం ద్వారా ఈ పనికి పూనుకుంది. ఆ "కుట్రలో భాగమే - తెలంగాణా విభజన సమస్యపై ముందుగా తన ప్రతిపాదన ఏమిటో కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించకుండా ప్రతిపక్షాలను ఇరికించడం! అందుకే సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ ఎం.పి.లు సహితం తమను అధిష్ఠానం పూర్తిగా చీకట్లోకి నెట్టేసి, మాటమాత్రంగా కూడా విభజన నిర్ణయాన్ని తమకు ముందుగా తెలపనేలేదని బయటపడి చెప్పవలసి వచ్చిందని చెప్పడం!

 

ఈ మొత్తం విషపూరితమైన ప్రయోగంలో ఆదినుంచీ పాల్గొన్న అధిష్ఠానంలోని ప్రధాన సభ్యులెవరూ? తమ తమ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కాపాడుకోలేక 'ఛీ' కొట్టించుకుని ఆయా రాష్ట్రాల ప్రజలకు దూరమైపోయిన ముగ్గురు తెలుగేతర సభ్యులు - దిగ్విజయ్ సింగ్ (మధ్యప్రదేశ్), అహ్మద్ పటేల్ (గుజరాత్), గులామ్ నబీ ఆజాద్ (జమ్మూ-కాశ్మీర్)! ఈ బాపతు తెలుగుజాతి భవిష్యత్తును దెబ్బతీయడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆదేశాలపైన ఆయాచితంగా అవతరించిన తీర్పకులయ్యారు! పైగా సుస్థిరత పొందిన రాష్ట్రాలను విభజించడం వల్ల కాంగ్రెస్ కు ప్రజలకూ ఎంత నష్టం వాటిల్లిందో స్వయాన తమ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో దిగ్విజయ్, ఆజాద్ లు బాహాటంగా ప్రకటనలు చేసినవారేనని, కలలో కూడా మరిచిపోరాదు! అయితే మధ్యలో, మన తెలంగాణా జాతీయంలో చెప్పాలంటే, కొందరు "బుడ్డర్ ఖాన్''ల [విదూషకుల]వల్ల రాష్ట్రానికి ఏర్పడిన సమస్యకు ఇండియన్ (దేశీయ) పరిష్కారం కాకుండా అర్థాంతరంగా వచ్చిపడిన 'ఇటాలియన్ సొల్యూషన్' మూలంగా రాష్ట్ర పరిస్థితులు మరింత జటిలమైపోయాయి! కాంగ్రెసేతర రాజకీయ పక్షాలలో పెక్కుమంది తాము ఆ 'ఇటాలియన్' పరిష్కారాన్ని తలదాల్చడంలో ఒకరికొకరు పోటాపోటీలు పది చివరికి 'ఇటాలియన్ సూత్రాని'కె కట్టుబానిసలై రాష్ట్ర పరిస్థితుల్ని మరింతగా కంపుకంపు చేసి కూర్చున్నాయి!



ఈ తరుణంలో ఎక్కడ ఏ స్థాయిలో ఎలాంటి చర్చ లేదా ప్రస్తావన సాగిందోగాని నా ఆత్మీయ మిత్రులు, కాంగ్రెస్ నాయకులయిన సీనియర్ కాంగ్రెస్ మంత్రి జయపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి 'విభజన' సమస్యపైన వేర్వేరు దృక్పథాలనుంచే అయినా తెలుగుజాతి భవిష్యత్తుకు ఏర్పడిన సంకట స్థితిపైన ఆవేదనను, తమ పాలుపోని స్థితినీ దాచుకొనలేక తమ మనోగత బాధను వేర్వేరు ప్రకటనలో వెలిబుచ్చడం గమనార్హం! వీరిలో ఒకరు (జయపాల్) విభజనపై జరిగిన కాంగ్రెస్ నిర్ణయాన్ని విమర్శించకుండానే ఇరుప్రాంతాల సయోధ్యకు సమస్యకు "సామరస్య పరిష్కారాన్ని'' వెతకడానికి తద్వారా ఉభయప్రాంతాల మధ్య "పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకుందామ''ని ప్రతిపాదించారు! ఈ ప్రతిపాదనకు పూర్వరంగంగా జయపాల్ ఒక బండసత్యాన్ని బయటపెట్టక తప్పలేదు : ఆయన మాటల్లోనే  "మానవమాత్రులం కాబట్టి తప్పులు చేశాం. అబద్ధాలూ చెప్పాం. వాటి లోతుల్లోకి నేను వెళ్ళదలచలేదు'' అని నిర్మొహమాటంగా ఒప్పేసుకున్నారు! అందుకు ఆయనను అభినందించాలి. కాని ఆ "తప్పులు', "అబద్ధాల''ద్వారా రాష్ట్రసమైక్యతకు, మొత్తం తెలుగుజాతికీ, ఇరుగుపోరుగులో మన గౌరవప్రతిష్ఠలకూ తక్షణం పూరించలేని నష్టం ఎంతటి భారీస్థాయిలో జరిగిందో జయపాల్, శశిధర్ లు గుర్తించాల్సివచ్చింది; ఈ క్రమంలోనే ఉభయులూ హైదరాబాద్ యింత బ్రహ్మాండమైన స్థాయిలో వివిధరంగాలలో ఎదగడానికి బహుభాషల, భిన్న సంస్కృతులలో దీపించడానికి అన్నిప్రాంతాల వారి చోదోడు, వాదోడు ఉందనీ గుర్తించగలిగారు. అయితే మరో "పెద్దమనుషుల ఒప్పందం'' కోసం జయపాల్ పెడుతున్న షరతు మాత్రం కథను మొదటికే తెస్తుంది! మొదట "పెద్దమనుషుల ఒప్పందం'' [రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా కుదిరిన ఒప్పందం] పూర్తిగా అమలులోకి రాకపోవడానికి లేదా అమలులోకి తెచ్చుకోలేక పోవడానికి కారకులెవరో ప్రస్తావించకుండా, "విభజనపై 'నిర్ణయం' జరిగిపోయిందిగనుక మరోసారి రెండుప్రాంతాల మధ్య మరొక "పెద్దమనుషుల ఒప్పందం''ద్వారా సామరస్యం నెలకొల్పుకుందామని జయపాల్ చెప్పడం హాస్యాస్పదం కాదా? అంతేగాక, "విభజన రాజ్యాంగ హక్కు'' అని ఆయన చాటడం మరీ విడ్డూరం!

 

ఎందుకంటే, రాజ్యాంగంలోని ''3''వ అధికరణం ఏకభాషా సంస్కృతులు ప్రాతిపదికగా ఏర్పడిన రాష్ట్రాలకు వర్తించదుగాక వర్తించదు! అందుకే భారతదేశ చరిత్రలో ఏనాడూ ఒకే భూభాగం పరిథిలో లేదా ఒకే రాష్ట్రంగా ఒకే గొడుగుకింద లేని హిందీ రాష్ట్రాలకు లేదా ప్రాంతాలకు మాత్రమే "3వ అధికరణ'' వర్తిస్తుందన్న సంగతి మరవరాదు! కాగా, అదే రాజ్యాంగ కింద కేంద్రప్రభుత్వమే సాధికారికంగా భాషా ప్రయుక్త ప్రాతిపదికపైన "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్''ను (ఎస్.ఆర్.సి.) ఏర్పరిచి వున్నందున, దాని సిఫారసులపైన ఏర్పడిన రాష్ట్రాలను విచ్చిన్నం చేయడానికి ఆ "3వ అధికరణ'' అవతరించాలేదని గమనించాలి! అంతేగాదు, రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చాలన్నా, ఉన్న రాష్ట్రంలోని ఒక భాగాన్ని మరో భాగంలో విలీనం చేసి, వేరే రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా సంబంధిత రాష్ట్రప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా రాష్ట్రాన్ని విభజించడానికి నిరంకుశ రాచరికవ్యవస్థలో 'సామంతుల' ఇష్టారాజ్యాలలో మాత్రమే వీలుంటుందిగాని, ప్రజాస్వామిక వ్యవస్థలో [మనం అలాంటి దానిలోనే ఉన్నామన్న నమ్మకం ఉంటే గింటే] మాత్రమే వీలుపడదు! అందుకే, రాజ్యాంగంలో సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా వగైరా కొన్ని రాష్ట్రాల స్థిరత్వం కోసం "ప్రత్యేక నిబంధన''లను  అధికారాలను రాజ్యాంగం పొందుపరిచిందని మరచిపోరాదు.

 

18p/371 (డి) ప్రాధాన్యం అదే మార్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికీ, స్థిరత్వానికి, ఉద్యోగ, సద్యోగ విషయాలలో రాష్ట్రంల్ని మూడు ప్రాంతాలమధ్య [ఆంద్ర, రాయలసీమ, తెలంగాణా] సమానతా విలువలు ప్రాతిపదికగా సమన్యాయం పొందుపరచడానికి అనుగుణంగా, తూ.చ.తప్పకుండా పాటించడం కోసమే అవతరించిన ప్రత్యెక ప్రొవిజన్ (స్పెషల్ ప్రొవిజన్) 371[డి] అని మరవరాదు! రాజ్యాంగ సవరణద్వారా 1973 నాటికే 371 అధికరణకు సవరణ తెచ్చి దానిని 371[డి]గా 1974 జులై 1 నుంచి ఇందిరాగాంధీ హయాములోనే ఈ సవరణ పడద్బందీగా అమలులోకి వచ్చింది! తద్వారా ఆ సవరణ అధికరణను కేంద్రం అనుల్లంఘనీయం చేసింది!

 

ఈ ప్రత్యేక సవరణ ఆధారంగానే దాని వివరణాత్మకమైన కఠిన షరతుల పరిధిలోనే ఉద్యోగుల నియామకాలుగాని, బదిలీలుగానీ, ప్రమోషన్లుగానే జరగాలని శాసించింది! వారి అలాంటి ప్రత్యేక అధికరణను ఒకవేళ సక్రమంగా సమన్యాయంగా పరిగణించి, పాటించకుండా పదవుల కాలక్షేపంలో మునిగితేలుతూ వచ్చిన మంత్రులను కొరత వేయకుండా, వారు చట్టాన్ని చట్ట నిబంధనలనూ అమలు జరపని నేరానికి ప్రజలను శిక్షించ సాహసించడం కన్నా మించిన 'క్రిమినల్ చర్య' ఎలా రాజ్యాంగహితమైనదో మిత్రులు జయపాల్, శశిధర్ లు మనసు విప్పి చెప్పాలి! పైగా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగుజాతి ఐకమత్యం కోసం, దాని బిడ్డలందరి సమష్టి అభ్యుదయం కోసం ఉద్దేశించిన ఆ ప్రత్యేక విశిష్ట సవరణతో కూడిన 371[డి] అధికరణకు రాజ్యాంగంలోని "3వ అధికరణ'' వాదిగా లోబడి ఉండాలేగాని అందుకు విరుద్ధమైన దిక్కులో అది ప్రయాణించడానికి వీలులేదు సుమా! అందుకే "371డి'' అధికరణ ఉద్దేశం, లక్ష్యం ఏమిటో తెలియని దిగ్విజయ్ సింగ్ లాంటి కొందరు శంకా పీడుతుల కోసమే భారత సుప్రసిద రాజ్యంగా నిపుణుడూ, కలకత్తా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, కేంద్ర లా కమీషన్ మాజీ సభ్యుడు, ఠాగూర్ లా ప్రొఫెసర్, భారత రాజ్యాంగ చట్ట భాష్యాకారుడూ అయిన దుర్గాదాస్ బసు ఆ అధికరణ గురించి యిలా వివరించారు :
"371[డి] అధికరణను తీసుకు రావడంలో మౌలికమైన ప్రయజనం ఏమంటే : (1) ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడం, తద్వారా రాష్ట్రమంతటా సమతుల్యమైన అభివృద్ధిని సాదించడం; (2) విద్య, ఉపాధి, పబ్లిక్ సర్వీస్ లో పౌరుల కెరియర్ అవకాశాలను రాష్ట్రంలోని వివిధప్రాంతాల్లో సమతుల్యంగా కల్పించడం'' [జస్టీస్ బసు "కాన్ స్టిట్యూషన్ లా'' పేజీ:384]!




ఈ 371[డి] అధికరణ అఆదారంగానే ఎన్టీఆర్ హయాములో 610 జీ.వో. వచ్చిందని మరవరాదు! అయినప్పుడు, ఈ "లక్ష్యాన్ని'' చేరుకునే ప్రయత్నంలో భాగంగానే జస్టీస్ శ్రీ కృష్ణ కమిటీ (2010) ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, 1956కు ముందున్న పరిస్థితికీ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాంతాలలో నెలకొంటూ వచ్చిన అభివృద్ధినీ అంచనావేసి, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ ఇప్పటికీ వెనుకబడిన ఉన్న ప్రాంతం ప్రధానంగా రాయలసీమ మాత్రమేనని అధ్యయనం అనంతరం తేల్చి చెప్పింది! అంటే, మిగతా రెండుప్రాంతాలూ అభివృద్ధిలో సహజమైనతరతమ భేదాలతో 1956కు ముందుకన్నా నిస్సందేహంగా వివిధరంగాలలో ప్రగతిని రిజిస్టర్ చేశాయని స్పష్టం చేసింది! ఈ సందర్భంగా, మూడుప్రాంతాలూ అనుకున్నంత స్థాయిలో మరింత గణనీయమైన అభ్యుదయాన్ని సాధించలేక పోవడానికి కనపడుతున్న అసలు కారణాన్ని శ్రీకృష్ణ కమిటీ చెప్పడానికి జంకింది! దేశ పాలకులు, రాష్ట్ర పాలకులు దేశ "అభివృద్ధి''కి ఎంచుకున్న పెట్టుబడిదారీ-భూస్వామ్య వ్యవస్థలో అసమాభివృద్ధి అనేది ఒక ప్రత్యేక లక్షణం. ప్రపంచబ్యాంకు ప్రజావ్యతిరేక "సంస్కరణల''ను బేషరతుగా ఆమోదించిన ఫలితంగా ప్రభుత్వరంగం ఉనికి ప్రశ్నార్థకమై దేశ, విదేశీ బడా గుత్తవర్గాల ప్రయివేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరచుకోవడంతో ప్రభుత్వానిది 'బ్రోకర్' పాత్రగా మారవలసి వచ్చింది! ఏ 371[డి] అధికరణ ద్వారా పబ్లిక్ సర్వీసులలో ఉపాధి సౌకర్యాలు మూడుప్రాంతాలలోనూ కల్పించి పెంచాలనుకున్నారో అది కాస్తా 'గుంటపూలు' పూయడం ప్రారంభమయింది. ఉపాధి వనరుల బాధ్యతా అనేది ప్రయివేట్ గుత్త కంపెనీల, విదేశీ గుత్త పెట్ట్టుబడి సంస్థలకు బలవంతంగా బదిలీ చేశారు!


 

ఇందుకు అనుగుణంగానే 1991 నాటి ప్రజావ్యతిరేక ఆర్ధిక సంస్కరణలలో భాగంగా అటు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, ఇటు చంద్రబాబు టి.డి.పి. పాలనలోనూ ప్రభుత్వ సర్వీసులలో ఏడాదికి దాదాపు 2 శాతం బొప్పున ఉద్యోగుల ఉద్వాసనకు వేటుపడిందని మరచిపోరాదు! అలా ఉపాధి రంగాన్ని ప్రయివేట్ రంగంలోని బడా తోడేళ్ళ దయాదాక్షిణ్యాలకు వదిలి కూర్చున్నారు. ఉపాధి సమస్యలపైన అన్ని చోట్లా ఆందోళనలకు ఇదే ప్రధాన కారణం సుమా!  అందువల్ల పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గ వ్యవస్థను కనీసం రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రజాతంత్ర సోషలిస్టు వ్యవస్థదిశగా సమూలంగా మార్చుకుంటే తప్ప భారీస్థాయిలో ఉపాధికల్పనకు అవకాశాలుండవు. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు, తమ మనుగడకోసం అవిఆశాపెట్టే "తాయిలాలు'' మారుతుండవచ్చు, కాని అసంఖ్యాకంగా వనరులు చూపించగల తయారీ వస్తూత్పత్తి (మాన్యుఫ్యాక్చరింగ్)రంగం, వ్యవసాయరంగాలను పండపెట్టడం వల్ల గ్రామసీమల్లో ఉపాధి సౌకర్యాలు ఎదగవుగాక ఎదగవు! అందుకే ఈ పరిణామాలను ముందుగానే పసికట్టిన కొలదిమందిలో ఒకరు - ఆంధ్రప్రదేశ్ అవతరణకు అసలు బీజాలు నాటి తెలుగుజాతిని ఒక్క గూడుకిందికి చేర్చిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాటంగ నాయకులలో ఒకరైన దేవులపల్లి వెంకటేశ్వరరావు 1973 మార్చి 4 నాటికే "జాతుల సమస్య''పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంట్ లో యిలా స్పష్టం చేయవలసి వచ్చింది :


 

"తమ స్థానాన్ని బలపర్చుకోడానికి, ఒకే భాషా ప్రాంతాన్ని కూడా విడదీసి చిన్నరాష్ట్రాలు ఏర్పరచడానికి నేటి పాలకవర్గాలు వ్యతిరేకమనే అభిప్రాయం తప్పు! ప్రత్యేక ఆంద్ర, ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక రాయలసీమ నినాదాలను కొన్ని పాలకవర్గ ముఠాలు లేవనెత్తుతున్నారు. ప్రత్యేక రాష్ట్రాల నినాదాన్ని అభివృద్ధి నిరోధక ముఠాలే లేవనెత్తుతున్నారనేది గమనించాలి. ఈ నినాదాలలోని అభివృద్ధి నిరోధక స్వభావాన్ని మిలిటెంట్ శక్తులు బట్టబయలు చేసి, ఆ నినాదా స్వభావం నుంచి తమను తాము విడదీసుకోవాలి. బడా ధనికవర్గం, విదేశీ పెట్టుబడి, భూస్వామ్య వర్గాల పాలనే సమస్యలన్నింటికీ మూలకారణం. స్వయం నిర్ణయ హక్కు అనేది జాతిలో ఒక భాగానికి కాదు. తెలంగాణా ప్రజలు ఆంద్రజాతిలో ఒక భాగమేగాని ప్రత్యేకజాతి కాదు. అందువల్ల స్వయం నిర్ణయ హక్కు వుండేది ఆంద్రజాతి మొత్తానికే గాని మన తెలంగాణా ప్రజలకు కాదు .... దానికితోడు దేశ సమస్యలనుంచి ఆంధ్రప్రదేశ్ సమస్యలను విడదీసి చూడడం అవాస్తవికమవుతుంది. నేడు సమైక్య రాష్ట్రంలోప్రజలను పీడిస్తున్న సమస్యలు అటు ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రజలను పీడిస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ రెండు నినాదాలు కూడా ప్రుజల వకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపవు''
 


అందువల్ల చెప్పొచ్చేమంటే, రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ లో మూడుప్రాంతాలవారి సర్వీసుల భద్రతా కోసం ప్రత్యేకంగా రూపొందించిన 371[డి] అధికరణ అమలులో ఉన్నంత కాలం రాష్ట్రాన్ని విభజించే అధికారం రాజ్యాంగంలోని "3వ అధికరణ'' క్రింద కేంద్రప్రభుత్వానికి ఉండదుగాక ఉండదు! ఎమర్జెన్సీ కాలంలో పౌరుల ప్రాథమిక హక్కుల అధ్యాయాన్ని నిరంకుశంగా కాంగ్రెస్ పాలకులు నిలిపివేసినట్టుగా "371(డి) అధికరణను 'ఢీ'కొనడం ఆ అధికరణకు రాజ్యాంగ సవరణ లేకుండా సాధ్యపడదు! అలాన్గే ఈ అధికరణ కింద కేంద్రం అధికారాన్ని చలాయించగల ఆదేశిక సూత్రాలుగానీ, కార్యనిర్వాహక ఆదేశాలుగానీ లేవు; పార్టీ వర్కింగ్ కమిటీ దొంగచాటుగా చేసిన తీర్మానానికి, అంతే గూడుపుఠాణీతో క్యాబినెట్ వేసిన ముద్రకూ నేరచరితులయిన లెజిస్లేటర్ లు శిక్షార్హులని చారిత్రాత్మక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ఆదేశాన్ని పార్లమెంటులో చర్చించకుండానే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సుకూ తేడాలేదు! స్థిరంగా ఉన్నా భాషాప్రయుక్త రాష్ట్రాలను చీల్చాలన్నా, తద్వారా కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి ముందు ఎంతో కర్మకాండను విధిగా అనుసరించి తీరాలి! 371(డి) అధికరణ ఆసరాగానే ప్రభుత్వ ఉద్యోగులలో మూడుప్రాంతాలలోని ఉద్యోగుల, విద్యార్థుల ప్రయోజనాల ప్రత్యేక రక్షణ కోసమే  రాష్ట్రాన్ని జోనల్ పధ్ధతి ప్రకారం వర్గీకరించడమూ జరిగిందని మరవరాదు! 371(డి) ప్రకారం ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప ఇతర కోర్టులకుగానీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్ళుకుగానీ ఉద్యోగ నియామకాలు, బదిలీలూ, ప్రమోషన్ల విషయాల్లో జోక్యం తగదని తీర్పులు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ కు వర్తించే 371(డి) అధికరణకు మూడింట రెండువంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ వస్తేనేగాని 3వ అధికరణ ప్రకారం రాష్ట్ర విభజన చెల్లదు! ఈ విషయంలో మరొక రాజ్యాంగ నిపుణుడు,సాధికార వ్యాఖ్యాత అయిన పి.ఎం. బక్షీ పేర్కొన్న వివిధ తీర్పులు కూడా ధృవపరిచాయి! వీటిని తెలుసుకోకుండా "విడిపోతేనే వికాసం''అనటం తెలుగువారి అభ్యుదయానికి చేటు! ప్రజలను విడగొట్టడం తేలికేగాని కలపడమే కష్టం సుమా!

గ్లోబంత సంబ‌ురం.. పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామం

రెండు రోజుల పాటు జ‌రిగిన  తెలంగాణ రైజింగ్- గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో  5. 75 ల‌క్ష‌ల కోట్ల మేర పెట్టుబ‌డుల‌కు ఎంఓయూలు కుదిరాయి. ఈ కార్య‌క్ర‌మానికి దేశ విదేశాల నుంచి పలువురు వ్యాపార‌, రాజ‌కీయ‌, సినీ, కార్పొరేట్, ఆర్ధిక రంగ అతిర‌థ మ‌హార‌థులు ఏతెంచ‌గా.. అంగ‌రంగ వైభ‌వంగా  న‌భూతో ..   అన్న స్థాయిలో జ‌రిగిందీ గ్లోబల్ సంబురం.   ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో  కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌  రెండో విజ‌య‌వంత‌మైన  ఏడాది  ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక  గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది.  తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది. ఇది రాజ‌కీయాల‌కు అతీతంగా కేవ‌లం అభివృద్ధీకి మాత్ర‌మే పెద్ద పీట వేయడంతో ప్ర‌పంచ వ్యాప్తంగా   ఫోక‌స్ అంతా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వైపు చూసింది.  అధికారిక కార్య‌క్ర‌మాల్లోనూ రాజ‌కీయ ఆరోప‌ణ‌లు వినీవినీ విసిగి వేసారిన జ‌నాన్ని ఫ‌క్తు ప్రొఫెష‌న‌ల్ గా సాగిన ఈ స‌మ్మిట్ విపరీతంగా ఆకర్షించింది. రాజ‌కీయాల‌కు అతీతంగా సినీ, క్రీడా, వ్యాపార, ఆర్ధిక రంగ ప్ర‌ముఖుల‌తో కూడిన‌ మేథో మ‌థ‌నం జ‌ర‌గ‌డంతో తెలంగాణ భ‌విష్య‌త్ బంగారమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ప్ర‌పంచంలోనే భార‌త్ యువ‌ర‌క్తంతో కూడున్న దేశ‌మైతే.. అందులో తెలంగాణ మ‌రింత యువ రాష్ట్ర‌మ‌ంటూ  శంత‌ను నారాయ‌ణ్ వంటి ప్ర‌ముఖ  కార్పొరేట్ దిగ్గ‌జాలు పేర్కొన్నారు. ఇక 2047 నాటికి  తెలంగాణ మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్ధిక శ‌క్తిగా ఎద‌గాల‌న్న ల‌క్ష్యం  అతిశ‌యం ఏమీ కాద‌నీ,  ఈ విష‌యంలో తెలంగాణ ఇత‌ర రాష్ట్రాల‌తో పోటీ ప‌డ్డం చాలా గొప్ప విషయమనీ ప్ర‌ముఖ ఆర్ధిక  వేత్త‌ అర్వింద్ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ అన్నారు. కేవ‌లం  రాష్ట్రాలే  కాదు న‌గ‌రాల మ‌ధ్య కూడా పోటీ ఉండాల‌నీ, ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో బెంగ‌ళూరు అర్బన్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే,  హైద‌రాబాద్ ఫ్యూచ‌ర్ సిటీ  వంటి  విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌పంచ దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తోంద‌న్నారాయన. తెలంగాణ   గొప్ప‌గా ట్రాన్స్ ఫార్మింగ్ జ‌రుగుతోందనీ, ఇటీవలి కాలంలో  విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోందన్నారు ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు. ఇక మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ ఎద‌గ‌డానికి మూడంచ‌ల వ్యూహం అనుస‌రిస్తున్న‌ట్టు త‌న  విజ‌న్ డాక్యుమెంట్ లో  ఆవిష్క‌రించింది రేవంత్ సర్కార్.  అందులో భాగంగా భావిత‌రాల కోసం తెలంగాణ‌ను తీర్చిదిద్ద‌డంతో పాటు, ఆర్ధిక స‌మ్మిళిత‌, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర వార‌స‌త్వ‌, సాంస్కృతిక క‌ళా వైభ‌వాల‌కు పెద్ద పీట వేసేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు.  5 వేల కోట్ల‌తో సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల రంగంలో తాము పెట్టుబడులు పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు యూపీసీ సీఈవో అలోక్ కుమార్. 1100 కోట్ల‌తో వింటేజ్ కాఫీ ప్లాంట్ తెలంగాణ‌లో ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారుఆ సంస్థ ఎండీ బాల‌కృఫ్ణ‌న్.  ఇక మహీంద్రా అండ్ మహీంద్రా  చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర  అయితే స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కాలేజీకి త‌న‌ను బాధ్య‌త వ‌హించ‌మ‌ని  కోర‌డంతో కాద‌న‌లేక పోయాన‌ని, అందుకు కార‌ణం సీఎం రేవంత్ విజన్, సునిశిత ఆలోచ‌నా స‌ర‌ళి, ఆపై పేద‌రిక నిర్మూల‌న‌పై ఆయ‌న‌కున్న నిబ‌ద్ధ‌త అంటూ పొగడ్తలు గుప్పించారు. తెలంగాణ నిజంగానే ఒక రోల్ మోడ‌ల్ అన్నారు బ్రిట‌న్ మాజీ  ప్ర‌ధాని  టోనీ బ్లేయ‌ర్.  మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యం సాధ్య‌మేన‌ని ప్ర‌పంచ‌మంతా చెప్పింద‌ని ప్ర‌క‌టించారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రామ‌కృష్ణారావు. ఈ ఫ్యూచ‌ర్ సిటీ  కోసం  2027 వ‌ర‌కూ ఎదురు చూడ‌క్క‌ర్లేదు.. అంత‌క‌న్నా ముందే సాకార‌మ‌వుతుంద‌న్నారు ప్రముఖ  నిర్మాత అల్లు అర‌వింద్. ఇక ఇదే ఫ్యూచ‌ర్ సిటీ ద్వారా  ఏకంగా 13 ల‌క్ష‌ల ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు రానున్న‌ట్టు తెలుస్తోంది. 13, 500 ఎక‌రాల్లో నిర్మిత‌మ‌య్యే ఈ న‌గ‌రం ఒక ఆర్కిటెక్ అద్బుతం కానుంద‌ని, ఏకంగా 9 ల‌క్ష‌ల మందికి ఆవాస యోగ్యం కానుంద‌ని ప్ర‌క‌టించారు స‌మ్మిట్ నిర్వాహ‌కులు. మూసీ పున‌రుజ్జీవం ప్రాజెక్టు పూర్తైతే.. ప్ర‌పంచ‌మే హైద‌రాబాద్ కి త‌ర‌లి వ‌స్తుంద‌ని అన్నారు వాట‌ర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్ర సింగ్.   ప‌ర్యాట‌కంగా మాత్ర‌మే  కాకుండా సినిమా ప‌రంగా కూడా తెలంగాణ‌ను అద్భుతంగా తీర్చిదిద్దే  బాధ్య‌త‌ల‌ను తీసుకుంటున్న‌ట్టు ఈ స‌ద‌స్సు ద్వారా  ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ప్ర‌స్తుతం తెలుగు వారికి ఉన్న స్టూడియోలే కాక స‌ల్మాన్, అజ‌య్ దేవ‌గ‌న్ వంటి బాలీవుడ్ తార‌లు సైతం ఇక్క‌డ స్టూడియోలు పెట్ట‌డానికి ముందుకొచ్చారు. భార‌త‌దేశంలోనే స‌మ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉన్న హైద‌రాబాద్ దేశంలోని అన్ని సినిమా రంగాల వారికి భూత‌ల స్వ‌ర్గంతో స‌మానం కావ‌డంతో  అందరినీ ఇక్క‌డికి ఆక‌ర్షించి వ‌ర‌ల్డ్ మూవీ హ‌బ్ గానూ తీర్చిదిద్దేందుకు త‌మ వంతు య‌త్నం  చేస్తామ‌ని ప్రకటించింది ప్ర‌భుత్వం. ఐటీ విప్ల‌వానికి తెలంగాణ పుట్టినిల్లు లాంటిద‌ని, స్టార్ట‌ప్ హ‌బ్ గానూ హైద‌రాబాద్ కు ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లున్నాయ‌నీ ప్ర‌శంసించారు ప‌లువురు ఆర్ధిక నిపుణులు. ఇక దువ్వూరి అయితే తెలంగాణ అన్ బీట‌బుల్ గ్రోత్ సాధిస్తోంన్నారు. ఏటా 6-9 శాతం స్థిర‌మైన వృద్ధి రేటు సాధిస్తోందని గుర్తు చేశారు.  మొత్తంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి  రెండో ఏడాది దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్న  శుభ సంద‌ర్భంలో  5 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు వ‌చ్చేలా  ఎంఓయూలు జ‌ర‌గ‌డం ఏమంత సాధార‌ణ విష‌యం కాదు. అయితే ఈ ఎంఓయూల‌ను పెట్టుబ‌డులుగా మ‌ల‌చ‌డంలో ప్ర‌భుత్వం త‌గిన బాధ్య‌త తీసుకోవ‌ల్సిన అవ‌స‌ర‌ముంది. ఆ మాట‌కొస్తే ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను నిర్వ‌హిస్తున్న దుద్దిళ్ల  శ్రీధ‌ర్ బాబు ఇందుకోసం ప్ర‌త్యేక రూట్ మ్యాప్ ని త‌యారు చేయాల్సి ఉంది. ఒక స్పెష‌ల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా ఒప్పందం కుదుర్చుకున్న  సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా ఇవ్వాల్సిన రాయితీలు, ఇత‌ర‌త్రా సౌల‌భ్యాల‌ను వారికి అందేలా  సింగిల్ విండో ఏర్పాటు చేయాల్సి ఉంది.   వ‌చ్చాం- ఒప్పందాలు చేసేశాం- వెళ్లామ‌ని కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలో అప్ ల‌తో ఈ పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌లో గ్రౌండ్ అయ్యేలా చేడాల్సి ఉంది.  అలా జరిగితే..  ఫ్యూచ‌ర్ సిటీ ద్వారా 13 ల‌క్ష‌లేం ఖ‌ర్మ అంత‌క‌న్నా మించి  ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు తెలంగాణ‌ను వెతుక్కుంటూ రావ‌డం  ఖాయం అంటున్నారు పరిశీలకులు. ఎనీ హౌ ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్. ఇలాగే మ‌రిన్ని వ‌సంతాలు మ‌రిన్ని  స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ‌తో ల‌క్ష‌ల  కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేలా  ఎద‌గాల‌ని.. కోరుకుందాం. సీఎం రేవంత్ క‌ల‌లు గ‌న్నట్లుగా దావోస్ త‌ర‌హాలో ప్ర‌పంచ పెట్టుబ‌డులను ఆక‌ర్షించే వేదిక‌గా ఫ్యూచ‌ర్ సిటీ రూపుదిద్దుకోవాల‌ని ఆశిద్దాం.  మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్యానాదెళ్ల సైతం హైద‌రాబాద్ కేంద్రంగా ఏఐ ఇన్వెస్ట్ మెంట్ చేస్తామన్నారు. సుమారు ల‌క్ష‌న్న‌ర కోట్ల  పెట్ట‌బడులు భార‌త్ లో పెట్ట‌నుండ‌గా వీటిలో అత్య‌ధిక శాతం హైద‌రాబాద్ లోనే అని సంకేతాలిచ్చారు. 

జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా?

కేంద్ర మంత్రత్వ శాఖలన్నిటిలోనూ అత్యంత రిస్కీ శాఖ అంటూ ఏదైనా ఉందంటే అది పౌర విమానయాన శాఖ మాత్రమే. ఇటీవలి కాలంలో ఈ శాఖను కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కార్ తెలుగువారికే అప్పగిస్తోంది. అది కూడా భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం కే ఈ శాఖ కేటాయిస్తోంది. గతంలో అంటే 2014-19లో ఎన్డీయే కూటమి తన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఎంపీ అయిన అశోక గజపతి రాజుకు ఈ శాఖ కట్టబెట్టింది. ఇప్పుడు 2024లో మళ్లీ ఈ శాఖను తెలుగుదేశం యువ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడికి అప్పగించింది. వాస్తవానికి పౌర విమానయాన శాఖ అత్యంత క్లిష్టమైనది, అత్యంత కీలకమైనదీ కూడా.  ప్ర‌మాదాలు, వివాదాలు సాంకేతిక లోపాలు వంటివి విమనాయానాల్లో సహజం.  దేశంలో ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా, సాంకేతిక లోపంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తి సర్వీసు రద్దైనా పౌర విమానయాన శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.     ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.  విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. శాఖాపరమైన పనులు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా జరిగేలా చూస్తున్నారు. అందరూ ఆయన పని తీరును భేష్ అంటూ ప్రశంసిస్తున్నారు.  అదలా ఉంటే.. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమానాలలో సాంకేతిక లోపాల వంటి కారణాలు పౌరవిమానయాన శాఖకు తలనొప్పిగా పరిణమించాయి.  తాజాగా ఇండిగో వ్య‌వ‌హారం మరొ పెద్ద సమస్యగా పరిణమించింది. డీజీసీఏ నిబంధ‌న‌లు పైలట్లకు విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తే.. అవి కాస్తా ఆ శాఖా మంత్రి అయిన రామ్మోహ‌న్ నాయుడుకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెండ్ చయడం కోసం జాతీయ మీడియా పౌర విమానయాన సంస్థ మంత్రిని స్కేప్ గోట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నది.  జాతీయ మీడియా ఉద్దేశ పూర్వకంగా దక్షిణాది మంత్రులపై దాడి చేస్తున్నదా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు విశ్లేషకులు. ఇండిగో సంస్థ ప్రణాళికా లోపం, నిర్వహణ వైఫల్యం కారణంగా ఆ సంస్థకు చెందిన విమాన సర్వీసులు పెద్ద సంఖ్యలో రద్దై ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ఇందుకు బాధ్యత వహించాల్సింది పూర్తిగా ఇండిగో సంస్థ. ఇప్పటికే ఆ సంస్థపై చర్యలకు మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉపక్రమించారు. సుప్రీం కోర్టు కూడా కేంద్రం తీసుకుంటున్న చర్యలను సమర్థించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయినా జాతీయ మీడియా మాత్రం ఇండిగో సంక్షోభాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి వైఫల్యంగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తున్నది.  ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే జాతీయ మీడియావాటికి ఆ శాఖ మంత్రిని బాధ్యుడిని చేస్తూ కథనాలు వండి వార్చలేదు. ఇప్పుడు ఇండిగో వ్యవహారంలో మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత వహించాలంటూ గగ్గోలు పెడుతోంది. అంటే జాతీయ మీడియా ఉత్తరాది, దక్షిణాది వివక్ష చూపుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

కేసీఆర్ భోజనాలు.. జగన్ గాలి తిరుగుళ్లు.. ప్రజాధనం దుబారాలో ఇద్దరూ ఇద్దరే!

ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే. ముందుగా తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయానికి వస్తే.. ఆయన అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో అంటే 2014 నుంచి 2023 వరకూ  ప్రగతి భవన్ లో భోజనాలు, తినుబండారాల కోసం చేసిన ఖర్చు వెయ్యి కోట్లు. ఔను అక్షరాలా వెయ్యి కోట్లు. ఇది ఏదో కాకిలెక్క కాదు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ లో నిత్య సంతర్పణ అన్నట్లుగా ఉండేది పరిస్థితి అని దీని ద్వారా తెలుస్తోంది. నిత్యం మటన్, చికెన్, కౌజు పిట్టలు, కుందేలు మాంసం కూరలతో పాటు కోడి గుడ్లతో వైరైటీ వంటలతో విందులు చేసుకున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక  విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న ఖరీదైన స్కాచ్ విస్కీ బాటిళ్లు కూడా ఇందులోకే వస్తాయి. విషయానికి వస్తే ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నిత్యం దాదాపు 50 మంది నిత్యం ఈ విందు భోజనాలకు హాజరయ్యేవారట. పెట్టేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లు ఇక్కడ వంట, వడ్డన సాగేదట.   ఏ ఫైవ్ స్టార్ హోట‌ల్ కీ తీసి పోని విధంగా ఇక్క‌డి  వంట‌లు ఎంతో రుచిక‌రంగా ఉండేవ‌ట‌.కేసీఆర్ తనతో ఉన్న అందరికీ ప్రతి రోజూ, ప్రతిపూటా రకరకాల నాన్ వెజ్ లతో ఇచ్చే ఈ విందు పెళ్లి దావత్ ను మించి ఉండేదంట. అంటే జనం సొమ్ముతో కేసీఆర్ తన, తన కుటుంబ సభ్యుల జిహ్వచాపల్యాన్ని తీర్చడమే కాకుండా, తనతో ఉన్న వారికీ విందు భోజనాలు పెట్టేవారన్న మాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమేంటంటే.. ఈ గ్రాండ్ విందు భోజనం కొందరికే.. ఇక సీఎం భద్రతా సింబ్బంది, పనివాళ్లకు మాత్రం శాఖాహార వంటలే వడ్డించేవారట. ఇది కూడా పెద్ద సారు ఆర్డర్ ప్రకారమేజరిగేదంట.  కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు బంధువులందరికి ప్రతిరోజు మాంసాహారం వంటలు తప్పనిసరి అన్న  ఆదేశాలుండేవ‌ట‌. కేవలం భోజనాల కోసమే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించారంటున్నారు పరిశీలకులు. మరో విషయం ఇప్పుడు చెప్పిన వెయ్యి కోట్ల లెక్క కేవలం ప్రగతి భవన్ విందు భోజనాలకిసంబంధించినది మాత్రమే. ఇది కాకుండా   ఎర్రవల్లి ఫాంహౌజ్ లెక్కలు ఇంకా బయటకు రావాల్సి ఉందని అంటున్నారు. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో కేవలం ప్రయాణాలకే 222.85 కోట్ల ప్రజాధనం వెచ్చించారని ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. జ‌గ‌న్హయాంలో  విమాన ప్రయాణాల కోసం పెట్టిన ఖర్చు సైతం చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్- ఏపీఏసీఎల్  ద్వారా ఏకంగా రూ.222.85 కోట్లు వెచ్చించారని తాజాగా వెల్లడైన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ ఈ వ్యయం తగ్గకపోవడం గమనార్హం.జగన్ విమానయానం ఖర్చులు 2019-20- రూ.31.43 కోట్లుకాగా.. 2020-21- రూ.44 కోట్లు, 2021-22- రూ.49.45 కోట్లు, 2022-23- రూ.47.18 కోట్లు, 2023-24- రూ.50.81 కోట్లుగా చెబుతున్నాయి లెక్క‌లు. ఈ ఐదేళ్లలో జగన్ విమానాల చార్జీలు రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ చార్జీలకు రూ.87.02 కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద రూ.23.31 కోట్లు చెల్లించిన‌ట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ చార్జీల మొత్తాన్ని జీఎంఆర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించినట్లు వెల్ల‌డిస్తున్నాయి రికార్డులు. జ‌గ‌న్ ఐదేళ్ల కాలంలో గాలి మోటారు ఖ‌ర్చుల‌ను ఏకంగా 220 కోట్ల మేర పెట్ట‌గా ఈ ప‌ద్దెనిమిది  నెల‌ల కాలంలో లోకేష్ పెట్టిన ఖ‌ర్చు జీరో అంటూ తెలుగుదేశం  సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.   అంతే కాదు.. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా మంత్రి నారా లోకేష్ 77 సార్లు హైద‌రాబాద్ ప్ర‌యా ణించ‌గా.. ఆ విమాన ఖ‌ర్చులు పూర్తి సొంతంగానే పెట్టార‌ని ప్ర‌భుత్వ ఖ‌జానాపై ఎలాంటి భారం ప‌డ‌లే ద‌ని తేలింది.ఇటు తెలంగాణ‌లో కేసీఆర్, అటు ఏపీలో జ‌గ‌న్ ఇరువురూ వారి వారి హ‌యాంలో ప్ర‌జ‌ల సొమ్ము ఎంత‌గా వృధా ఖ‌ర్చు రూపంలో వెచ్చిస్తున్నారో ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మేనంటున్నారు ఆర్టీఐ కార్య‌క‌ర్త‌లు. కేసీఆర్, జగన్ లు ప్రజాధనాన్ని దుబారా చేసిన తీరు చూస్తుంటే, తన సొమ్ము సోమవారం ముప్పొద్దుల తింటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అంటూ ఏదో సినిమాలో ఆరుద్ర రాసిన పాటలో పంక్తులు గుర్తుకు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. 

చెక్కు చెదరని స్నేహ బంధం!

పదవిలో ఉన్నవాళ్లు, మరీ ముఖ్యంగా దేశాధిపతులు ఏదైనా చేయగలరన డానికి తాజా ఉదాహరణ శుక్రవారం (డిసెంబర్ 5) భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన. సాక్షాత్తు రష్యా అధినేత బయలుదేరాడంటే "రాజు వెడలె,రవితేజములరరగా" అన్నట్లు వందిమాగధులు, రక్షకసముదాయం బయలుదేరుతారు ఆయన రక్షణకు ఐదంచల వ్యవస్థ ఉంటుంది.ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది  తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు. ఆయన పండ్ల రసాలు,మాంసాహారం తీసుకుంటారు. భద్రతకు సంబంధించి ఇంతటి జాగ్రత్తలు అగ్రరాజ్యాధినేత తరువాత రష్యా అధ్యక్షుడి విషయంలోనే ఉంటాయి.   రష్యా నుంచి భారత్  చమురు  కొనుగోలు చేస్తున్నందున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  .భారత్ వచ్చిన పుతిన్ భారత్,రష్యా మధ్య చమురు ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలగదని హామీ ఇచ్చారు.అలాగే మరో ఐదేళ్లపాటు అమలులో ఉండే ఆర్ధిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా 11 ఒప్పందాలు జరిగాయి.  అలాగే రష్యా,భారత్ ఒప్పందాలపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ఏకధృవ ప్రపంచంలో భారత్, రష్యా,చైనాల మైత్రి నిస్పందేహంగా అమెరికాకు కంటగింపే. .భారత్, చైనా,రష్యా ఒకటిగా ఉంటే అమెరికా జీరో అంటూ ఇప్పటికే చైనా వ్యాఖ్యానించింది కూడా.  .గతంలో కూడా ఈ మూడు దేశాలు ఇదే మాట ట్రంప్ కు పరోక్షంగా ఎరుకపరిచిన విషయం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి.  1992 లో సోవియట్ యూనియన్ పతనం అయ్యేవరకూ అమెరికాకు దీటుగా అన్ని విషయాల్లో రష్యా పోటీగా ఉండేది.  ప్రచ్ఛన్న యుద్ద కాలంలో  భారత్, రష్యాల మధ్య సహకారం తెలిసిందే.  సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత కూడా భారత్, రష్యాల మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.  ప్రధానంగా యుద్ధ పరికరాల సరఫరా  విషయంలో ఇరు దేశాల మధ్యా బంధం చెక్కు చెదరలేదు. . ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పీచమణచడంలో రష్యా ఆయుధాలు కీలక పాత్రపోషించాయి. రష్యా అధినేతగా  వాద్లిమిర్ పుతిన్ పాతికేళ్లకు పైగా అప్రతిహతంగా కొనసా గుతున్నారు. సోవియట్ పతనం తదననంతరం..  ప్రపంచ దేశాలలో రష్యా ప్రాధాన్యత, ప్రాముఖ్యతను  కొనసాగించడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు.   అన్ని రంగాల్లో అమెరికాకు దీటుగా రష్యాను నిలపడంలో కీలకంగా వ్యవహరించారు. దౌత్య వ్యవహారాలలో కూడా   కీలకంగా వ్యవహరిస్తున్నారు.  భారత్ కు చిరకాల,సాంప్రదాయ మిత్రుడు గా దాదాపు ఏడు దశాబ్దాలుగా రష్యా ఉంది.  పుతిన్,మోదీ భేటీ ఇదే తొలిసారి కాదు.   వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న   మోదీ అప్పట్లో పుతిన్ తో భేటీ అయ్యారు.అప్పటి నుంచి వారి మైత్రి కొనసాగుతునే ఉంది.  భారత్, రష్యాల స్నేహ బంధం కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. 

మోడీ దౌత్య రీతి.. ట్రంప్ ఉక్కిరి బిక్కిరి!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన నిస్సందేహంగా మోడీ దౌత్య విజయంలో ఒకటిగా చెప్పవచ్చు. రష్యా అధ్యక్షుడి భారత పర్యటన అనగానే ఉక్రోషంతోనో, ఆందోళన వల్లో తెలియదు కానీ.. అమెరికా అధ్యక్షుడు కంగారు పడుతున్నారు.  పుతిన్ భారత పర్యటన ఈ సమయంలో అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  రష్యా నుంచి భారత్‌  తన అభీష్ఠానికీ, ఆదేశాలకూ విరుద్ధంగా చమురు దిగుమతి చేసుకుంటున్నదన్న ఒకే ఒక్క కారణంతో ట్రంప్ భారత్ పై టాక్స్ వార్.. సుంకాల యుద్ధానికి దిగారు. అయితే అది బూమరాంగ్ అయ్యింది.   భారతీయులను అమెరికాకు రాకుండా చేసేందుకు వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కంపెనీలను ఆదేశించారు. వీసా ఫీజును భారీగా పెంచారు. ఇవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా.. అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు పెట్టేలా మారాయి. రష్యా, చైనాలతో భారత దోస్తీ గట్టిపడింది.     పుతిన్‌ భారత పర్యటనలో భాగంగా  కుదిరే అవకాశం ఉన్న ఒప్పందాల కారణంగా అమెరికా మరిన్ని ఆర్థిక చిక్కుల్లో పడే అవాకశం ఉంది.   ట్రంప్‌ రష్యా చమురు దిగుమతిని ఆపమని భారత్ ను ఆదేశిస్తే.. అది కొనసాగిస్తూనే ఇప్పుడు తాజాగా రష్యాతో  ఆయుధ కొనుగోళ్లఒప్పందానికి రెడీ అయ్యింది.   ఇది కచ్చితంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడంగానే భావించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా మళ్లీ సుంకాలతో, విసాలపై మరిన్ని కఠిన ఆంక్షలతో ట్రంప్ విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే వాటిని లెక్కచేయడానికీ, అమెరికా హెచ్చరికలు, ఆంక్షలకుభయపడే పరిస్థితి నుంచి భారత్ ఎప్పుడో బయటపడింది. ఇదంతా మోడీ దౌత్య  విధానాల కారణంగానే సాధ్యమైందన్నది అంతర్జాతీయ సమాజం చెబుతున్నమాట.  మొత్తంగా ట్రంప్ అరాచక, అహేతుక విధానాలనుంచి భారత్ ను బయటపడేయడమే కాకుండా.. ఏక ధృవ ప్రపంచం అన్న భ్రాంతి నుంచి ట్రంప్ బయటపడక తప్పని పరిస్థితిని క్రియోట్ చేసే దిశగా ప్రధాని మోడీ దౌత్యపరంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దేవతలారా దీవించండి!

ఈ మధ్య కాలంలో   దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో   చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.  బేసిగ్గా రేవంత్ రెడ్డికి ఆంజనేయస్వామివారంటే చాలాచాలా భక్తి. ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఒక పురాతన ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పూజ చేసి మరీ తన నామినేషన్  వేయడం ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, ఆచారం.  ఇప్పటికీ ఆ సెంటిమెంటు కొనసాగుతూనే ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి పొరబాటున వివిధ విభాగాల అధిదేవతలైన హిందూ దేవతలకూ, కాంగ్రెస్ లోని మల్టిపుల్ లీడర్షిప్ కి  పోలిక తెస్తూ వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మచారులకు, పెళ్లయిన వారికి, ఇద్దరు భార్యలు కలవారికీ.. ఇలా హిందూ సంప్రదాయంలో  దేవుళ్లు ఉన్నారని రేవంత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి. ముఖ్యంగా హిందూ వాదులు బీజేపీ లీడర్లు రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు.   ఇలా ఈ ఒక్క అంశం మాత్రమే కాదు పలు అంశాల్లో  కాషాయవాదులు, కమలనాథులు  పెద్ద ఎత్తున తీవ్ర నిరసనలు, అభ్యంతరాలు తెలియ చేస్తున్నారు. ఇంతకు ముందు శివజ్యోతి అనే  యాంకర్ వెంకన్న సన్నిథిలో తాము రిచ్చెస్ట్ బిచ్చగాళ్లమంటూ చేసిన వ్యాఖ్యలతో భారీ స్థాయిలో ట్రోలింగ్ కి గురయ్యారామె. ఇక ఒక స్వామి మాల వేసిన ఎస్సై వివాదం సంగతి సరే సరి. ఈ విషయంపై బీజేవైఎం నాయకులు ఏకంగా డీజీపీ ఆఫీసునే ముట్టడించి నానా యాగీ చేశారు. డిపార్టుమెంటుగానీ ఆయనకిచ్చిన మెమో వెనక్కు తీస్కోకుంటే మా తడాఖా చూస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు.  అలాగే దర్శక ధీరుడు రాజమౌళి  తనకు దేవుడిపై నమ్మకాలు లేవని అనడం కూడా పెద్ద రాద్ధాంతమై  కూర్చుకుంది. మాధవీ లత, చికోటి ప్రవీణ్ తో సహా అందరూ రాజమౌళిపై విరుచుకుపడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాజమౌళిపై విరుచుకు పడ్డ వారి లిస్టు కొండవీటి చాంతాడంత. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ దేవీ దేవతలకు మరీ ఇంత సెక్యూరిటీయా? ఈగ వాలనీయడం లేదెవరూ? అనిపించకమానదు. సీఎం రేవంత్  హిందూ. గతంలో ఆయన ఏబీవీపీ కార్యకర్త. ఆర్ఎస్ఎస్ భావజాలం తెలియని వారు కాదు. అలాంటి రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండి సీఎం అయ్యారని చెప్పి ఆయనేమీ హిందూ కాకుండా పోరు. ఒక ఇన్ స్పిరేషన్ కోసం పోలిక తెచ్చి జనానికి అవగాహన పెంచడానికి అన్నమాటలను పట్టుకుని దానిని వివాదాస్పదం చేయడం ఎంత వరకూ సమంజసం అని పరిశీలకులు అంటున్నారు.  అదే విధంగా దేవుడిపై నమ్మకం ఉండటం, ఉండకపోవడం అన్నది ఎవరికి వారికి వ్యక్తిగత విషయం. దూషణ లేనంత వరకూ అటువంటి విషయాలను వివాదం చేయడం తగదంటున్నారు. ఇలా వివాదాలు సృష్టిస్తున్నవారు హేతు వాదాన్ని, హేతువాదులనూ బతకనిచ్చేలా లేరన్న మాట కూడా వినిపిస్తుంది. తెలుగువారు గర్వించదగ్గ నటులలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు పలు సందర్భాలలో తనకు దేవుడిపై భక్తి లేదని ప్రకటించారు. అటువంటి ఆయన అద్భుతమైన భక్తిరస చిత్రాలలో అత్యద్భుతంగా నటించి మెప్పించారు. అందుకే రేవంత్ కానీ, రాజమౌళి కానీ చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయడం సమజసం కాదంటున్నారు పరిశీలకులు. 

పవన్ పై కాంగ్రెస్ విమర్శల దాడి.. ఏ ప్రయోజనం కోసం?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇందుకు కారణం కోనసీమలో కొబ్బరి దిగుబడి తగ్గిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందనే అర్ధం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనం సీరియస్ గా తీసుకోలేదు. మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది. ఆ విమర్శల తీవ్రత గత రెండు రోజులుగా పెచ్చరిల్లింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పవన్ సినిమాలను తెలంగాణ థియోటర్లలో ఆడనివ్వం అంటూ తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు పరిశీలకులు వ్యక్తం చేస్తున్న సందేహాలు ఏమిటంటే.. కాంగ్రెస్ ఇప్పుడు, ఈ సమయంలో ఈ స్థాయి విమర్శలకు దిగడం పూర్తిగా నిరర్ధకం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకూ పవన్ కల్యాణ్ కానీ, ఆయన జనసేన పార్టీ కానీ పూర్తిగా ఇర్రెలవెంట్. అయితే ఈ విమర్శల వల్ల తెలంగాణలో ఏమైనా జరగడమంటూ జరిగితే.. అది తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి రావడమే. అలా తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి వస్తే కాంగ్రెస్ కు రాజకీయంగా ఇసుమంతైనా ఉపయోగం ఉండదు. ఆ సెంటిమెంట్  వల్ల ప్రయోజనం అంటూ ఉంటే.. అది బీఆర్ఎస్ కు మాత్రమే. అంటే కాంగ్రెస్ నేతలు, మంత్రులు పవన్ కల్యాణ్ లక్ష్యంగా చేస్తున్న విమర్శల వల్ల బీఆర్ఎస్ మాత్రమే లబ్ధిపొందుతుంది. ఆ పని కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నదంటూ రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం  వ్యక్తం చేస్తున్నారు.  అన్నిటికీ మించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లబోతోంది. అలాగే తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఓ వైపు ఇంత సందడి, హడావుడీ పెట్టుకుని కూడా కాంగ్రెస్ నేతలూ, మంత్రులూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిచడం, ఆయనపై విమర్శలు గుప్పించడం వినా తమకు వేరే పనేంలేదనేలా చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కాంగ్రెస్ పొలిటికల్ స్టాండర్డ్స్ పై అనుమానాలు వ్యక్తం అయ్యేందుకు దోహదపడుతున్నాయి.   మీడియా పెద్దగా పట్టిచుకోవడం మానేసిన నేతలు, మంత్రులే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారనీ, కనీసం ఆ రకంగానైనా మీడియా దృష్టిలో పడి ఎంతో కొంత పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసెంబ్లీకి డుమ్మా.. పార్లమెంటుకు హాజరు.. జగన్ ద్వంద్వ నీతి

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. కాదు కాదు దిశా నిర్దేశం చేశారు. దీంతో రాష్ట్ర సమస్యలపై గళమెత్తడానికి బోలెడంత అవకాశం ఉన్న అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టి పార్లమెంటులో ఎంపీలను నోరెత్తి ప్రశ్నించాలని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ ప్రారంభమైంది. కేవలం తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఉన్న అవకాశాలను తోసిపుచ్చి, తానే కాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేల చేత సైతం శాసనసభను భహిష్కరింప చేస్తున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలంటూ ఎలా చెప్పగలరని పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ పోషిస్తున్న పాత్ర గురించి ఆ పార్టీ నేతలకు సైతం ఎలాంటి క్లారిటీ లేదని భావించాల్సి వస్తున్నదని విశ్లేషిస్తున్నారు.   2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు,   కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.   ప్రజలివ్వని హోదా కోసం మంకు పట్టు పడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత జగన్ తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు.   తమకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా అసెంబ్లీని బాయ్ కాట్ చేశామని చెబుతున్న వైసీపీ అధినేత జగన్..   ప్రజా సమస్యల పై గళమెత్తడానికి అసెంబ్లీకే వెళ్లాలా? అన్న వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ప్రెస్ మీట్లలోనే ప్రభుత్వ విధానాలను ఎండగడతానంటున్నారు.  మరి ఇప్పుడు  పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్ర హక్కులు, సమస్యలపై గళమెత్తాలని  ఎంపీలను ఎలా ఆదేశిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర, హక్కులు, సమస్యలపై గళమెత్తడానికి అసెంబ్లీ కంటే, పార్లమెంటు ఎలా మెరుగైన వేదిక అవుతుందో జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడాన్ని ఇక్కడ ఎవరూ తప్పుపట్టరు కానీ, ఆయన అసెంబ్లీ ని బాయ్ కాట్ చేయడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే జగన్ కు ఆయన పార్టీకీ రాష్ట్ర సమస్యలు పట్టవా? అని నిలదీస్తున్నారు. పొలిటికల్ గా ఆయన అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను దుయ్యబడుతున్నారు. గత ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా, తమకు 40శాతం ఓట్లు వచ్చాయంటున్న జగన్.. మరి వైసీపీకి ఓటు వేసిన 40శాతం మంది ప్రజల కోసమైనా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ విధానాలను నిలదీయాల్సి ఉంది కదా? ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా పోరాడాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ ఏం జవాబు చెబుతారో చూడాల్సింది. 

‘వేలం’ వెర్రి తలలు!?

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లను ఎన్నిక‌ల ప్ర‌చార ఖ‌ర్చుకు తీస్కెళ్లిన అభ్య‌ర్ధి ఇర‌వై వేల రూపాయ‌ల‌ను ఇంటికి తెచ్చారంటే నమ్మశక్యంగా లేదు కదూ!  కానీ అది నిజం. లాలాగే..   ఓ అభ్య‌ర్ధి    ఎన్నార్సీ కేసుల‌పైన పోరాటం చేసి జైలుకు వెడితే.. ఆయ‌న త‌రఫున ఆయన భార్య‌, త‌ల్లి ఎలాంటి  ఖ‌ర్చు లేకుండా  ప్ర‌చారం  చేశారు. ఆ ఎన్నికలో ఆయన విజయం సాధించారు.   ఇక ఇటీవల ఇటీవల బీహార్ ఎన్నిక‌ల్లో అలీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం  నుంచి గాయిని మైథిలీ ఠాగూర్ విజయం  కూడా దాదాపు ఇలాంటిదే.   ఉత్త‌రాదిలో ఎన్నిక‌లంటే ఎమంత ఆస‌క్తిక‌రం కాదు. ఆపై అదేమంత కాస్ట్లీ  ఇష్యూ కూడా కాదు. ఖ‌ర్చు అస‌లే  ఉండ‌ద‌ని అంటాయి అక్కడి వారు.  అయితే దక్షిణాదిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి పరిస్థితులు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి  కూడా భారీ ఎత్తున  ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక  పంచయతీలో  స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.  ఔను  మహబూబ్​నగర్​ జిల్లా, హన్వాడ మండలం, టంకర గ్రామంలో సర్పంచి పదవి కోసం  కోటి వెచ్చిస్తానని ఒక వ్యక్తి ప్రకటించినట్లు ప్రచారం జరిగింది.  కోటి రూపాయ‌ల‌కు స‌ర్పంచ్ ప‌ద‌వి అంటూ సోష‌ల్ మీడియాలో ఈ ఊరి  పేరు తెగ  మార్మోగిపోయింది.  అయితే వాస్తవమేంటంటే.. ఎన్నిక‌ల్లో వృధా ఖ‌ర్చు పెట్ట‌డం బ‌దులు ఊళ్లోని ఆంజేయస్వామి వారి ఆల‌యాన్ని  ఎవ‌రైతే పూర్తి చేస్తారో వారినే గ్రామ  స‌ర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.  ఆ ఒక్క ఆల‌యానికే సుమారు 60, డెబ్బై ల‌క్ష‌ల మేర ఖ‌ర్చు అవుతుంద‌ని తేలడంతో.. ఆల‌య ఖ‌ర్చుల‌తో పాటు ఊరిలోని ఇత‌ర‌త్రా ప‌నుల లెక్క కూడా వేసి కోటి రూపాయ‌ల ని తేల్చారు.  అది పక్కన పెడితే సర్పంచ్ పదవుల వేలం తెలంగాణలో ఒక వెర్రిలా మారిపోయింది.  జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్​ ఆర్గనైజర్​  రూ.90 లక్షలకు, ఇదే మండలం గోర్లాఖాన్​దొడ్డిలో రూ.57 లక్షలకు,  లింగాపురం గ్రామంలో రూ.34 లక్షలకు వేలంలో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు.  ఇంకా  గద్వాల మండలం, కొండపల్లిలో రూ.60 లక్షలకు నల్లదేవునిపల్లిలో.. రూ.45 లక్షలకు వేలం పాట ద్వారా సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.  అదే విధంగా మల్దకల్​ మండలం సద్దలోనిపల్లి సర్పంచి పదవి వేలంలో  రూ.42 లక్షలు పలికిందంటున్నారు. వీరాపురంలో రూ.50 లక్షలు,   ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, జోగ్గూడెం రూ.20 లక్షలకు సర్పంచ్ పదవులను వేలంపాటలో దక్కించుకున్నారు.  పదవుల మోజే ఈ ‘వేలం వెర్రి’కి కారణమంటున్నారు. అంత వరకూ కష్టపడి సంపాదించుకున్నది మొత్తం ధారపోసి మరీ పదవులు దక్కించుకోవడానికి పడుతున్న పోటీ విస్మయం గొలపక మనదు. వాస్తవంగా చూస్తే సర్పంచ్ పదవి పెద్ద పవర్ ఉన్న పదవి కూడా కాదు. అయితే దాని కోసం ఇంత హంగామా, తాపత్రేయం, పోటీ ఎందుకు అని ప్రశ్నించే వారూ ఉన్నారు.   స‌ర్పంచ్ ప‌ద‌వుల విష‌యంలోనే  ఇంత వేలం వెర్రి ఉంటే.. ఇక కార్పొరేటర్, ఎమ్మెల్యే పదవులకు ఎంతెంత ఖర్చు పెట్టాల్సి వస్తుందోఅన్న చర్చ జరుగుతోంది.  ఈ వేలం ‘వెర్రి’ చూస్తుంటే రాజకీయాలు అవినీతి మయంగా మారడానికి కారణమేమిటో ఇట్టే అవగతమౌతుందంటున్నారు పరిశీలకులు.  

కాళేశ్వరంతో కాంట్రాక్టర్లే బాగుపడ్డారు.. కవిత నోట కాంగ్రెస్ మాట

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై తన విమర్శల స్వరం పెంచింది. ఇప్పటి వరకూ కేవలం హరీష్ రావు, సంతోష్ లన టార్గెట్ చేసుకుంటూ తన విమర్శల వాణి వినిపించిన కవిత.. ఇప్పుడు తండ్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంపైనా తన విమర్శలను సంధించారు. నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు. ఇప్పటి వరకూ కాళేశ్వరం నిరుపయోగం అనీ, అవినీతి సొమ్మలు వెనకేయడానికి మాత్రమే బీఆర్ఎస్ ఆ ప్రాజెక్టు చేపట్టి అంచనాలు పెంచుకుంటూ పోయి సొమ్ములు దండుకుందన్న విమర్శలు కాంగ్రెస్ నుంచే వచ్చాయి. ఇప్పుడు కవిత కూడా అదే వాణి, అదే బాణితో తన విమర్శలకు పదును పెట్టారు.   తాజాగా శుక్రవారం కామారెడ్డిలో మాట్లాడిన కవిత కాళేశ్వరంతో కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడలకు చుక్కనీరు వచ్చిన దాఖలాలు లేవన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్టర్లు బాగుపడటానికే తప్ప రైతులకు, రాష్ట్ర వ్యవసాయానికీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కుండబద్దలు కొట్టేశారు.    కాళేశ్వరం ప్రాజెక్టు కంటే జ‌మానాలో క‌ట్టించిన నిజాం సాగ‌రే ఎంతో నయమన్నారు. అయితే ఇప్పుడు అది మట్టి కూరుకుకోయి ఉందనీ, దానిని పూడిక తీయించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.  గ‌తంలో నిజాంసాగ‌ర్ ప‌ర్యాట‌కంగానూ ఎంతోబాగుండేద‌ని ఆ దిశగా కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తానిప్పుడు కాళేశ్వ‌రంపై చేసిన ఈ వ్యాఖ్యలపై ఇక బీఆర్ఎస్ నేతలు  నోరేసుకుని ప‌డిపోతార‌న్న కవిత.. చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలోని ఓ పంచ్ డైలాగ్ తో చురక వేశారు.  ఇప్పుడు తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలకూ, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన కవిత కాంగ్రెస్ రంగుల చీరకట్టడానికీ ముడి పెడుతూ పరిశీలకులు విశ్లేషణలకు పని చేప్పారు. ఆమె కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారనడానికి కవిత తాజా వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు.  కాళేశ్వరంపై కాంగ్రెస్  విమర్శలనే బాజాప్తుగా తాజాగా కవిత కూడా చేశారు.   ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విమర్శలు చేయాల్సిన అవసరం లేని పరిస్థితిని కవిత తన వ్యాఖ్యలతో కల్పిస్తున్నారంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇక కవిత విమర్శలకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్, హరీష్, కేసీఆర్ లను నిలదీస్తే పరిపోతుందంటున్నారు.  పరిస్థితి చూస్తుంటే.. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ గూటికి చేరడానికి అట్టే సమయంపట్టేలా లేదని కూడా చెబుతున్నారు.